Revanth Reddy | హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి 3 గం టల విద్యుత్తు చాలంటూ కారుకూతలు కూసి రైతుల ఆగ్రహానికి గురైన పీసీసీ చీఫ్ రేవంత్పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. ఆయన వ్యాఖ్యలు పార్టీకి చేటు చేసేలా ఉన్నాయని గుర్రు గా ఉన్న నేతలు బుధవారం ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తున్నది. అంతకుముందు ఓ నేత ఇంట్లో సమావేశమైన సీనియర్ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రైతులతో ముడిపడిన సున్నిత అంశంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని, కాంగ్రెస్పై రైతులు గుర్రుగా ఉన్నారన్న విషయాన్ని అధిష్ఠానం పెద్దలకు వివరించి చెప్పనున్నా రు.
ఈ విషయంలో సత్వరం జోక్యం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టకుంటే పార్టీకి రైతులు దూరమయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలపైనా ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తున్నది. పార్టీ తరఫున నిర్ణయాలను సైతం తమను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో రైతులపై చంద్రబాబు అనుసరించిన విధానాన్నే రేవంత్రెడ్డి పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్పై చర్యలు తీసుకోకుంటే పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని అధిష్ఠానానికి వివరించనున్నారు. మరోవైపు, కరెంటుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు పార్టీలోని ఒకరిద్దరు నేతలు తప్ప మెజార్టీ నేతల నుంచి మద్దతు కరువవడంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని, సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు చేయాలని పలుమార్లు ప్రెస్మీట్లు పెట్టి మరీ చెప్పినప్పటికీ నేతలు పట్టించుకోవడం లేదు. రేవంత్ వ్యాఖ్యలను సమర్థించి ఉంటే నేతలందరూ ఆయనకు మద్దతుగా రోడ్లపైకి వచ్చి ఉండేవారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.