నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 5: పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బీఆర్ఎస్ నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్టౌన్ పీఎస్లో కనుకుంట్ల విష్ణుచరణ్ అనే విద్యార్థి బండిపై ఫిర్యాదు చేశాడు.
విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న బండిని కఠినంగా శిక్షించాలని కోరాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా మావల, జైనథ్, సిరికొండ, తలమడుగులో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మందమర్రి పోలీస్ స్టేషన్లో పదోతరగతి విద్యార్థులు ఐలవేని రామ్తేజ, బైరి తరుణ్, కోటపల్లి పోలీస్ స్టేషన్లో మల్లంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు ఇప్ప సాయివరుణ్, గోమాస భగవాన్ ఫిర్యాదు చేశారు.