Tealgnana | ‘ఏది సత్యం, ఏది అసత్యం? ఓ మహాత్మా.. ఓ మహర్షీ..’ అంటూ అంతులేని మీమాంసలో చిక్కుకొన్న శ్రీశ్రీ ఎంతో మథనపడుతూ అన్నారు. ఏది అబద్ధమో, ఏది నిజమో నిర్ధారించడం కొన్నిసార్లు కష్టం కావొచ్చు. కానీ, అసాధ్యమైన పనైతే కాదు. వేనోళ్ల నుంచి వచ్చే ఓ అబద్ధం కొంతకాలంపాటు నిజంగా చెలామణీ కావొచ్చు. అయితే, నిజదేవత నిద్రలేచిన శుభదినాన.. అసత్యరక్కసులు పొలిమేరలు దాటాల్సిందే. ఇప్పుడు సరిగ్గా ఆ సమయం రానేవచ్చింది.
– కడవేర్గు రాజశేఖర్
దేశాభివృద్ధికి గుజరాత్ నమూనానే శిరోధార్యమంటూ చేసిన డంబాచార ప్రచారం అంతా వట్టిదేనని తేటతెల్లమైంది. గుజరాత్ నమూనా ఓ ఫెయిల్యూర్ మాడల్ అని రుజువైంది. ఈ విషయం ప్రధానమంత్రివర్యులు నరేంద్రమోదీకి కూడా బాగా తెలుసు. అందుకే, మొన్నటివరకూ గుజరాత్ మాడల్పై ఊకదంపుడు ప్రచారాలు చేస్తూ.. ‘గుజరాత్.. మాయ్ బన్వాయ్ చే’ (గుజరాత్ను నేనే తయారు చేశా) అంటూ బీరాలకు పోయిన ఆయన ఇప్పుడు రూట్ మార్చారు. రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ఎన్నడూచూడని విధంగా మతతత్వాన్ని పెద్దయెత్తున ఎగదోస్తున్నారు. అయితే, ప్రజలేమీ అమాయకులు కారు. జరుగుతున్నదంతా గమనిస్తూనే ఉన్నారు. అందుకే, గుజరాత్ మాడల్ను నమ్మి గతంలో ఓట్లేసిన ఆ ప్రజలే.. ఇప్పుడు మతతత్వ రాజకీయాలకు సమాధికట్టారు. ఇకపై కూడా ఇదే జరుగుతుంది. ఇదే వాస్తవం.
63 ఏండ్ల వయసున్న గుజరాత్లో.. ఒకటికాదు రెండు కాదు 22 ఏండ్లుగా మోదీ హయాంలోనే బీజేపీ పాలనను వెలగబెడుతున్నది. సింహాలకు పురిటిగడ్డగా పిలిచే ఈ వజ్రపుతునక పరిస్థితి కమలహయాంలో ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ అనే చందంగా తయారైంది. ప్రగతికి రథచక్రాలుగా పిలిచే ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, సంక్షేమ, సాంకేతికత ఇలా అన్ని విషయంల్లోనూ ఇక్కడ అభివృద్ధి ఏ కోశానా కనిపించట్లేదు. తల్లి భరతమాతకు 29వ బిడ్డగా పురిట్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తెలంగాణలో దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైశాల్యం, జనాభా, ఆదాయపరంగా దశాబ్దాలుగా పెద్ద రాష్ర్టాలు సాధించలేని ఎన్నో కార్యాలను ఈ తొమ్మిదేండ్ల పసికూన ఇప్పటికే చేసి చూపించింది. ఇవి వట్టి మాటలు కాదు. గణాంకాలు చెబుతున్న నిప్పులాంటి నిజాలు. అందుకే యావత్తు జాతిజనులు ‘గుజరాత్ మాడల్ ఫెయిల్… తెలంగాణ మాడల్ సక్సెస్’ అంటూ నీరాజనాలు పలుకుతున్నారు.
****
‘గుజరాత్లో గొప్ప అద్భుతం చేసి చూపించాం. మమ్మల్ని గెలిపిస్తే, దేశమంతా ఆ అద్భుతం చేసి చూపిస్తాం’ అంటూ 2014 ఎన్నికలకు ముందు అప్పటి గుజరాత్ సీఎం మోదీ అందర్నీ నమ్మించారు. మోదీని ప్రధానిగా చేస్తే దేశమంతా అద్భుతం జరుగుతుందని నిజంగానే అందరూ విశ్వసించారు. ఇందులోభాగంగానే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీతో బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే, ప్రధాని చెప్పినట్టు గడిచిన తొమ్మిదేండ్లలో దేశంలో ఎలాంటి మార్పు జరుగకపోగా, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్యలు మరింతగా పెరిగాయి. ఏదో అద్భుతం జరుగుతుందనుకొంటూ ఆశగా చూసిన సామాన్యులకు నిరాశే మిగిలింది. దీంతో అందరూ ఆలోచనలో పడ్డారు. మోదీ చెప్పినట్టు ‘గుజరాత్లో నిజంగానే అద్భుతం జరిగిందా?’ అని ఆరా తీయడం మొదలెట్టారు. నిజాలు ఎంతోకాలం దాగవుగా. చివరకు గుజరాత్ అసలు గుట్టురట్టయ్యింది. దీంతో ‘గుజరాత్లో అద్భుతం జరిగితేగా.. ఆ మాడల్ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి?’ అని ప్రజలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
****
రాష్ట్రంగా ఏర్పడి 63 ఏైండ్లెనప్పటికీ, గుజరాతీలకు కనీస అవసరాలు ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలాయి. సౌరాష్ట్ర, కచ్, ఉత్తర, మధ్య, దక్షిణ గుజరాత్లోని గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉన్నట్టు జలవనరుల శాఖే పేర్కొంది. తెలంగాణలో ఒక్కో పౌరుడికి రోజుకు 150 లీటర్ల సురక్షితమైన తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తుంటే, 77 లీటర్లను కూడా సరఫరా చేయడానికి అక్కడి అధికారులు ఆపసోపాలుపడుతున్నారు. వ్యవసాయానికి నిరంతర సాగునీరు అనేది అక్కడ ఇప్పటికీ ఓ కలే. గుజరాత్లోని దాదాపు అన్ని జిల్లాల్లో పవర్కట్లు కొనసాగుతున్నాయి. విద్యుత్తుసరఫరా లేకపోవడంతో ప్రతిసంవత్సరం వేసవిలో వేలాది పరిశ్రమలు పవర్ హాలీడేలను ప్రకటిస్తున్నాయి కూడా. టెక్స్టైల్ క్యాపిటల్గా, వజ్రాల రాజధానిగా పేరుగాంచిన సూరత్ దేశానికే వన్నెతెచ్చింది. అయితే, కరోనా సంక్షోభం, ద్రవ్యోల్బణం, జీఎస్టీ, ముడిసరుకు ధరలు పెరిగిపోవడం, ప్రభుత్వప్రోత్సాహలేమి వెరసి దేశంలో ఈ రెండు రంగాలు ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నది. విద్య, పౌరుల రక్షణ, ఆర్థిక పరిస్థితుల విషయంలోనూ గుజరాత్ అధఃపాతాళానికి నడక సాగిస్తున్నది. రాష్ట్రంలో 906 బడులు కేవలం ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయంటే అక్కడ విద్యార్థుల చదువుల గోసను అర్థం చేసుకోవచ్చు. దేశంలో అత్యధికంగా కస్టడీ మరణాలు (లాకప్ డెత్) గుజరాత్లోనే జరుగుతున్నాయి. గడిచిన ఐదేండ్లలో ఇక్కడ 80 లాకప్డెత్ ఘటనలు చోటుచేసుకొన్నాయి. ఇక, గుజరాత్లోని ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒకటి దారిద్య్రరేఖకు దిగువనే బతుకీడుస్తున్నది. అంటే, ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుపేదగానే ఉన్నారు.
****
ఓ దేశం ప్రగతి సాధించిందో లేదో చూడాలంటే నీళ్లు, ఉద్యోగాలు, విద్యుత్తు, వ్యవసాయం, పౌరుల ఆదాయాన్ని బేరీజు వేస్తే సరిపోతుంది. ఈ విషయంలో నిన్నమొన్న పుట్టిన పసికూన తెలంగాణ ఎంతో ప్రగతి సాధించగా, వయసులో షష్ఠిపూర్తి చేసుకొన్న గుజరాత్ ఎంతో వెనుకబడిపోయింది. దీనికి ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వమే కారణమని చెప్పకతప్పదు. దాదాపు తెలంగాణకు రెట్టింపు జనాభా ఉన్న గుజరాత్లో శ్రామికశక్తి 41 శాతమే. అదే తెలంగాణలో 3 శాతం ఎక్కువ అంటే 44 శాతంగా శ్రామికశక్తి ఉన్నది. ఉద్యోగకల్పన ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నదో ఈ గణాంకాలతో స్పష్టమవుతున్నది. 19.1 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటుతో, రూ. 3,17,115 తలసరి ఆదాయంతో దేశంలోనే బలమైన ఆర్థికవ్యవస్థగా తెలంగాణ వడివడిగా అడుగులు వేస్తుంటే, 10.57 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటుతో, రూ. 2,50,100 తలసరి ఆదాయంతో గుజరాత్ కునారిల్లుతున్నది. ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడితే, తెలంగాణలో నక్సలైట్ల ప్రభావం పెరిగిపోతుందని, పరిశ్రమలు తరలిపోతాయని ఎంతోమంది భయపెట్టారు. అయితే, అవన్నీ అబద్ధాలని రుజువుచేస్తూ.. గడిచిన 9 ఏండ్లలోనే ఒక్క హైదరాబాద్లోనే 20 వేలకు పైగా కంపెనీల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఊతమిచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో 47,176 పెద్ద పరిశ్రమలు, ఐటీ కంపెనీలు ఉండగా, గుజరాత్లో ఈ సంఖ్య 34 వేలుగానే ఉన్నది. వ్యవసాయ, ఆదాయాభివృద్ధిరేటులో తెలంగాణ, గుజరాత్ మధ్య వరుసగా 10 శాతం, 17 శాతం అంతరం ఉండటం.. బంగారు తెలంగాణలో జరిగిన అభివృద్ధికి నిదర్శనం. ఇవన్నీ గాలిలో వేసిన లెక్కలు కానేకాదు. కేంద్రప్రభుత్వమే స్వయంగా వెల్లడించిన గణాంకాలు. అందుకే మోదీ ఊదరగొట్టిన గుజరాత్ మాడల్ వట్టి డొల్ల అని నిపుణులు సైతం ఒప్పుకొంటున్నారు. తెలంగాణ నమూనా దేశమంతటా రావాల్సిన అవసరమున్నదని ప్రతి పౌరుడూ ముక్తకంఠంతో చెప్తున్నాడు.
గుజరాత్ అలా.. | తెలంగాణ ఇలా |
‘గుజరాత్ మాడల్ అనేది ప్రజలకు సంక్షేమ ఫలాలను పంపిణీ చేసే మాడల్ కాదు. అది ప్రైవేటు వ్యాపారవేత్తలను ప్రోత్సహించే మాడల్ మాత్రమే’
-ప్రఖ్యాత ఆర్థికవేత్త, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జగదీశ్ భగవతి |
తెలంగాణ వయసులో చిన్నదే కావచ్చు. అయితే అభివృద్ధిలో కాదు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏటా 9 శాతానికి పైగా సమ్మిళిత వృద్ధి సాధిస్తున్నది.
-నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ |
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. పుట్టింటి సారె.. కేసీఆర్ కిట్
పురిటికి వచ్చిన ఆడబిడ్డకు సారె పెట్టి సాగనంపడం పుట్టింటి సంప్రదాయం. కడుపులో పడ్డ బిడ్డను నవమాసాలూ ఆరోగ్యంగా మోయడానికి, పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఆడకూతురుకు అందిస్తున్న సారె కేసీఆర్ కిట్. నిరుపేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత కూడా పనులకు వెళ్లక తప్పని పరిస్థితి. నాలుగు చేతులు కష్టపడితే గానీ ఆ కుటుంబం గడవని దుస్థితి. శారీరక శ్రమ పెరగడం, పోషకాహార లోపం ఆ తల్లి పురిటి కష్టాలను రెట్టింపు చేసేవే! స్వరాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డకు ఈ కష్టాలు తెలియవు. గర్భిణులకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కేసీఆర్ కిట్. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యి, శిశువుకు తొమ్మిది మాసాలు వచ్చే వరకు విడతల వారీగా రూ.13వేల ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇప్పటివరకు రెండులక్షల మంది గర్భిణులకు రూ.1400 కోట్ల మేర నిధులు అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకంతో దవాఖానలో ప్రసవాలు వంద శాతానికి చేరాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు గణనీయంగా పెరిగాయి. గర్భిణులకు ఎప్పటికప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతిబిడ్డకూ సమయం తీరుగా టీకాలు అందుతున్నాయి. నవజాత శిశువుకు, బాలింతకు కావాల్సిన వస్తువులు అన్నీ కిట్ ద్వారా సమకూరుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో మాతాశిశు మరణాలు రికార్డు స్థాయిలో తగ్గాయి. దేశంలో అతి తక్కువ మాతృ, శిశు మరణాల రేటు కలిగి ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉండటం కేటీఆర్ కిట్ సాధించిన విజయం.
