Rythu Bandhu | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ లక్ష్యం నెరవేరింది. రైతులకు రైతుబంధు రాకుండా చేయాలన్న కుట్రలో పూర్తిగా సఫలమైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులపై ఫిర్యాదు చేసి రైతుబంధును అడ్డుకోవడంలో విజయం సాధించింది. రైతుల నోట్లో మట్టికొట్టి కాంగ్రెస్ నేతుల సంబురాలు చేసుకొంటున్నారు. తెల్లారితే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమవుతుందనగా నోటికాడి బుక్కను కాంగ్రెస్ లాగేసింది. రైతుబంధును ఆపేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకొన్న ఈసీ, ఈ నెల 24న ఇచ్చిన అనుమతిని రెండు రోజులు తిరక్కుండానే 26న రద్దుచేసింది. రైతుబంధులాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పీఎం కిసాన్ పథకంపై మాత్రం కాంగ్రెస్ పార్టీ గప్చుప్గా ఉన్నది.
రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకొచ్చింది. పెట్టుబడి అందటం ఆలస్యమైతే పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈసీకి వివరించి, ఒప్పించింది. దీంతో ఈ నెల 28వ తేదీ వరకు రైతుబంధు పంపిణీ చేయవచ్చని 24న ఈసీ అనుమతిచ్చింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీంతో 28వ తేదీన పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక్కడే కాంగ్రెస్ నేతలు మళ్లీ కుట్రలకు తెరలేపారు. రైతుబంధును ఆపాలని మరోసారి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొన్న ఈసీ మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయనగా ఆపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వార్త విన్న వెంటనే కాంగ్రెస్ పార్టీ నేతలు సంతోషంలో చిందులేస్తున్నారు. పెట్టుబడి సాయంపై పుట్టెడు ఆశలు పెట్టుకున్న రైతులు మాత్రం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు.
రైతుబంధు పథకంపై కాంగ్రెస్ పార్టీ తొలి నుంచీ వ్యతిరేకంగానే ఉన్నది. ఈ పథకాన్ని ఆపడమే లక్ష్యంగా కుట్రలు చేసింది. ఇందుకోసం అవకాశం ఉన్న ప్రతిచోట మళ్లీమళ్లీ ఫిర్యాదులు చేసింది. తొలుత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే స్వయంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్కు రైతుబంధుపై ఫిర్యాదు చేశారు. రైతుబంధు ఆపేయాలని, రైతులకు పెట్టుబడి సాయం అందకుండా చూడాలని కోరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కృషితో తిరిగి రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. అంతే… కాంగ్రెస్ పార్టీకి నిద్రకూడా పట్టినట్టు లేదు.
రైతులకు ఏ విధంగా రైతుబంధు వస్తదో చూస్తమని పంతం పెట్టుకున్నది. రైతుబంధును అడ్డుకునేందుకు మళ్లీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఆదివారం ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుబంధు వల్ల ఎన్నికలు ప్రభావితమవుతాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని హఠాత్తుగా రద్దు చేసింది. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టి రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై ఈసీ ఎన్నిమార్లు ప్రశ్నలు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ఓపిగ్గా సమాధానా లు ఇచ్చింది. రైతులకు రైతుబంధు అవసరాన్ని వివరించింది. చివరికి రైతుబంధు పంపిణీకి అనుమతి ఇచ్చేలా ఒప్పించింది. ఇక రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేద్దామని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ మరోసారి సైంధవుడి పాత్ర పోషించింది.
ఎన్నికల వేళ రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రైతులకు మేలు చేసే పార్టీ ఏదో, కీడు చేసే పార్టీ ఏదో గమనించుకోవాలని సూచిస్తున్నారు. అలా కాకుండా గుడ్డిగా, ఎవరో చెప్పింది నమ్మి అడ్డదిడ్డంగా ఓటేస్తే మాత్రం కష్టాలు పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇందుకు రైతుబంధును ఉదాహరణగా చూపుతున్నారు. రైతుబంధు సాయం రైతులకు ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పథకంపైనా కాంగ్రెస్ కుట్ర రాజకీయాలు చేసింది. రైతుల కష్టనష్టాలతో పట్టింపు లేకుండా రాజకీయ స్వలాభం కోసం నీచంగా వ్యవహరించింది. అదే సమయంలో బీఆర్ఎస్ మాత్రం రైతులకు మేలు చేసేలా ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో తమకు ఏ పార్టీ అండగా ఉంటుందో గుర్తెరిగి ముందుకు సాగాలని రాజకీయ విశ్లేషకులు రైతులకు సూచిస్తున్నారు.
పీఎం కిసాన్పై కాంగ్రెస్ గప్చుప్
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యగల లోపాయికారి ఒప్పందం బట్టబయలైంది. రైతుబంధు పంపిణీపై నానా యాగి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అదే సమయంలో కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్పై మాత్రం కిక్కురుమనడం లేదు. నవంబర్ 15వ తేదీన రాష్ట్రంలోని రైతులకు పీఎం కిసాన్ కింద రూ. 2 వేల సాయం జమ చేసింది. దీనిపై కాంగ్రెస్ ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ రైతుబంధుపై మాత్రం ఫిర్యాదులపై ఫిర్యాదులను చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఎం కిసాన్ పంపిణీకి అభ్యంతరం వ్యక్తం చేయని కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పంపిణీపై ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
అక్టోబర్ 23: ఈసీకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే లేఖ. రైతుబంధును ఆపేయాలని ఫిర్యాదు.
అక్టోబర్ 26: రైతుబంధు దుబారా అని ప్రకటించిన మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి.
నవంబర్ 24: రైతులకు రైతుబంధు సకాలంలో అందివ్వటం ఎంత ముఖ్యమో వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు లేఖలు రాయటంతో రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి.
నవంబర్ 28: రైతుబంధు పంపిణీకి అన్నీ సిద్ధం చేసిన రాష్ట్రప్రభుత్వం. 28న రైతుల ఖాతాల్లోకి డబ్బు జమచేయాలని నిర్ణయం.
నవంబర్ 26: రైతుబంధు ఆపాలంటూ ఈసీకి మరోసారి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్. ఎన్నికల సంఘానికి పీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ లేఖ.
నవంబర్ 27: నిరంజన్ ఫిర్యాదుపై స్పందించి రైతుబంధును ఆపేసిన ఈసీ.