హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ విద్యుత్తు ప్లాంట్ (ఎస్టీపీపీ) సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న మూడో యూనిట్ (800 మెగావాట్లు)కు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు లభించాయి. దీని నిర్మాణానికి రూ.6,789.96 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసి గత నెలలో టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. ప్రీబిడ్ సమావేశం ఈ నెల 9న జరగనున్నది. ఈ ప్రక్రియ మొత్తం జనవరిలోగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. మార్చిలో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించి 2026 కల్లా పూర్తిచేసి విద్యుదుత్పత్తి ప్రారంభించనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో దీని నిర్మాణం జరగనుండగా, ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ధర కూడా తక్కువ ఉండనున్నదని చెప్పారు.
ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఎస్టీపీపీలో 600 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్ల(మొత్తం 1200 మెగావాట్లు)లో విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. 800 మెగావాట్లతో మూడో యూనిట్ నిర్మించాలని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పూర్తయితే మొత్తం 2 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి కానుండగా, తెలంగాణకు కావాల్సిన మొత్తం విద్యుత్తులో 25 శాతం ఎస్టీపీపీ నుంచే అందుతుంది. కాగా, సోలార్ ప్లాంట్ల నిర్మాణంపై సింగరేణి సీఎండీ శ్రీధర్ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షించారు. ఎస్టీపీపీ రిజర్వాయర్లో నిర్మాణంలో ఉన్న 15 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్ ను వచ్చే మార్చి నాటికి, తొలి 5 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్ను డిసెంబర్ ఆఖరుకల్లా ప్రారంభించాలనీ సీఎండీ ఆదేశించారు. మూ డోదశలో మిగిలిన 66 మెగావాట్ల ప్లాంట్ను 2023 జూన్ కల్లా పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్కుమార్ సుర్, చీఫ్ ఆఫ్ ఓ అండ్ ఎం జేఎన్ సింగ్, ఎస్టీపీపీ జీఎం డీవీఎస్ఎస్ఎన్ రాజు, జీఎం జానకీరామ్, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకే విశ్వనాథరాజు, ఏజీఎం కేఎస్ఎన్ ప్రసాద్, ఏజీఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.