మాతృ మరణాల రేటు: 2014లో- 92, ప్రస్తుతం- 43
శిశు మరణాల రేటు: 2014లో- 35, ప్రస్తుతం- 21
22 ఏండ్ల మోదీ గుజరాత్.. తల్లికి దక్కింది చిల్లిగవ్వే!
దేశానికే ఆదర్శమని గొప్పలు చెప్పుకొనే గుజరాత్ సర్కార్ కాబోయే అమ్మకు ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏం లేదు! గర్భిణులకు ఆర్థిక సాయం అందించేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాతృవందన యోజనను మాత్రమే అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మ క్షేమానికి నయాపైసా వెచ్చించకపోవడం శోచనీయం. దీంతో నెలలు నిండుతున్నా పనులకు వెళ్తున్నారు గుజరాత్ ఆడపడుచులు. దీంతో కొందరు తల్లులు గర్భశోకాన్ని అనుభవిస్తున్నారు. మరికొందరు పిల్లలు కన్నుతెరవక ముందే కన్నతల్లిని దూరం చేసుకుంటున్నారు. అతి తక్కువ మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్) కలిగి ఉన్న రాష్ర్టాల్లో గుజరాత్ ఏడో స్థానంలో ఉండటం గమనార్హం. నవజాత శిశుమరణాల రేటు (ఐఎంఆర్)లోనూ ఆ రాష్ట్రం వెనుకబడే ఉంది.
మాతృ మరణాల రేటు: 2014లో- 91, ప్రస్తుతం- 57
శిశు మరణాల రేటు: 2014లో- 35, ప్రస్తుతం- 23ఆశా కార్యకర్తలకు వేతనాలు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. ఆకాశమెత్తు ‘ఆశా’దీపం
పల్లెను ఆరోగ్యంగా ఉంచడంలో ఆశా కార్యకర్తలది కీలకపాత్ర. కాబోయే అమ్మను కంటికి రెప్పలా కాపాడటంలో వాళ్లు సాక్షాత్తు అశ్వినీ దేవతలే! వారి సేవలకు సలామ్ కొట్టి ఊరుకుంటే సరిపోదు. గౌరవప్రదమైన వేతనం అందించి వారి రుణం తీర్చుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలు నెలకు రూ.9,750 వేతనం అందుకుంటున్నారు. ఆశా కార్యకర్తలకు అత్యధిక వేతనాలు అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. డిమాండ్లు లేవు, నిరసనలు అంతకన్నా లేవు. అసలు అడిగిందే లేదు. అయినా, వారి సేవలకు తగురీతిలో ప్రతిఫలం ఇవ్వాలని భావించారు ముఖ్యమంత్రి. వేతన పునర్ వ్యవస్థీకరణ (పీఆర్సీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం 33 శాతం పెంచినట్టుగానే, ఆశా కార్యకర్తల వేతనాలనూ 33 శాతం పెంచారు. అంతేకాదు, వారికి ప్రత్యేకంగా సెల్ఫోన్లు అందించి ‘స్మార్ట్’వర్క్ చేసేలా ప్రోత్సహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
ఆశా కార్యకర్తల వేతనం
2014లో.. రూ. 1,500, ప్రస్తుతం: రూ. 9,750
22 ఏండ్ల మోదీ గుజరాత్.. అరకొర పెంపు..వేధింపు
సంపదలో మేటి అని చెప్పుకొన్న గుజరాత్లో ఆశా వర్కర్లకు మిగిలింది నిరాశే! రూపాయి వేతనం పెరగాలన్నా రోడ్లెక్కాల్సిందే. వేతన వెతలు తీర్చకపోగా.. వారిని విభజించి పబ్బం గడుపుకొన్నారు. ఆశా కార్యకర్తలను ఆశా వర్కర్లు, ఫెసిలిటేటర్లుగా విడదీసి వేతనంలోనూ వ్యత్యాసం చూపారు. 2017లో ఆశా వర్కర్ల వేతనం రూ.2,000 మాత్రమే! తమ జీతాలు పెంచాలని రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. వారాలపాటు ఉద్యమిస్తే జీతాలు 30 శాతం పెంచుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ, ఉద్యమానికి నాయకత్వం వహించిన కార్యకర్త చంద్రిక సోలంకి సహా పలువురిని ఉద్యోగం నుంచి తొలగించారు. చంద్రికపై కేసులు నమోదు చేశారు. గతేడాది 45వేల మంది ఆశా కార్యకర్తలు మరోసారి ఉద్యమించారు. గత్యంతరం లేక రూ.2,000 పెంచింది అక్కడి ప్రభుత్వం.
ఆశా కార్యకర్తల ప్రస్తుత వేతనాలు
ఆశా వర్కర్లకు రూ.8,500; ఆశా ఫెసిలిటేటర్లకు రూ.6,000వడ్డీలేని రుణాలు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. ఒత్తిడి లేని సాయం
అవకాశం ఇస్తే ఏ రంగంలో అయినా అతివ గెలుపుబావుటా ఎగురవేస్తుంది. పుట్టుకతోనే పొదుపు మంత్రాన్ని ఒంటబట్టించుకున్న ఆమెకు దన్నుగా నిలిస్తే మదుపులోనూ మేటిగా నిలుస్తుంది. అలాంటి మహిళలకు అండగా ఉంటున్నది తెలంగాణ ప్రభుత్వం. మహిళా సాధికారతను మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నది. తొమ్మిదేండ్లుగా స్వయం సహాయక సంఘాలకు మిత్తి లేని రుణాలు అందిస్తున్నది. ఎలాంటి తాకట్టు లేకుండానే సుమారు రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణం మంజూరయ్యేలా ప్రభుత్వం సమన్వయం చేస్తున్నది. గడిచిన తొమ్మిదేండ్లలో బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు సుమారు రూ.85వేల కోట్ల రుణాలు అందించింది. ఈ మొత్తానికి వడ్డీని రాష్ట్ర సర్కారే చెల్లిస్తున్నది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మహిళా సంఘాలలోని సుమారు 65 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు ఈ రుణాలు రూ.3,000 కోట్లు ఉండగా, ఇప్పుడవి ఐదురెట్లు పెరిగి ఏటా రూ.15 వేల కోట్లకు చేరాయి. వడ్డీ భారం లేని రుణ సాయంతో స్వయం ఉపాధి మార్గాల్లో తమ సత్తా చాటుతూ ఘనంగా జీవనం సాగిస్తున్నారు తెలంగాణ ఆడబిడ్డలు..
వడ్డీలేని రుణాలు ప్రారంభం: 2015
ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన మిత్తి: రూ.3,681 కోట్లు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. లక్షకే పరిమితం
అన్ని వర్గాలూ నిర్లక్ష్యానికి గురైనట్టే.. ప్రధాని ఇలాఖాలో మహిళా సాధికారత కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైంది. సంపన్న రాష్ట్రంగా గొప్పలు చెప్పుకొనే గుజరాత్లో వడ్డీలేని రుణాల పథకం 2020లో ప్రారంభమైంది. అదీ ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా 2020 సెప్టెంబర్ 17న మొదలుపెట్టారు. దీనికి ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష్ యోజన అని పేరు పెట్టారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు లక్ష రూపాయల లోపు రుణాలకు మాత్రమే వడ్డీ మినహాయింపు ఇవ్వడం గమనార్హం..
పథకం ప్రకటించింది: 2020
కేటాయించిన బడ్జెట్: రూ.1,000 కోట్లు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. వంద శాతం విజయవంతం
పల్లె కడిగిన ముత్యంలా ఉన్నప్పుడే ప్రజారోగ్యం పరిఢవిల్లుతుంది. ఈ సంకల్పంతోనే గ్రామాల్లో బహిరంగ మల విసర్జనను నూటికి నూరు శాతం నివారించి దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. కొన్నేండ్లుగా బహిరంగ మల విసర్జన లేని ఓడీఎఫ్ రాష్ట్రంగా నిలుస్తున్న తెలంగాణ.. ఇప్పుడు ఓడీఎఫ్ ప్లస్లోనూ టాప్ ర్యాంక్ సాధించింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఓడీఎఫ్ ప్లస్ ర్యాంకింగ్ను సాధించి స్వచ్ఛ తెలంగాణగా అవతరించింది. ఈ ఏడాది మార్చి 12 నాటికి కేంద్ర ప్రభుత్వం సర్వే చేసి వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు, ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ప్రతి ఒక్కరికీ మరుగుదొడ్డి సౌకర్యం (యాక్సెస్) ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలిచింది. రాష్ట్రంలో 99.50 శాతం ప్రజలకు మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నదని, 99.80 శాతం మందికి టాయిలెట్ యాక్సెస్ ఉన్నట్టు వెల్లడించింది.
2023 మార్చి 12 నివేదిక ప్రకారం..
తెలంగాణలోని గ్రామాలు: 12,769
ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు:12,769
శాతం: 100
22 ఏండ్ల మోదీ గుజరాత్.. 40 శాతం.. దయనీయం
స్వచ్ఛ భారత్’ అంటూ ఊదరగొట్టిన ప్రధాని తన స్వరాష్ట్రంలో మాత్రం ఆశించిన లక్ష్యాన్ని సగం కూడా అందుకోలేకపోయారు. బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా గుజరాత్ 2017 అక్టోబర్ 2న బహిరంగంగా ప్రకటించుకున్నది. కానీ, ఆ లెక్కలు తప్పని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కుండబద్దలు కొట్టింది. కాగ్ ప్రతినిధులు 120 గ్రామ పంచాయతీలు తనిఖీ చేయగా 29 శాతం ఇండ్లలో మరుగుదొడ్డి సౌకర్యం లేదని లెక్క తేలింది. ఎనిమిది జిల్లాల్లోని మొత్తం 54,008 ఇండ్లను పరిశీలించగా కేవలం 15,728 ఇండ్లకు మాత్రమే మరుగుదొడ్డిని వినియోగించే అవకాశం ఉందని నిగ్గు తేల్చింది. అంతేకాదు 2012 నాటికి ఉన్న ఇండ్ల జాబితా ఆధారంగా సర్వే చేసి నివేదిక రూపొందించారని, ఆ తర్వాత కట్టిన ఇండ్ల మాటేమిటి అని విమర్శించింది. ఈ సంగతి ఇలా ఉంటే గుజరాత్లో 40 శాతం గ్రామాలు మాత్రమే ఓడీఎఫ్ ప్లస్గా కేంద్రం ప్రకటించడం అక్కడి పాలకుల ‘స్వచ్ఛ’తకు నిదర్శనం.
2023 మార్చి 12 నివేదిక ప్రకారం..
గుజరాత్లోని గ్రామాలు: 18,618
ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు: 7,533
శాతం: 40
ఉరుకుల గోదావరిని దశాబ్దాలపాటు ఊరికే వదిలేశారు. తనను ఒడిసిపట్టుకోలేని బిడ్డలను చూసి తల్లడిల్లుతున్న తల్లి గోదావరి ఆర్తిని అర్థం చేసుకున్న భగీరథుడు కేసీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పించి కడలి ముందు కానవచ్చే అఖండ గోదావరిని తెలంగాణ గడ్డ మీద ఆవిష్కరించారు. సముద్ర మట్టానికి పదుల అడుగుల ఎత్తులో పారే నదీ జలాలను బాహుబలి పంపుల ద్వారా అర కిలోమీటర్కు పైగా పైపైకి పంపి భళీ అనిపించుకున్నారు. 23 జిల్లాలను సస్యశ్యామలం చేసే ఈ అద్భుత ప్రాజెక్టు నిర్మించడానికి పట్టిన సమయం కేవలం మూడేండ్లు. మూడు బరాజ్లు, 20 పంపింగ్ స్టేషన్లు, 22 పంప్ హౌజ్లు, 104 పంపింగ్ యంత్రాలు, 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు.. ఇలా కాళేశ్వరం గురించి చెప్పుకొంటూ పోతే ప్రతీదీ రికార్డే! ఒకప్పుడు కరువుకు మారుపేరుగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో నిండుకుండలా తొణికిసలాడుతున్నది. వేల కిలోమీటర్ల కాలువలు, వేలాది చెరువుల్లో గోదావరి జలాలు.. తెలంగాణ నేలంతా పసిడి పంటల నెలవుగా మార్చేశాయి.
ప్రాజెక్టుకు శంకుస్థాపన: 2016 జూన్ 2
ప్రారంభం: 2019 జూన్ 21
కట్టిన సమయం: 3 ఏండ్లు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. 16 ఏండ్లు పట్టింది
గుజరాత్లో నర్మదా నదిపై ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మించాలన్నది భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ఆకాంక్ష. 1963లో దేశ తొలి ప్రధాని నెహ్రూ ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1987లో డ్యామ్ పనులు మొదలయ్యాయి. 1990లో జనతాదళ్ పొత్తుతో గుజరాత్లో బీజేపీ అధికార ప్రస్థానం మొదలైంది. 1998 నుంచి నేటి వరకూ ఆ రాష్ట్రంలో పూర్తిస్థాయి అధికారం బీజేపీదే! ఇందులో పదమూడేండ్లు ప్రస్తుత ప్రధాని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2001లో మోదీ మరోసారి పనులకు శ్రీకారం చుట్టారు. పదహారేండ్లకు గానీ సర్దార్ సరోవర్ డ్యామ్ పూర్తికాలేదు. ముక్కీమూల్గి పూర్తిచేసిన ప్రాజెక్టును 2017లో ప్రధాని హోదాలో మోదీ జాతికి అంకితమివ్వడం వారి పట్టుదల ఏపాటిదో చెబుతుంది!
ప్రాజెక్టుకు భూమి పూజ: 1987 ఏప్రిల్
ప్రారంభం: 2017 సెప్టెంబర్ 17
పట్టిన సమయం: 30 ఏండ్లు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. వేతన పెంపు 325 శాతం
తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే సంకల్పంతో ఎన్నో సంస్కరణలు చేపట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. సకల వ్యవస్థలనూ బలోపేతం చేయడమే లక్ష్యంగా మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా అంగన్వాడీ టీచర్ల బతుకుల్లో కొత్త ఆశలు నింపారు. రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు దేశంలోనే అత్యధికంగా వేతనాలు అందుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి అంగన్వాడీ టీచర్లకు రూ.4,200, సహాయకులకు రూ.2,200 వేతనాలు ఉండేవి. మూడు దఫాలుగా వారి వేతనాలు పెంచారు ముఖ్యమంత్రి. గ్రామీణ సమాజానికి వారు చేస్తున్న సేవలను గుర్తించి అడగకముందే జీతాలు పెంచడం విశేషం. అంగన్వాడీ టీచర్లకు 325 శాతం, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు 354 శాతం వేతనాలు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 31,711 అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 72వేల మంది వీటిల్లో పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని అంగన్వాడీలకు ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నది. కేంద్రం జలశక్తి శాఖ సర్వే ప్రకారం రాష్ట్రంలో 27,310 అంగన్వాడీ కేంద్రాలకు నల్లా ద్వారా తాగునీరు సరఫరా అవుతున్నది.
తెలంగాణలోని అంగన్వాడీలు: 35,700
టీచర్లకు వేతనం: రూ.13,650
సహాయకులకు వేతనం: రూ. 7,800
22 ఏండ్ల మోదీ గుజరాత్.. అడిగినా అంతంతే!
మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో అంగన్వాడీ వ్యవస్థ అధ్వానంగా నడుస్తున్నది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం 2,296 అంగన్వాడీ కేంద్రాల్లో రక్షిత తాగునీటి సదుపాయం లేదు. 1,564 అంగన్వాడీల్లో మరుగుదొడ్లు లేవు. 5,925 సెంటర్లు ఇరుకైన భవనాల్లో కొనసాగుతున్నాయి. 2,943 సెంటర్లు సహకార భవనాల్లో, 6,923 కేంద్రాలు అద్దె ఆవాసాల్లో నిర్వహిస్తున్నారు. అంగన్వాడీలు వేతనాల పెంపు కోసం పదిహేనేండ్లుగా ప్రభుత్వంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి రూ.500, రూ.700 పెంచి చేతులు దులుపుకొన్నారు పాలకులు. గతేడాది సెప్టెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు వేతనాల పెంపుకోసం రోడ్లెక్కారు. ధర్నాలు, రాస్తారోకోల తర్వాత ఎట్టకేలకు దిగొచ్చిన గుజరాత్ సర్కార్ అంగన్వాడీ టీచర్లకు రూ.2,200, సహాయకులకు రూ.1,550 వేతనం పెంచింది.
అంగన్వాడీ కేంద్రాలు: 53,029
టీచర్ల వేతనం: రూ.10వేలు
సహాయకుల జీతం: రూ.5,500
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. ఇది కదా ఆసరా!
కట్టుకున్నవాడు దూరమైతే నిరుపేద ఆడపడుచు బతుకు దుర్భరంగా మారుతుంది. జాలిగా చూసే చూపుల్లో వికృత కోణాలు వితంతువు మనసు చిధ్రం చేస్తుంటాయి. కల్లబొల్లి మాటల భరోసా కాదు వాళ్లకు కావాల్సింది. ఆకలి తీర్చే ఆసరా అవసరం. అలాంటి ఆసరాను అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఆమె బతుకు జరుగుబాటుకు ఢోకా లేకుండా రూ.2,016 పెన్షన్ అందిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఇది కేవలం రూ.200గా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వితంతువులకు ముందుగా వెయ్యి రూపాయల పెన్షన్ అందజేసింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత రూ.2,016 అందిస్తున్నది. రాష్ట్రంలో ఆసరా పథకం కింద వితంతువులకు ఏటా రూ.3,800 కోట్ల సాయం అందుతున్నది. రేషన్ కార్డు ఉన్న వితంతువులు అందరూ ఆసరా పెన్షన్కు అర్హులే!.
లబ్ధిదారులు: 15,72,876
పెన్షన్: రూ.2,016
22 ఏండ్ల మోదీ గుజరాత్.. ఎక్కడున్నది భరోసా?
గుజరాత్లో వితంతువులకు గతంలో రూ.వెయ్యి పెన్షన్ ఇచ్చేవారు. ఈ సాయాన్ని పెంచాలని కొన్నేండ్లుగా వారు విజ్ఞప్తి చేస్తుండటంతో.. 2020లో ‘గుజరాత్ విధవ సహాయ్ యోజన’ పేరుతో వితంతు పెన్షన్ను పెంచింది అక్కడి ప్రభుత్వం. నాటి నుంచి రూ.1,250 ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇందులో రాష్ట్ర వాటా రూ.750 కాగా, కేంద్రం రూ.500 అందిస్తున్నది. 18 నుంచి 60 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లు మాత్రమే దీనికి అర్హులు. ఆదాయ ధృవపత్రం సమర్పించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ఠ ఆదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలుగా నిర్ధారించారు. రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వం కేవలం రూ.550 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నది. పైగా వితంతువుకు కుమారుడికి 21 ఏండ్లు రాగానే తల్లికి పెన్షన్ నిలిపివేయడం విడ్డూరం.
లబ్ధిదారులు: 3.70 లక్షలు
పెన్షన్: రూ.1,250
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. ఎల్లలు దాటించే ప్రోత్సాహం
తెలంగాణ బిడ్డలు చదువుల్లో మేటిగా నిలవాలని సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాల విద్యను పటిష్ఠం చేయడంతోపాటు విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు సాయం అందిస్తున్నది. ‘ఓవర్సీస్ స్కాలర్షిప్’ పథకంతో విదేశాల్లో చదువుకోవాలన్న విద్యార్థుల కలలకు రెక్కలు తొడిగింది. ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ పేరుమీద, బీసీలకు మహాత్మా జ్యోతిబా ఫూలే పేరుతో, పేద బ్రాహ్మణులకు వివేకానంద పేరుమీద, ముస్లింలకు సీఎం ఓవర్సీస్ పేరుతో రూ.20 లక్షల వరకు ఉపకార వేతనం అందిస్తున్నది. ఈ డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాలో జమవుతాయి. ఒక్కపైసా తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. ఇప్పటివరకు 935 మంది ఎస్సీ (రూ.167.71కోట్లు), 208 మంది ఎస్టీ (రూ.34.50కోట్లు), 2,539 మంది బీసీ (రూ.287.33కోట్లు), 2,402 మంది మైనారిటీ (రూ.394.02కోట్లు), బ్రాహ్మణ పరిషత్ ద్వారా 617 మంది (రూ.64.24కోట్లు) విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్షిప్ పొందారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
మొత్తం లబ్ధిదారులు: 6,701
ఉచితంగా ఇచ్చిన మొత్తం: రూ.947.8కోట్లు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. ఆశలకు రుణ పాశం
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం రుణపాశంతో కట్టివేస్తున్నది. 2018-19 నుంచి ఈ రుణ సదుపాయం కల్పించింది. విద్యార్థులకు గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు మాత్రమే అందిస్తుంది. ఈ మొత్తంపై నాలుగు శాతం మిత్తి వసూలు చేస్తూ.. అతి తక్కువ వడ్డీరేటు అని గొప్పలు చెప్పుకొంటున్నది. అగ్రవర్ణాల్లో వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారికి రూ.13 లక్షల వరకు రుణం మంజూరు చేస్తున్నది. వీరి నుంచి ఏటా 5 శాతం వడ్డీ వసూలు చేస్తున్నది. పైగా కనీసం 60 శాతం మార్కులతో పాస్ అయినవారికే వర్తిస్తుందని మెలికపెట్టింది. ఈ రుణం పొందిన విద్యార్థులు కోర్సు పూర్తయిన ఒక సంవత్సరం తర్వాతి నుంచి తిరిగి ఈఎంఐ పద్ధతిలో ప్రభుత్వానికి రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణ పథకం కింద ఏటా సగటున రూ.25 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తున్నది గుజరాత్ ప్రభుత్వం.
ఇచ్చేది అప్పు మాత్రమే
దానికి 4% వడ్డీ
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. మన బస్సు దర్జాగా!
ప్రజా రవాణాలో ఆర్టీసీ బస్సులది కీలకపాత్ర. అభివృద్ధి జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నా సగటు మనిషి పొలిమేర దాటాలంటే ముందుగా గుర్తొచ్చేది బస్సే! పల్లె నుంచి పట్నం వరకు ఆర్టీసీ సేవలు అత్యవసరం. స్వాతంత్య్రం రాకముందు 1932లోనే తెలంగాణ ప్రాంతంలో (నిజాం స్టేట్) ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. 1951లో హైదరాబాద్ రాష్ట్ర ఆర్టీసీగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ క్రమంగా నష్టాలబాట పట్టింది. నష్టాల్లో ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం తరఫున కార్పొరేషన్కు భారీగా నిధులు ఇస్తున్నారు. ఉద్యోగులకు పీఆర్సీలు ప్రకటిస్తూ, వేతనాలు పెంచుతున్నారు. తాజాగా మరోసారి వేతనాలు పెరిగాయి. కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఆర్టీసీ మొత్తం 3,315 రూట్లలో సేవలు అందిస్తున్నది. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నది ప్రభుత్వం. అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే డబుల్ డెకర్ బస్సుల సేవలు కూడా ప్రారంభమయ్యాయి. ఆర్టీసీకి అనుబంధంగా ప్రారంభించిన పార్సిల్ సేవలు సంస్థకు మంచి లాభాలను తీసుకొస్తున్నాయి.
ప్రస్తుతం ఆర్టీసీలో బస్సులు: 9,384
ఉద్యోగులు: 43,971 మంది
ప్రయాణికుల సగటు (రోజుకు): 45 లక్షలు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. చాలీచాలని సర్వీసులు
గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 1960లో ప్రారంభమైంది. రాష్ట్రంలో 18,676 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. బస్సులు మాత్రం 8,703 మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రజలకు సరిపడా బస్సులు అందుబాటులో లేవు. బస్సుల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో బస్సు కోసం పడిగాపులు కాయడం గుజరాత్ ప్రజలకు నిత్యకృత్యం. బస్సు వచ్చినా సీటు కోసం యుద్ధం చేయక తప్పని పరిస్థితి..
బస్సులు: 8,703
ఉద్యోగులు: 40 వేల మంది
ప్రయాణికుల సగటు (రోజుకు): 16.19 లక్షలు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. ప్రజలకు నయా వైద్యం
తెలంగాణ వచ్చేనాటికి అంపశయ్యపై ఉన్న ఆరోగ్య రంగానికి శస్త్రచికిత్స చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ప్రజారోగ్య వ్యవస్థను పటిష్ఠం చేసింది. కొత్త నియామకాలు, కొత్త భవనాలు, దవాఖానల అప్గ్రేడేషన్ చేపట్టింది. తాజాగా వైద్యారోగ్యశాఖలో 12,755 పోస్టులు భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. పల్లెదవాఖానలు, బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా దవాఖానలు, టీచింగ్ హాస్పిటళ్లతో ఆరోగ్య వ్యవస్థకు బలమైన నెట్వర్క్ ఏర్పాటుచేసింది తెలంగాణ ప్రభుత్వం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తూ ప్రజలకు స్పెషాలిటీ సేవలను చేరువ చేస్తున్నది. వరంగల్ నగరంలో భారీస్థాయిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దవాఖానను నిర్మిస్తున్నది. దీంతోపాటు హైదరాబాద్ గచ్చిబౌలిలో టిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. నగరానికి మరో మూడు దిశల్లో మూడు భారీ వైద్యశాలలు నిర్మాణం చేపడుతున్నది. మొత్తంగా సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించింది. దాంతో ‘నేను రానో బిడ్డా సర్కారు దవాఖానకు’ అని గతంలో పాడేవారు కాస్త నేడు ‘నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు’ అని పాడుతున్నారు. ‘దటీజ్ తెలంగాణ గవర్నమెంట్ హాస్పిటల్’
22 ఏండ్ల మోదీ గుజరాత్.. ఆస్పత్రికి పాత రోగం
ఈ ఏడాది ఫిబ్రవరి 28న గుజరాత్ రాష్ట్రం పంచమహల్ జిల్లా కలోల్లో ఉన్న ప్రభుత్వ దవాఖానకు స్థానికులు తాళం వేశారు. కొన్ని నెలలుగా అక్కడ వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేరని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహంతో ఈ పనిచేశారు. గుజరాత్లోని దవాఖానల దీనావస్థకు ఇదొక నిదర్శనం. రిజర్వు బ్యాంకు గతంలో ఇచ్చిన నివేదిక ప్రకారం గుజరాత్లోని ప్రభుత్వ దవాఖానల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 99 శాతం ఉన్నట్టు తెలిపింది. మొత్తం 1,392 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు అవసరం కాగా, ప్రభుత్వం 268 పోస్టులు మాత్రమే మంజూరు చేసిందని, ఇందులో 13 పోస్టులు మాత్రమే భర్తీ చేసిందని వెల్లడించింది. అంతే కాదు డిసెంబరు 2022 నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1974 వైద్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయని నెలక్రితం అసెంబ్లీలో గుజరాత్ సర్కారు వెల్లడించింది. ఇటీవల మోదీ రాక కోసం ఆస్పత్రిని ఆగమేఘాలపై తీర్చి దిద్దడం చూశాం.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. లక్ష కిలోమీటర్ల పురోగతి
రాష్ట్ర ప్రగతి పథం సరైన దిశలో సాగుతుందో లేదో రహదారులను చూసి చెప్పొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రోడ్లు హీనంగా ఉండేవి. అతుకులు, గతుకులు, మట్టి రోడ్లు ఇదీ సీను. కంకర తేలిన రోడ్లు పురోగతికి స్పీడుబ్రేకర్లుగా పరిణమించేవి. ఇప్పుడు తెలంగాణ రోడ్లు తళతళ మెరుస్తున్నాయి. పల్లె దారులూ బీటీరోడ్లుగా మారిపోయాయి. మండల, జిల్లా కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్లు అభివృద్ధికి దారితీస్తున్నాయి. రాష్ట్ర రహదారులన్నీ దాదాపుగా నాలుగు లేన్లుగా మారాయి. ఇక.. జాతీయ రహదారులపై ప్రత్యేకమైన దృష్టిపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో సఫలమైంది రాష్ట్ర సర్కార్. ఫలితంగా జాతీయ రహదారుల నిడివి తొమ్మిదేండ్లలోనే రెట్టింపు అయింది. మొత్తంగా రాష్ట్రంలోని రహదారుల నెట్వర్క్ 1.09 లక్షల కిలోమీటర్లకు చేరింది. 2017లో రాష్ట్రంలో 98వేల కిలోమీటర్ల రోడ్లు ఉండగా.. ఐదేండ్లలో సుమారు 10వేల కిలోమీటర్లు అదనంగా పెరిగింది.
మొత్తం రోడ్డు నెట్ వర్క్: 1,09,260 కి.మీలు
గ్రామీణ రహదారులు: 67,527 కి.మీలు
ఆర్ అండ్ బీ రోడ్లు: 27,737 కి.మీలు
జీహెచ్ఎంసీ రోడ్లు: 9,013 కి.మీలు
lజాతీయ రహదారులు: 4,983 కి.మీలు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. అంతన్నారు.. కొంతకే ఆగారు!
అభివృద్ధిలో గుజరాత్ ఏనాడో దూసుకుపోయిందని అంతన్నారు, ఇంతన్నారు! కానీ, ఈ వింత ఎంతుందో అని ఆరా తీస్తే.. కొంతే అని దారి కాచిన నిజం బట్టబయలైంది. విస్తీర్ణ పరంగా తెలంగాణ కన్నా పెద్ద రాష్ట్రమైన గుజరాత్ రోడ్ నెట్వర్క్లో మాత్రం చిన్నదే అని తేలిపోయింది. ఆ రాష్ట్రంలో ఇప్పటికీ అనేక గ్రామాలకు సరైన రవాణా సదుపాయం లేదు. అతుకులు, గతుకులు లేకుండా సాఫీగా సాగే మార్గాలు లేవని క్షేత్రస్థాయిలో తేటతెల్లం అవుతున్నది. 2017 నాటికి రాష్ట్రంలో 81,246 కిలోమీటర్ల రహదారులు ఉండగా.. 2021 నాటికి 81,523 కిలోమీటర్లకు చేరింది. అంటే నాలుగేండ్లలో కేవలం 377 కిలోమీటర్ల మేర మాత్రమే కొత్త రోడ్లు వేశారు. ఇవి కూడా జాతీయ రహదారులు కావడం గమనార్హం. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కొత్త రోడ్డు ఒక్క కిలోమీటరు కూడా వేయలేదన్నది విస్తుపోవాల్సిన నిజం.
మొత్తం రోడ్డు నెట్వర్క్: 81,523 కి.మీలు
గ్రామీణ రహదారులు: 28,248 కి.మీలు
జిల్లా రహదారులు: 31,149 కి.మీలు
రాష్ట్ర రహదారులు: 16,453 కి.మీలు
జాతీయ రహదారులు: 5,673 కి.మీలు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ
తెలంగాణ ప్రగతి రథం పల్లె నుంచి మొదలైంది. చెరువుకట్టను బలోపేతం చేసింది. వాగులకు గోదావరి వరద తెచ్చింది. పల్లె సీమను పచ్చగా మలిచింది. ఇంటింటికీ నీళ్లు ఇచ్చింది. ఈ పురోగతికి నిలువుటద్దం రాజధాని నడిబొడ్డున వెలిసిన నూతన సచివాలయం. తెలంగాణ పరిపాలనా సౌధం రాష్ట్ర ప్రతిష్ఠకు వన్నె తెచ్చేదిగా ఉండాలని సంకల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. చాలీచాలని వసతులతో, విసిరేసినట్టున్న పరిపాలనా భవనాల స్థానంలో రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా అంబరాన్నంటే పాలనా నిలయాన్ని కట్టించాలని 2019లో సంకల్పించారు. 2021 జనవరిలో మొదలైన సచివాలయ నిర్మాణం రెండేండ్లలో పూర్తయింది. అన్ని ప్రభుత్వ శాఖలనూ ఒకే చోటుకు తెచ్చి అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన సచివాలయం ప్రైడ్ ఆఫ్ తెలంగాణగా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నది. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసే సచివాలయ భవనానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడం గర్వించదగ్గ విషయం.
22 ఏండ్ల మోదీ గుజరాత్.. ఫైర్ సేఫ్టీ కరువు
గుజరాత్ రాష్ట్రం ఏర్పడినప్పుడు అహ్మదాబాద్లో సచివాలయం నిర్మాణమైంది. దాదాపు 45 ఏండ్లపాటు అక్కడినుంచే పరిపాలన వ్యవస్థ కొనసాగింది. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2011లో సచివాలయంలో రెండు అదనపు బ్లాక్లు నిర్మాణం చేపట్టారు. వీటికి స్వర్ణిమ్ సంకుల్- 1, స్వర్ణిమ్ సంకుల్- 2 అని పేర్లు పెట్టారు. మొదటి భవనాన్ని 2013లో, రెండో భవనాన్ని 2014లో ప్రారంభించారు. ఇందులో సీఎం చాంబర్ను బుల్లెట్ ప్రూఫ్గా తీర్చిదిద్దారు. అయితే.. ఈ భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేకపోవడం గమనార్హం. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2021లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం స్వర్ణిమ్ సంకుల్-1, 2కు ఎన్వోసీ లేదు. అంతేకాదు… సచివాలయంలోని 8 నుంచి 14 వరకు ఉన్న బ్లాక్లకు కూడా ఫైర్ సేఫ్టీ లేదు.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. పవర్ హాలిడేల్లేవ్!
‘తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు’ అందరి నోటా ఇదే మాట! ‘రాష్ట్రం అంధకారంలో కూరుకుపోతుంది’ కొందరి కోరిక కూడా!! పరిశ్రమలు పవర్ హాలిడేలు ప్రకటించే దుస్థితి. కష్టపడి సాధించుకున్న తెలంగాణ చీకట్లో కూరుకుపోతే కేసీఆర్ ఊరుకుంటారా? పట్టుబట్టారు, వ్యవస్థను పట్టాలెక్కించారు. కరెంట్ కష్టాలు ఆరు నెలల్లో తీర్చేశారు. పొరుగు రాష్ర్టాలతో విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడంతోపాటు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేవిధంగా చర్యలు చేపట్టారు. ఇప్పుడు తెలంగాణలో పవర్ హాలిడే మాట వినిపించదు. క్రాప్ హాలిడేలు కనిపించవు. ఉమ్మడి రాష్ట్రంలో ‘కరెంట్ ఇవ్వండి’ అని ధర్నాలు చేసిన పారిశ్రామికవేత్తలు.. ఇప్పుడు మూడు షిఫ్టులతో కంపెనీలు నడుపుతున్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తో రాష్ట్ర పారిశ్రామిక రంగం మెరుపువేగంతో దూసుకుతుపోతున్నది.
22 ఏండ్ల మోదీ గుజరాత్.. లెక్కపెట్టి పవర్ కట్!
రాష్ట్రంలో సరిపడా కరెంట్ లేదు. కాబట్టి, పరిశ్రమలు వారానికి ఒకరోజు పవర్ హాలిడే పాటించాలి’ అని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో జిల్లాకు ఒక్కో రోజు పవర్ హాలిడే ఇవ్వాలని కూడా ఆదేశించింది. గుజరాత్కు చెందిన పారిశ్రామికవేత్తల అసోసియేషన్ ఇటీవల ఆ రాష్ట్ర విద్యుత్ శాఖకు లేఖ రాసింది. అందులో.. ‘వారం రోజులుగా తరుచూ విద్యుత్ అంతరాయం కలుగుతున్నది. దీంతో ఉత్పత్తి పడిపోతున్నది. యంత్రాలు దెబ్బతింటున్నాయ’ని పేర్కొన్నది. అక్కడ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా ఎంత అధ్వానంగా ఉన్నదో ఈ ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. విద్యుత్ సంక్షోభానికి సంబంధించి గుజరాత్ సర్కార్ విధానాలపై ఆరెస్సెస్ అనుబంధ భారతీయ కిసాన్ సంఘ్ కూడా పోరు సైరన్ మోగించింది. పెంచిన విద్యుత్ చార్జీలను నిరసిస్తూ కచ్, బన్స్కాంత జిల్లాలో ధర్నాలు చేపట్టింది. అదానీ పవర్ నుంచే రాష్ట్రంలో సగం విద్యుత్ కొనుగోలు చేస్తుండటంతో చార్జీలపై ప్రభుత్వానికి అదుపులేకుండా పోతున్నది. దీంతో రాష్ట్రమంతా ఒకేవిధంగా చార్జీలు వసూలు చేయాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. 24 గంటలూ పవర్”ఫుల్’
తెలంగాణ వ్యవసాయానికి భూగర్భ జలాలే ఆధారం. ఇందుకు బోర్లు, బావులపై ఆధారపడేవారు రైతులు. అయితే, ఒకప్పుడు కోతల కరెంట్ కారణంగా.. పారిన మడే మళ్లీ మళ్లీ తడిసేది. నీళ్లందక సగం పొలం ఎండిపోయేది. కరెంట్ వెతలు తీరితేనే తెలంగాణలో సాగుబడి సజావుగా సాగుతుంది అని భావించారు ముఖ్యమంత్రి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట్లో రైతులకు 8 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా మొదలైంది. 2018 జనవరి 1 నుంచి 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. తెలంగాణ రైతులు కరెంట్ కోతలు మర్చిపోయి ఐదేండ్లు దాటిపోయింది. ఇప్పుడు నీళ్లు ఆగిపోతాయన్న రంది లేదు. మోటర్ కాలిపోతుందన్న బెంగ అసలే లేదు. చివరి మడి వరకు తడి చేరుతున్నది. పొలమంతా ఒకేరీతిన పండుతున్నది.
తెలంగాణలోని వ్యవసాయ కనెక్షన్లు: 27 లక్షలు
ఉచిత విద్యుత్తు కోసం ఏటా వ్యయం: రూ.10వేల కోట్లు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. 8 గంటల్లోనూ కోతలే
రెండేండ్ల కిందట గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సగర్వంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని పేరు ‘కిసాన్ సూర్యోదయ్ యోజన’. స్వయంగా ప్రధాని చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. దీని ఉద్దేశం 2023 జనవరి నాటికి 4,000 గ్రామాల్లో వ్యవసాయానికి పగటి పూట విద్యుత్ ఇవ్వడం! 2024 చివరి నాటికి రాష్ట్రమంతా దీన్ని విస్తరించాలన్నది తర్వాతి దశ. గుజరాత్ మాడల్ అంటూ ఊదరగొట్టి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్న మోదీ.. తిరిగి ఆరేండ్ల తర్వాత అక్కడికే వెళ్లి రైతులకు పగటి పూట విద్యుత్ ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టడం ఆశ్చర్యకరం. అధికారిక ప్రకటనల ప్రకారం వ్యవసాయరంగానికి 8 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆ మేరకు సరఫరా కావడం లేదని తరుచూ రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇచ్చే అరకొర విద్యుత్కు ప్రతి మోటర్ దగ్గరా మీటర్ పెట్టడంతో.. కరెంట్ బిల్లు కట్టడానికి రైతులు ఉసూరుమంటున్నారు.
గుజరాత్లో వ్యవసాయ కనెక్షన్లు: 18 లక్షలు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. మేనమామ చదివింపు లక్ష
‘పేదింటి ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు గుండెలమీద కుంపటి కావద్దని భావించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అనే విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. పెండ్లిపెద్దగా, మేనమామగా కేసీఆర్ చదివిస్తున్న లక్షా పదహార్లు నిరుపేద లోగిళ్లలో పెండ్లి బాజాలు మోగిస్తున్నాయి. స్వరాష్ట్ర కల సిద్ధించిన 2014లో అక్టోబర్ 2న కల్యాణలక్ష్మి పథకం మొదలైంది. తొలుత ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ యువతుల వివాహానికి రూ.51,000 ఆర్థిక సాయాన్ని అందజేయగా, తర్వాత దానిని బీసీలకు సైతం విస్తరింపజేశారు. 2017లో ఆర్థిక సాయం మొత్తాన్ని రూ.75,116కు పెంచారు. 2018 మార్చి 19న దీనిని రూ.1,00,016లకు పెంచి దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. 2016 చట్టాన్ని అనుసరించి దివ్యాంగులకు రూ.1,25,145 అందిస్తున్నారు. కేసీఆర్ దూరదృష్టితో ప్రారంభించిన ఈ స్కీమ్ బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే మంత్రదండం కూడా అయింది. రాష్ట్రంలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గాయి. జాతీయ కుటుంబ సర్వే ప్రకారం 2015-16తో పోల్చితే 2019-20 నాటికి రాష్ట్రంలో బాల్యవివాహాలు 4.8 శాతం తగ్గడం విశేషం.
అందిస్తున్న ఆర్థిక సాయం: 1,00,016
లబ్ధిదారులు: 12,62,917
ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు: రూ.3,200 కోట్లు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. మోదీ తాత చెల్లింపు 12వేలే
నిరుపేద కుటుంబాల ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు గుజరాత్ రాష్ట్రంలో ‘కున్వర్ బాయి ను మామేరు యోజన’ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద షెడ్యూల్డ్ కులాలు, బీసీ, ఈడబ్ల్యూసీ యువతులకు సాయం చేస్తారు. దీని ద్వారా ప్రభుత్వం అందించే మొత్తం ఆర్థిక సహాయం రూ.12వేలు మాత్రమే. అది కూడా వివాహమైన రెండేండ్లలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అదీగాక కుటుంబంలో ఇద్దరు బిడ్డలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ఆశించిన మేర ప్రయోజనం ఇవ్వలేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015-16తో పోల్చితే 2019-20 నాటికి గుజరాత్లో బాల్యవివాహాలు కేవలం 1.3 శాతం తగ్గాయి.
ఆర్థిక సాయం: రూ.12వేలు
ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు: రూ.54కోట్లు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. అసఫల జల సాధన!
మిషన్ కాకతీయను కాపీ కొట్టి గుజరాత్ ప్రభుత్వం 2018లో చెరువుల పునరుద్ధరణకు ‘సుజలాం సుఫలాం యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పూర్తిగా ఉపాధి హామీ నిధులతోనే ఈ కార్యక్రమాన్ని నడిపింది. దీంతో అరకొర పనులే సాగాయి. గుజరాత్లో 33 జిల్లాల్లో 26,981 చెరువులను పునరుద్ధరించారు. వెయ్యికిపైగా చెక్ డ్యామ్లను నిర్మించారు. అయితే అనుకున్నంత మేర నీటి నిల్వ సామర్థ్యం పెరగలేదు. కేవలం 4 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే స్థిరీకరణ జరిగింది. భూగర్భ జలమట్టం పెరుగుదలలోనూ పెద్దగా మార్పు రాలేదు. ఆ రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం 30-20 మీటర్ల మధ్య ఉండటం గమనార్హం.
పునరుద్ధరించిన చెరువులు: 26,981
ఖర్చు: ఉపాధి హామీ నిధులే
పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం: 2.4 టీఎంసీలు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. చెరువుల్లో నీళ్ల దరువు
కాకతీయుల ఏలుబడిలో ఊరూరా ఊట చెరువులతో తెలంగాణ పచ్చగా ఉండేది. సమైక్యపాలనలో గొలుసుకట్టు చెరువులు పట్టుతప్పి తాంబాలాల్లా మారాయి. కొన్ని ఆనవాళ్లు లేకుండా పూడుకుపోయాయి. చెరువు కింది ఆయకట్టు తీసికట్టుగా మారిపోయింది. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. దశాబ్దాలుగా జలసత్వాలుడిగిన చెరువులకు మిషన్ కాకతీయతో నవ జీవం తెచ్చారు ముఖ్యమంత్రి. బీడువారిన తటాకాలకు పూర్వవైభవం తీసుకొచ్చారు. 2015లో ప్రారంభమైన ఈ పథకం వల్ల రాష్ట్రంలోని చెరువులన్నీ బాగుపడ్డాయి. వందలాది చెరువులు గోదావరి జలాలతో వేసవిలోనూ అలలతో దరువేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 27వేలకు పైగా చెరువులను అభివృద్ధి చేశారు. మొత్తంగా 23.85 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు. చెరువుల పునరుద్ధరణతో రాష్ట్రవ్యాప్తంగా 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. చెరువుల్లో నీళ్లు నిల్వడంతో అవి ఇంకి భూగర్భ జలమట్టం 4.34మీటర్లు పెరిగింది.
పునరుద్ధరించిన చెరువులు: 27,625
ఖర్చు: రూ.9155.97 కోట్లు
పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం: 8.9 టీఎంసీలు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. సాయం పూరాబర్సే
అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా తెలంగాణ పురోగమిస్తున్నది. సంక్షేమ ఫలాలు ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు. మైనారిటీల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఓన్ యువర్ ఆటో, డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం, కుట్టు మిషన్ల పంపిణీ, సబ్సిడీ బ్యాంక్ రుణాలు, సిల్ డెవలప్మెంట్, తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ఫకీర్ కమ్యూనిటీ సంక్షేమం కోసం 110 మోపెడ్స్ పంపిణీ చేసింది. ప్రతినెలా ఇమామ్లకు రూ.10 వేలు, మౌజమ్లకు రూ.5 వేల గౌరవ వేతనం అందిస్తున్నది. మైనారిటీల విద్యాభివృద్ధికి తెలంగాణ సర్కారు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఆ లక్ష్యంతో 107 బాలురు, 97 బాలికలు మొత్తంగా 204 మైనారిటీ రెసిడెన్షియల్స్ను ప్రారంభించింది. ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ వరకు ఉచిత విద్యనందిస్తున్నది. ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ తదితర పోటీపరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నది.
కళాశాలల్లో చేరుతున్న ముస్లింల శాతం
2015-16:16 శాతం
2019-20: 43 శాతం
22 ఏండ్ల మోదీ గుజరాత్.. గోడు పట్టదు.. గోస వినదు
గుజరాత్ జనాభాలో 11.50 శాతం మంది మైనారిటీలే! ఇప్పటివరకు గుజరాత్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కనీసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయలేదు. వక్ఫ్ బోర్డును ప్రత్యేకంగా కాకుండా లీగల్ డిపార్ట్మెంట్ కింద ఉంచింది. రాష్ట్ర హజ్ కమిటీని సాధారణ పరిపాలన విభాగంతో ముడిపెట్టింది. పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు, మైనారిటీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తదితరాలు గుజరాత్ రాష్ట్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా కొనసాగుతున్నాయి. మైనారిటీల అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు అంతంత మాత్రమే. పోస్ట్మెట్రిక్, స్వయం ఉపాధి మొదలైన వాటికి అందిస్తున్న ఆర్థిక సాయంలో ఎక్కువభాగం రుణాల రూపంలోనే ఉండటం గమనార్హం. దీంతో ఇప్పటికీ గుజరాత్లో ముస్లిం యువత పై చదువులకు వెళ్లడం లేదన్న విషయాన్ని జాతీయ కుటుంబ సమగ్ర సర్వే సైతం తేటతెల్లం చేస్తుంది.
కళాశాలల్లో చేరుతున్న మైనారిటీల శాతం..
2015-16: 4 శాతం
2019-20: 10 శాతం
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. సబ్ప్లాన్పై సాచివేత
దళితుల సంక్షేమానికి గుజరాత్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిది. ఆ రాష్ట్రంలో ఎస్సీల జనాభా దాదాపు 7 శాతం. అయినా ఎస్సీ సబ్ ప్లాన్ కింద సగటున ఏటా రూ.1,000 కోట్లు కూడా ఆ ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు. పేపర్ల మీద పథకాలు ఉన్నమాటే కానీ, అందించే ఆర్థిక సాయం అంతంతమాత్రమే. అందుకు సవాలక్ష కొర్రీలు. చాలా పథకాలకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన దళితుల వార్షిక ఆదాయం రూ.47వేలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.68 వేలు దాటని వారే అర్హులుగా నిర్ధారించింది. కేంద్రం అమలు చేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు తప్ప.. ప్రత్యేకంగా రాష్ట్ర సర్కార్ అందిస్తున్న చేయూత ఏమీ లేదు. విదేశాల్లో ఉన్నత విద్యకు రూ.15 లక్షలు రుణంగా ఇచ్చి, దానిపై 4 శాతం వడ్డీ వసూలు చేస్తున్నది. 18-40 ఏండ్ల మధ్య ఉన్న దళితులకు దహన సంస్కారం నిర్వహణలో శిక్షణ ఇస్తున్నారు. వారి పురోగతిపట్ల అక్కడి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో ఇది అద్దం పడుతుంది. వివిధ రూపాల్లో ఇస్తున్న ఉపకార వేతనాలు వందల రూపాయల్లోనే ఉంటున్నాయి. కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలను సైతం బ్యాంకుతో ముడిపెట్టి.. ముక్కుపిండి వడ్డీ వసూలు చేస్తున్నది.
దశాబ్దాల కాలం కరిగిపోయినా, ఐదేండ్లకో ప్రభుత్వం వచ్చినా.. దళితుల బతుకు చిత్రం మాత్రం వీసమెత్తు మారలేదు. తరతరాలుగా అణగారిన వర్గాలుగా ఉంటున్న దళితులను తెలంగాణ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంది. రాష్ట్రం మొత్తం ప్రగతి పద్దు వ్యయంలో దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నది. దళిత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో 268 గురుకులాలను ఏర్పాటు చేసి ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నది. ఇప్పటికే ఉన్న పథకాలకు కొనసాగింపుగా కేసీఆర్ తీసుకొచ్చిన బృహత్తర పథకం ‘దళిత బంధు’. దళిత కుటుంబాల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సంక్షేమ పథకాలకు మకుటాయమానంగా ‘దళిత బంధు’ నిలుస్తున్నది. ఎలాంటి షరతులు లేకుండా, బ్యాంకులతో సంబంధం లేకుండా ఒక్కో దళిత కుటుంబానికి ఏకమొత్తంగా రూ.10 లక్షలు సాయం అందిస్తున్నది. ఈ నిధులతో దళితులు తమకు నచ్చిన, వచ్చిన ఉపాధి మార్గాన్ని, నచ్చిన చోట ప్రారంభించుకునేలా ప్రోత్సహిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4వేల కోట్లతో 38,583 కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయగా, ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700కోట్లను కేటాయించింది. నియోజకవర్గానికి 1100 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనుంది.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. విధిని ఎదిరించేలా!
దివ్యాంగులకు అత్యధిక పింఛన్లను అందివ్వడమే కాదు, వారి సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉంది. ప్రతినెలా ఐదు లక్షల మందికిపైగా దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఆసరా పింఛన్ను అందజేస్తున్నది. పింఛన్ రూపంలోనే సంవత్సరానికి రూ.1800.96 కోట్లను వెచ్చిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ. పెన్షన్ పొందడానికి ప్రత్యేకంగా వయోపరిమితి లేదు. వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలోపు ఉన్న దివ్యాంగులు ఎవరైనా ఈ పెన్షన్ పొందడానికి అర్హులే! పెన్షన్తోపాటు వారికి ఉచితంగా ఉపకరణాలు, లక్షలు విలువ చేసే బ్యాటరీ సైకిళ్లు, స్కూటర్లను అందిస్తున్నది. 2016 చట్టాన్ని అనుసరించి సలహా మండలిని ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రభుత్వ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్, వివిధ పథకాల్లో పొందే ఆర్థిక సాయంలో 25 శాతం అధికంగా అందిస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా హెల్ప్లైన్ సెంటర్ను నిర్వహిస్తున్నది. విద్య, ఉపాధి రంగాల్లో 4 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నది. వెక్కిరించిన విధిని ధిక్కరించేలా వారిని వెన్నుతట్టి నిలబెడుతున్నది.
దివ్యాంగుల పెన్షన్: రూ.3,016
కనీసం వైకల్యం: 40శాతం
ఏటా వ్యయం: రూ.1800.96కోట్లు
లబ్ధిదారులు: 5లక్షల మందికిపైగా..
22 ఏండ్ల మోదీ గుజరాత్.. వెయ్యితో విదిలించి!
దివ్యాంగుల సంక్షేమానికి గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అంతంతమాత్రమే. ఇప్పటికీ సలహా మండలిని ఏర్పాటు చేయలేదు. దివ్యాంగులకు అందించే పింఛన్ కూడా అంతంత మాత్రమే! కేవలం రూ.వెయ్యి చేతిలో పెట్టి చేతులు దులుపుకొంటున్నది. ఈ వెయ్యి అందుకోవడానికి అనేక షరతులు! 18-79 ఏండ్ల మధ్య వయసున్న వారికి మాత్రమే పెన్షన్ పథకం వర్తిస్తుంది. అంతకు మించి, అంతకన్నా తక్కువ వయసున్న దివ్యాంగులకు రూపాయి సాయం అందదు. పైగా వార్షిక ఆదాయ పరిమితి కేవలం రూ1.20 లక్షలుగా నిర్ధారించింది. విద్య, ఉపాధి కల్పన రంగాల్లోనూ దివ్యాంగులకు అక్కడి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం అంతంత మాత్రమే!పెన్షన్: రూ.వెయ్యి (రాష్ట్రం 700, కేంద్రం 300)
ఉండాల్సిన వైకల్యం: 80శాతం
లబ్ధిదారులు: సుమారు 3 లక్షలు
ఏటా ఖర్చు: రూ.36కోట్లు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. రెండింతల ఆసరా!
ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే.. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వాళ్లవి. ఇక వృద్ధాప్యంలో వారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. ముసలితనంలో కొడుకో, కోడలో జాలి చూపిస్తే గానీ ఒక పూట తిండి దక్కని దైన్యంలో ఎందరో కొట్టుమిట్టాడుతున్నారు. వారందరికీ పెద్దకొడుకు అయ్యాడు ముఖ్యమంత్రి కేసీఆర్. ‘ఆసరా పెన్షన్’ ద్వారా రూ.2,016 అందిస్తూ వారికి దేహీ అనే దుస్థితి తప్పించారు. మొదట్లో అరవై ఏండ్లుగా ఉన్న అర్హత వయసును తర్వాత 57 ఏండ్లకు తగ్గించింది ప్రభుత్వం. నెల నెలా ఠంచనుగా అందుతున్న పెన్షన్ వృద్ధులకు కొండంత భరోసాగా నిలుస్తున్నది. వారి ఆత్మగౌరవానికి లోటు రాకుండా కాపుకాస్తున్నది. పెన్షన్ అందుకుంటున్న వృద్ధులు ‘మందులు అయిపోయాయి తెచ్చిపెట్టండ’ని ఇంట్లోవాళ్లను బతిమాలుకోకుండా.. సొంత పైసలిచ్చి తెప్పించుకునే పరిస్థితి వచ్చింది. తన ఖర్చులు పోను మనవడి చేతిలో పదో పరకో పెట్టి మురిపెంగా నవ్వుతున్నారు అవ్వలు. కొడుకు జేబులో వందనోటు పెట్టి మీసాలు దువ్వుతున్నారు పెద్దయ్యలు!
వయోపరిమితి: 57 ఏండ్లు
పెన్షన్: రూ.2,016
ఆసరా లబ్ధిదారులు: 46 లక్షలకుపైగా
22 ఏండ్ల మోదీ గుజరాత్.. సవాలక్ష ఆంక్షలు
గుజరాత్లో పెన్షన్లకు సంబంధించి విచిత్రమైన కొర్రీలు ఉంటాయి. వృద్ధులకు గతంలో రూ.750 ఇచ్చేవారు. గతేడాది దీనిని నెలకు వెయ్యి రూపాయలకు పెంచారు. ఇది వారి అవసరాలకు ఏ మూలకూ సరిపోవడం లేదు. 60 ఏండ్లు దాటిన వారికి మాత్రమే పెన్షన్ వర్తిస్తుంది. వార్షిక ఆదాయం రూ.1.20 లక్షల లోపు ఉండాలి. ఇక 79 ఏండ్ల వయసు దాటిన వారికి ప్రభుత్వం రూ.1,250 పెన్షన్ ఇస్తున్నది. ఇందులో రాష్ట్ర వాటా రూ.750 అయితే, కేంద్రం వాటా రూ.500.
వయోపరిమితి: 60 ఏండ్లు
పెన్షన్ 60-79 ఏండ్ల వరకు- రూ.1,000
80 ఏండ్లు దాటితే రూ.1,250
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. బడి నుంచే భవితకు బాట
ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే చదువొక్కటే మార్గం. పాఠశాల విద్య పునాదులు పటిష్ఠంగా ఉన్నప్పుడే విద్యార్థుల భవిష్యత్ కలల సౌధాలు నిలబడతాయి. ఆ దిశగా పిల్లలకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. బడిని బలోపేతం చేసి, నూతన గురుకులాలను స్థాపించి, ‘మన ఊరు- మన బడి’ వంటి ప్రతిష్ఠాత్మకమైన పథకాలు ప్రారంభించింది. ఉచిత యూనిఫామ్లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం తదితర పథకాలు చిన్నారులను ఉత్సాహంగా బడి బాట పట్టిస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో బడి ఈడు పిల్లలంతా పాఠశాల విద్య అభ్యసిస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ర్టాల స్థితిగతుల ఆధారంగా ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్బుక్ ప్రకారం పిల్లల ఎన్రోల్మెంట్లో తెలంగాణ టాప్లో నిలిచింది.
విభాగం ఎన్రోల్మెంట్
ప్రైమరీ 112.5 శాతం
అప్పర్ ప్రైమరీ 106.5 శాతం
లిమెంటరీ 110.5 శాతం
సెకండరీ 94.1 శాతం
ఇంటర్ 64.8 శాతం
22 ఏండ్ల మోదీ గుజరాత్.. చేరికలు అంతంతే!
ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ బలంగా ఉందని చెప్పడానికి ఎన్రోల్మెంట్ శాతమే కొలమానం. ఆ లెక్కన గుజరాత్లో విద్యా వ్యవస్థ ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నదో ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బడి బాగోగులు పట్టించుకోకపోవడం వల్ల అక్కడ విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉంటున్నది. ఏ స్థాయిలోనూ విద్యార్థుల చేరికలు అనుకున్న మేరకు సాగడం లేదు. మొత్తం విద్యార్థుల్లో గరిష్ఠంగా 93 శాతం మంది మాత్రమే బడిబాట పడుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
విభాగం ఎన్రోల్మెంట్
ప్రైమరీ 93.1 శాతం
అప్పర్ ప్రైమరీ 91.1 శాతం
ఎలిమెంటరీ 94.4 శాతం
సెకండరీ 75.2 శాతం
సెకండరీ 48.2 శాతం
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. నియంత్రణ రేఖ!
తెలంగాణలో జనాభా నియంత్రణ విజయవంతంగా అమలవుతున్నది. దీంతో శిశు జననాల రేటు (సీబీఆర్) తక్కువగా నమోదవుతున్న పెద్ద రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచింది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ప్రతి వెయ్యి జనాభాకు నమోదవుతున్న జననాల సంఖ్యను గణించి.. ఇది తెలంగాణలో 16.4 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నది. జనాభా నియంత్రణపై స్పష్టమైన కార్యాచరణ, అధిక సంతానం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి సమర్థంగా నిర్వహిస్తుండటంతో ఇది సాధ్యమైంది.
2014లో జననాల రేటు: 18.0
2020 నాటికి జననాలరేటు: 16.4
తగ్గుదల: 1.6
22 ఏండ్ల మోదీ గుజరాత్.. బాధ్యత లేక!
జనాభా నియంత్రణ ఓ సామాజిక బాధ్యత. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామని గొప్పలు చెప్పుకోవడం తప్ప.. జనాభా నియంత్రణపై గుజరాత్ ప్రభుత్వం దృష్టి సారించిన దాఖలాల్లేవు. బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్నది. అన్నిటా తాము ఆదర్శమని గొప్పలు చెప్పుకొంటున్న ఆ రాష్ట్రం జనాభా తగ్గుదల విషయంలో మాత్రం తీసికట్టుగా తయారైంది. ఫలితంగా దేశంపై జనాభా భారాన్ని పెంచుతున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది.
2014లో జననాల రేటు: 20.6
2020 నాటికి జననాల రేటు: 19.3
తగ్గుదల: 1.3
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. ప్రతి కాన్పూ ఆస్పత్రిలోనే
ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత. పైపై మెరుగులు కాదు.. మౌలిక సదుపాయాలు మెరుగైనప్పుడే రోగులు ప్రభుత్వ దవాఖాన తలుపు తట్టే ధైర్యం చేస్తారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రెట్టింపు విజయం సాధించింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వ దవాఖానల రూపురేఖలు మారాయి. ముఖ్యంగా మాతాశిశు సంరక్షణ సేవలు ఎంతో మెరుగయ్యాయి. ఒకవైపు ప్రస్తుతం ఉన్న దవాఖానల్లోనే లేబర్ రూమ్లను ఆధునికీకరించడంతోపాటు నిపుణులైన వైద్యులను నియమించింది. ప్రత్యేకంగా మాతాశిశు సంరక్షణ దవాఖానలను (ఎంసీహెచ్) ఏర్పాటుచేసింది. దీనికితోడు కేసీఆర్ కిట్ ద్వారా ఆర్థిక సాయం అందించడం, అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణులకు రెగ్యులర్ చెకప్లు నిర్వహించే ఏర్పాటుచేశారు. ప్రసవానికి గర్భిణిని అదే వాహనంలో దవాఖానకు తీసుకురావడం, ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను క్షేమంగా అమ్మ ఒడి వాహనంలోనే ఇంటికి తీసుకెళ్లడం వంటి చర్యలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన నాడు ప్రభుత్వ దవాఖానల్లో 33 శాతం మాత్రమే ప్రసవాలు జరుగగా ఇప్పుడు దాదాపు రెట్టింపయ్యాయి. 61 శాతం డెలివరీలు నమోదవుతున్నాయి. కేంద్రం విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వీస్ నివేదిక ప్రకారం 2020 నాటికి తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల శాతం 50.2గా నమోదైంది.
దవాఖాన ప్రసవాలు: 100 శాతం
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు: 61 శాతం
22 ఏండ్ల మోదీ గుజరాత్.. ప్రసవానికి వేదనే
ప్రభుత్వ దవాఖాన అభివృద్ధి గాలికొదిలేస్తే.. ప్రజలకు ప్రైవేట్ దవాఖానలే దిక్కవుతాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలో వసతులు, గర్భిణులకు ఆర్థిక సాయం అందించే ఆకర్షణీయమైన పథకాలు లేకపోవడంతో గుజరాత్లో సర్కార్ దవాఖానల్లో ప్రసవాలు యాభై శాతం దాటలేదు. తాజా నివేదిక ప్రకారం గుజరాత్లో దవాఖాన ప్రసవాలు 99.8 శాతంగా ఉన్నాయి. అంటే ఇప్పటికీ అక్కడక్కడా ఇండ్లలోనే ప్రసవాలు జరుగుతున్నాయి. 7.8 శాతం నవజాత శిశుమరణాలు ఇండ్లలోనే జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. .
దవాఖాన ప్రసవాలు: 99.8 శాతం
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు: 47.3 శాతం
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. అమ్మకడుపు చల్లగా
నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. బిడ్డ గర్భంలో పడగానే తల్లులు పనులకు పోవాల్సిన అవసరం లేకుండా కేసీఆర్ కిట్ రూపంలో ఆర్థిక సాయం అందజేస్తున్నది. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పోషకాహారం ఇస్తున్నది. రెగ్యులర్ చెకప్లతో తల్లుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నది. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితులను సంపూర్ణంగా తెలుసుకునేందుకు ఇటీవలే 44 టిఫా స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. తల్లులు రక్తహీనత బారిన పడకుండా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నది. మరోవైపు దవాఖానలను బలోపేతం చేసి, సురక్షిత ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకున్నది. పుట్టిన బిడ్డలకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే చికిత్స అందించేలా ఎక్కడికక్కడ పీడియాట్రిక్ ఐసీయూలను ఏర్పాటుచేసింది. వీటన్నిటి ఫలితంగా నవజాత శిశు మరణాలు (ఐఎంఆర్) రేటు గణనీయంగా తగ్గాయి.
2014లో ప్రతి వెయ్యి జననాలకు శిశు మరణాలు: 35
ప్రస్తుతం: 21; ఐదేండ్లలోపు పిల్లల మరణాలు: 23
22 ఏండ్ల మోదీ గుజరాత్.. అమ్మకు కడుపుకోత
గుజరాత్లో ప్రస్తుతం ప్రతి వెయ్యి జననాలకు నవజాత శిశుమరణాలు 23గా నమోదయ్యాయి. 2014లో తెలంగాణ, గుజరాత్లో ఐఎంఆర్ 35గా ఉన్నది. కానీ ఆరేండ్లలోనే పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొంగొత్త పథకాలతో అమ్మకు అండగా నిలిస్తే.. దేశానికే మాడల్ అని చెప్పే గుజరాత్ మాత్రం ఐఎంఆర్ నియంత్రణపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేకపోయింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆధారపడటమే తప్ప మాతాశిశు మరణాలను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీని కారణంగా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.
2014లో ఐఎంఆర్: 35
ప్రస్తుతం: 23; ఐదేండ్లలోపు పిల్లల మరణాలు: 24
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. తరలి వచ్చిన వసంతం
పల్లె చల్లగా ఉండాలంటే పొలిమేరలో ఉన్న పట్టెడంత పచ్చదనం సరిపోదు. ఊరంతా హరిత భరితంగా మారాలి. పల్లెలు, పట్నాలే కాదు అడవులు సైతం నిత్య వసంతంతో కళకళలాడాలి. ఇందు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తల్లి తెలంగాణకు అలంకరించిన పచ్చల పతకం హరితహారం. ఈ కార్యక్రమం రాష్ట్ర అడవుల ముఖ చిత్రాన్నే మార్చేసింది.2015తో పోలిస్తే రాష్ట్రంలో పచ్చ దనం పెంపు దేశానికే ఆదర్శంగా నిలిచింది. హరిత హారం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 250 కోట్ల మొక్కలను నాటింది. ప్రత్యేక చట్టాలు రూపొందించి పచ్చ దనాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టింది. పల్లె ప్రకృతి వనాలు ఏర్పా టు చేసింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం, చెట్ల సాంద్రత గణనీయంగా పెరిగింది. 2015-16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలో మీటర్లు ఉండగా, 2023 నాటికి అది 26,969 చ.కి.మీలకు పెరి గింది. మొత్తం తెలంగాణ విస్తీర్ణంలో అడవుల శాతం 24.06. ఇది దేశంలోనే అత్యధికం కావడం విశేషం. చెట్ల సాంద్రత 2014లో 2,549 చ.కి.మీలు ఉండగా.. ప్రస్తుతం అది 2,848 చ.కి.మీలకు పెరిగింది.
తెలంగాణ విస్తీర్ణంలో అడవుల శాతం: 24.06
2023లో అటవీ విస్తీర్ణం: 26,969 చ.కి.మీ
22 ఏండ్ల మోదీ గుజరాత్.. మరలి వెళ్లిన పచ్చదనం
గుజరాత్ వైశాల్యంలో అటవీ విస్తీర్ణం కేవలం 11.15 శాతం మాత్రమే. పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పేరుకు అడవుల విస్తీర్ణం అరకొరగా పెరుగుతున్నా.. చెట్ల సాంద్రత మాత్రం గణనీయంగా పడిపోతున్నది. చెట్లను విచ్చలవిడిగా నరికి వేయడంతో సాంద్రత 1,423 చ.కి.మీ మేర తగ్గింది.
గుజరాత్ విస్తీర్ణంలో అడవుల శాతం: 11.15
2023లో అటవీ విస్తీర్ణం: 21,876 చ.కి.మీ
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. ఐటీ విశ్వగురు!
దశాబ్దాల ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పంటలు పండవన్నారు. హైదరాబాద్లో ఐటీ అడ్రస్ గల్లంతవుతుందని విష ప్రచారం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వ విధానాలు హైదరాబాద్ను ఐటీలో మేటిగా నిలబెట్టాయి. సాంకేతిక విప్లవానికి తెలంగాణ రాజధాని రాచనగరిగా పరిఢవిల్లుతున్నది. ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఏటికేడు వృద్ధి సాధిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల విలువ రూ.1.83 లక్షల కోట్లుగా ఉన్నది. 2035 నాటికి రూ.2.9 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎనిమిదేండ్లలో ఐటీ పరిశ్రమ 140 శాతం వృద్ధి సాధించింది. 2013-14లో ఐటీ ఎగుమతులు రూ.58 వేల కోట్లు కాగా, రాష్ట్రంలో 3.23 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య 8 లక్షలకు చేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ వంటి సంస్థలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్లను హైదరాబాద్లో ఏర్పాటుచేశాయి. ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటు వృద్ధిరేటు 2021-22లో 17.2 శాతం. కాగా, 26.14 వృద్ధిరేటు సాధించిన తెలంగాణ ఐటీ విశ్వగురుగా నిలిచింది. ఇది జాతీయ సగటు కన్నా 9 శాతం అధికం.
2021-22లో ఐటీ ఎగుమతులు: 1.83 లక్షల కోట్లు
2035 నాటికి లక్ష్యం: 2.9 లక్షల కోట్లు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. ఒక్కటీ గగనమే!
పారిశ్రామిక రంగంలో టాప్ అని చెప్పుకొనే గుజరాత్లో ఐటీ రంగ ఎగుమతులు కేవలం రూ.3వేల కోట్లు మాత్రమే. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని కలలుగన్న గుజరాత్ యువకులు ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి. దేశవ్యాప్తంగా ఐటీ విప్లవం నడుస్తుంటే.. గుజరాత్ మాత్రం ఈ రేసులో అడుగున నిలిచింది. గతేడాది మేల్కొన్న గుజరాత్ ప్రభుత్వం కొత్తగా ఐటీ పాలసీని ప్రకటించింది. 2030 నాటికి రాష్ట్రంలో ఐటీ ఎగుమతులను రూ.25వేల కోట్లకు పెంచుతామని ప్రకటించింది. ఇది ప్రస్తుత ఎగుమతుల్లో ఒక్క శాతం కన్నా తక్కువ!
2021-22లో ఐటీ ఎగుమతులు రూ.3,101 కోట్లు
2030 నాటికి లక్ష్యం: రూ.25వేల కోట్లు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. టీకా పక్కా!
పసిబిడ్డకు బాలారిష్టాలెన్నో! పొత్తిళ్ల పాపాయిని కామెర్లు కబళిస్తాయి. అంబాడే బిడ్డల్ని ఆటలమ్మ వెంటాడుతుంది. ఈ రుగ్మతలు రాకుండా కాపాడే కవచాలే టీకాలు. పిల్లలకు వ్యాక్సిన్లు వేయడంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ ప్రకారం తెలంగాణలో పిల్లలకు వ్యాక్సినేషన్ 100 శాతం నమోదవుతున్నది. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ మినహా మరే రాష్ట్రమూ ఈ రికార్డును సాధించలేదు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. కేసీఆర్ కిట్లో భాగంగా గర్భిణులకు ఇచ్చే ఆర్థిక సాయంలో ఒక విడతను ఇమ్యునైజేషన్తో ముడిపెట్టారు. పుట్టిన బిడ్డకు తొమ్మిది నెలలు వచ్చే వరకు అన్ని రకాల టీకాలు వేయిస్తేనే రూ.2,000 ఆ తల్లుల ఖాతాలో జమవుతాయి. పిల్లలు టీకాలు వేసుకున్నారో లేదో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పర్యవేక్షిస్తున్నారు. దీంతో వంద శాతం ఇమ్యునైజేషన్ నమోదవుతున్నది.
22 ఏండ్ల మోదీ గుజరాత్.. పాపం పసివాళ్లు!
గుజరాత్లో 2014-15 సంవత్సరానికి గానూ ఇమ్యునైజేషన్ 90.26 శాతంగా నమోదైంది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2019-20లో 90.97 శాతం. అంటే ఐదేండ్లలో టీకాల పంపిణీ పెరిగింది కేవలం 0.71 శాతం మాత్రమే. వంద మంది పిల్లల్లో పదిమందికి టీకాలు అందడం లేదని కేంద్రం లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. టీకాల పంపిణీపై గుజరాత్ ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ప్రతి ఒక్కరికీ టీకాలు వేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ చెప్తుంటారు. కానీ ఆయన సొంత రాష్ట్రంలో పరిస్థితి ఇదిగో ఇలా ఉంది.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. కట్టుదిట్టంగా అరికట్టి
ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్ మహమ్మారిని అరికట్టడంలో కట్టుదిట్టంగా వ్యవహరించింది తెలంగాణ ప్రభుత్వం. కొవిడ్ కేసులు నమోదైన నాటి నుంచి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రజలకు ధైర్యం నూరిపోశారు. గాంధీ దవాఖానను నోడల్ సెంటర్గా మార్చి, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వరకు విస్తృతంగా సేవలు అందేలా చర్యలు చేపట్టారు. కొవిడ్ రోగుల కోసం ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేయించారు. మరోవైపు లాక్డౌన్ వంటి కఠిన సమయాల్లో ప్రజల కనీస అవసరాలు తీరేలా చర్యలు తీసుకున్నారు. ఎవరూ ఆకలితో అలమటించకుండా నిత్యావసరాలు అందజేశారు. ప్రైవేట్ టీచర్లు వంటి బాధిత వర్గాలకు ఆర్థిక సాయం అందించారు. వలస కూలీలను ప్రత్యేక రైళ్లలో సొంత రాష్ర్టానికి పంపారు. మెడికల్ ఆక్సిజన్ను తీసుకొచ్చేందుకు ఏకంగా యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు. ఇలాంటి చర్యల ఫలితంగా రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలో ఉంది. ఉత్తమ వైద్యం అందించడం వల్ల మరణాలను కట్టడి చేయగలిగారు.
ఇప్పటివరకు మొత్తం కేసులు: 8.39 లక్షలు; మరణాలు: 4,111
22 ఏండ్ల మోదీ గుజరాత్.. మరణాలు 11వేలు
కొవిడ్ నియంత్రణలో గుజరాత్ రాష్ట్రం వెనుకబడింది. ఆ రాష్ట్రంలో ఏకంగా సుమారు 13 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ప్రతి రోజు 300కుపైగా కేసులు నమోదవుతున్నాయి. వాస్తవానికి గుజరాత్లో 2.81 లక్షల మంది కొవిడ్తో మరణించారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అంబులెన్స్లు సరిపడా అందుబాటులో ఉంచలేదని, మెడికల్ ఆక్సిజన్ అందక వేలాది ప్రాణాలు గాలిలో కలిశాయని, హాస్పిటళ్లలో పడకలు కూడా సరిపడా లేవని గుజరాత్ ప్రభుత్వంపై విమర్శలు ఉన్నాయి. కొవిడ్ నియంత్రణలో విఫలం అయినందుకే మాజీ సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేశారనే వాదనలు కూడా ఉన్నాయి. !
ఇప్పటివరకు మొత్తం కేసులు: 12.80 లక్షలు; మరణాలు: 11,079
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. రైతుల ఖాతాల్లోకి 65వేల కోట్లు
ఒకప్పుడు రైతు ఉండేవాడు. మొగులు వంక బేలగా చూసేవాడు. కట్ట మీద భారంగా నడిచేవాడు. అప్పు కోసం షావుకారు దగ్గరికి దైన్యంగా వెళ్లేవాడు. పంట చేతికొచ్చే వేళకు పరేషాన్గా ఉండేవాడు. ఇప్పుడు తెలంగాణ రైతు తలెత్తుకొని నడుస్తున్నాడు. షావుకారు ఇంటి ముందు నుంచి కూడా దర్జాగా వెళ్తున్నాడు. ఒకే ఒక్క పథకం ‘రైతుబంధు’ తరతరాలుగా కొనసాగుతున్న కర్షకుల కష్టాలను తీర్చేసింది. లోకానికి అన్నం పెట్టే రైతుల ఆర్తిని గుర్తించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ‘రైతుబంధు’ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ఏటా ప్రతి ఎకరానికి రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఈ పథకం ద్వారా ఏటా దాదాపు 66 లక్షలమంది రైతులు రూ.15వేల కోట్లు అందుకుంటున్నారు. ‘రైతుబంధు’ ద్వారా గడిచిన ఐదేండ్లలో రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.65 కోట్లు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. పంట పెట్టుబడితో రైతులకు పెట్టుబడి రంది పోయింది. అప్పుల బాధలు తీరాయి. సీజన్కు ముందే అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే వెసులుబాటు కలిగింది..
పెట్టుబడి సాయం: ఏటా ఎకరానికి రూ.10వేలు
లబ్ధిదారులు: 66 లక్షల మంది
ఇప్పటివరకు అందించింది: రూ. 65వేల కోట్లు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. అన్నదాతకు గుండు సున్నా
గుజరాత్లో రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రైతులకు ఎలాంటి పంట పెట్టుబడి సాయం అందడం లేదు. ‘రైతు బంధు’ వంటి పథకం కోసం దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తున్నా… గుజరాత్ పాలకులు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు పంట పెట్టుబడికి అప్పులపై ఆధారపడాల్సి వస్తున్నది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధి మాత్రమే రైతులకు అందుతున్నది. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2019లో 63.13 లక్షల మంది గుజరాత్ రైతులకు పీఎం కిసాన్ కింద పెట్టుబడి సాయం అందింది. 2022 నాటికి లబ్ధిదారుల సంఖ్య 28.41 లక్షలకు పడిపోయింది. సుమారు 35 లక్షల మంది రైతులను జాబితా నుంచి తొలగించడం ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనం.
పెట్టుబడి సాయం: 0 l లబ్ధిదారులు: 0
ఇప్పటి వరకు అందించింది: 0
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. గింజ గింజకూ భరోసా
ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతు బతుకులు ధాన్యం కొనుగోళ్లపైనే ఆధారపడి ఉంటాయి. మరే రాష్ట్రంలో అయినా కోతల వేళకు రైతులు గుబులు పడతారేమో కానీ, తెలంగాణ కర్షకులకు ఏ బెంగా లేదు. ఇక్కడ పండిన ప్రతి గింజకూ మద్దతు ధర లెక్క కట్టిచ్చే తెలంగాణ ప్రభుత్వం ఉందనే భరోసా వాళ్లది. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నది. ఈ విధంగా ఇప్పటివరకు రూ.1.21 లక్షల కోట్ల విలువైన 6.76 కోట్ల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతోపాటు ఇతర పంట ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర కన్నా తక్కువ ధర పలికితే రైతులు నష్టపోకుండా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఆయా పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నది. ఈ విధంగా మక్కజొన్న, జొన్న, కందులు, శనగలు, పొద్దుతిరుగుడు పంట ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నది.
22 ఏండ్ల మోదీ గుజరాత్.. గింజుకున్నా నిరాశే
పంటల కొనుగోలులో గుజరాత్ ప్రభుత్వం రైతులకు మొండిచేయి చూపిస్తున్నది. గుజరాత్ రైతులు పండించిన పంటల్ని అయితే కేంద్రం లేదంటే ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేయాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోదు. ఒకవేళ మార్కెట్లో డిమాండ్ పడిపోయి మద్దతు ధరకు తక్కువగా ఉంటే.. కేంద్ర ప్రభుత్వమే నాఫెడ్ నోడల్ ఏజెన్సీ ద్వారా ప్రైస్ సపోర్ట్ స్కీం (పీఎస్ఎస్)తో పంటల్ని కొనుగోలు చేస్తుంది. అంతేగానీ రైతన్నలు గింజుకున్నా రాష్ట్ర ప్రభుత్వం మనసు కరగదు. ఇక రైతులు తమ పంట ఉత్పత్తుల్ని విక్రయించాలంటే మార్కెట్లకు వెళ్లాల్సిందే. తెలంగాణ మాదిరిగా అక్కడ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు మచ్చుకైనా కనిపించవు.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. కాలం చేసినా.. సాయం ఆగదు!
ఎవరూ లక్ష్యపెట్టలేదు రైతన్న కష్టాన్ని! ఏనాడూ ఆలోచించలేదు అన్నం పెట్టిన కర్షకుడు పోతే.. ఆ ఇంటి అన్నపూర్ణ కూడా పస్తుండే దుస్థితి దాపురిస్తుందని!! ‘రైతుబంధు’ పెట్టుబడి సాయం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రైతుబీమా’తో సేద్యకాడి కుటుంబానికి అండగా నిలిచాడు. విధిరాత ఇంటికాపును తన్నుకుపోయినా.. ఆ ఇంట్లోవాళ్లు వీధిన పడకుండా ధీమానిస్తున్నది ‘రైతుబీమా’. గుంట జాగున్న రైతు అయినా ఏ కారణం చేత మరణించినా.. ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నది. దీనికోసం ప్రభుత్వమే రైతుల తరఫున జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కు ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తున్నది. ఇప్పటివరకు ప్రీమియం కింద రూ.5,383 కోట్లు ఎల్ఐసీకి చెల్లించింది.
రైతుబీమా సాయం అందుకున్నకుటుంబాలు: 99,297
అందిన పరిహారం: రూ.4,964 కోట్లు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. ప్రమాదమైతేనే.. పరిహారం!
గుజరాత్ రైతు గోడు ఎంత చెప్పుకొన్నా తక్కువే! ప్రభుత్వ సాయం ఉండదు. ధాన్యం సేకరణకూ సహకరించదు. రైతు ప్రాణం మీదికొచ్చినా ఆ కుటుంబాన్ని ఆదుకోదు. గుజరాత్లో చనిపోయిన రైతు కుటుంబానికి దేవుడే దిక్కు. ప్రమాదంలో చనిపోయిన రైతులకు ‘ఫార్మర్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్’ కింద రూ.2 లక్షలు సాయం చేస్తున్నది. ప్రమాదంలో రైతు పూర్తిగా అంగవైకల్యం బారినపడినా రూ.2 లక్షలు అందిస్తున్నది. అయితే, సవాలక్ష ఆంక్షలతో దీన్ని అమలు చేస్తున్నది. సాధారణ మరణం, ఆత్మహత్య చేసుకున్న రైతులకు నయాపైసా పరిహారం ఇవ్వడం లేదు.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. మత్స్యకారుల మంచికోరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉచితంగా చేప, రొయ్య పిల్లల్ని పంపిణీ చేస్తున్నది. ఇప్పటివరకు ఉచిత చేపపిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం ఏకంగా రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసింది. అదేవిధంగా మత్స్యకారులకు మోటారు వాహనాలను, మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ను అందించింది. రూ.531 కోట్ల ఖర్చుతో మోటారు సైకిళ్లు, లగేజీ ఆటోలు, మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ను పంపిణీ చేసింది. ఇక ప్రమాదంలో మరణించే మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటున్నది. ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ ద్వారా రూ.4 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఎక్స్గ్రేషియా ద్వారా రూ.5 లక్షలు మొత్తం రూ.9 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. ఎక్స్గ్రేషియా కోసం ప్రభుత్వమే సొంతంగా డబ్బులు చెల్లిస్తున్నది. ఈ ఏడాది 3.60 లక్షల మందికి బీమా కోసం రూ.88 లక్షలను ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించింది. ఇప్పటివరకు మరణించిన 850 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేసింది.
22 ఏండ్ల మోదీ గుజరాత్.. సాగరం ఉన్నా.. సంకల్పమేది?
సుదీర్ఘ సముద్రతీరం ఉన్న గుజరాత్లో గంగపుత్రులకు అందుతున్న సాయం తక్కువే! అక్కడ మత్స్యకారులకు ప్రమాద బీమా కింద కేవలం రూ. లక్ష మాత్రమే పరిహారంగా అందిస్తున్నారు. ఇది కూడా ఇప్పటివరకు కేవలం 1.72 లక్షల మందికి మాత్రమే అందించింది. ఇక తెలంగాణ వంటి రాష్ట్రం పూర్తి ఉచితంగా చేపపిల్లల్ని పంపిణీ చేస్తుంటే.. గుజరాత్ మాత్రం 50శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తుండటం గమనార్హం. సుముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వలలు, పడవలను సబ్సిడీలో అందిస్తున్నది.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. నెగ్గిన మగ్గం
ఒకప్పుడు చిరుగుపాకల్లో పరువు కోసం కొట్టుమిట్టాడిన నేతన్నలు తెలంగాణ సాకారంతో సగర్వంగా బతుకుతున్నారు. ఉరితాళ్లు బిగించుకున్న చేతులతో బతుకమ్మ చీరలు నేస్తూ బతుకులను తీర్చిదిద్దుకుంటున్నారు. నేతన్న బాగుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, రుణమాఫీ, యంత్రాల ఆధునికీకరణ, శిక్షణ, పవర్లూమ్స్ పంపిణీ, బీమా.. ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు చేనేత కార్మికుల జీవితాల్లో నవోదయం తీసుకొచ్చాయి. ఇప్పటివరకు సుమారు రూ.420 కోట్లు ఆర్థిక సాయం అందించింది. అదనంగా దసరా సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు సర్కార్ సారెగా పంచుతున్న బతుకమ్మ చీరల ఆర్డర్ను మన నేత కార్మికులకే ఇచ్చి ఆదుకున్నది. చేతినిండా పనిచ్చి, రోజంతా కరెంట్ ఇవ్వడంతో తమ మగ్గం తగ్గేది లేదని భరోసాతో జీవిస్తున్నారు తెలంగాణ చేనేత కార్మికులు. ఫలితంగా ఆత్మహత్యలు ఆగిపోయాయి. ఒకప్పుడు మహారాష్ట్రకు వలసపోయిన కార్మికులు నేడు సరికొత్త చీరకు సాటిలేని సరిగంచు నేస్తున్నారు.
నేత కార్మికులకు అందిన సాయం: రూ.420 కోట్లు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. సడుగులిరిగిన సూరత్
గుజరాత్లో వస్త్ర పరిశ్రమ అంటే గుర్తుకొచ్చేది సూరత్. ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమల్లో అదీ ఒకటి. సుమారు 6 లక్షల మంది ప్రత్యక్షంగా, 25 లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఏటా రూ.30 వేల కోట్ల వ్యాపారం జరిగేది. ఒకప్పుడు ఇక్కడ 485 ప్రాసెసింగ్ యూనిట్లు (డైయింగ్, ప్రింటింగ్) ఉండేవి. అయితే, అదుపుతప్పిన ద్రవ్యోల్బణం, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పోటు, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వెన్నుపోటు ఫలితంగా సూరత్ వస్త్ర పరిశ్రమ కునారిల్లుతున్నది. కంపెనీలు, మిల్లులు మూతబడుతున్నాయి. వెరసి ఉత్పత్తి సగానికి పడిపోగా, లక్షమందికిపైగా కార్మికులు రోడ్డునపడ్డారు.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. అందరికీ అందుబాటులో
మొబైల్ కనెక్టివిటీలోనే కాదు.. ఇంటర్నెట్ కనెక్షన్లలోనూ తెలంగాణ ముందువరుసలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తాజాగా లోక్సభలో ఇచ్చిన సమాచారం ప్రకారం 2022 సెప్టెంబర్ 30 నాటికి తెలంగాణలో సుమారు 3.14 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అంటే.. దాదాపుగా మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ నెట్ వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.14 కోట్ల మంది, పట్టణ ప్రాంతాల్లో 1.99 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ఇక సగటు వినియోగదారులను గణిస్తే.. ప్రతి వంద మందిలో సుమారు 83 మందికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
సగటు ఇంటర్నెట్ వినియోగదారులు: 82.49 శాతం
గ్రామీణ ప్రాంతాల్లో: 57.40 శాతం
పట్టణ ప్రాంతాల్లో: 110.60 శాతం
22 ఏండ్ల మోదీ గుజరాత్.. కొందరికే చెల్లుబాటు
గుజరాత్లో ఇప్పటికీ దాదాపు 30 శాతం మంది ఇంటర్నెట్ కనెక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. గుజరాత్లో 2022 సెప్టెంబర్ నాటికి మొత్తం 5.12 కోట్ల మంది ఇంటర్నెట్ సేవలు పొందుతున్నారు. అయితే.. సగటు వినియోగదారులను గణిస్తే ప్రతి 100 మందిలో 72 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీకి అందుబాటులో ఉన్నారు. అభివృద్ధిలో అందనంత ఎత్తున్నామన్న నేతల మాటలకు.. క్షేత్రస్థాయి నిజాలకు పొంతన లేకపోవడం విడ్డూరం.
సగటు ఇంటర్నెట్ వినియోగదారులు – 72.05%
గ్రామీణ ప్రాంతాల్లో: 44.93 శాతం
పట్టణ ప్రాంతాల్లో: 100.80 శాతం
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. 4జీ హుజూర్
అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుంది. మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీల్లో ఉన్నతంగా నిలిచిన రాష్ట్రం.. అత్యాధునిక 4జీ సేవలు అందించడంలోనూ అదే దూకుడు కొనసాగిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2019 నవంబర్ 30వ తేదీ నాటికి రాష్ట్రంలో 97.5 శాతం గ్రామాలకు 4జీ కనెక్టివిటీ ఉన్నది. 252 గ్రామాలు మాత్రమే 4జీ సేవలకు దూరంగా ఉన్నాయి. పూర్తిగా మొబైల్ కనెక్షన్ లేని 203 గ్రామాలను మినహాయిస్తే.. 49 గ్రామాలకు మాత్రమే 4జీ అందుబాటులో లేదు.
మొత్తం గ్రామాలు: 10,203
4జీ కనెక్టివిటీ ఉన్నవి: 9,951; శాతంలో: 97.5
4జీ సేవలు అందనివి: 252821
22 ఏండ్ల మోదీ గుజరాత్.. ఊళ్లకు లేదు జీ!
గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికీ సుమారు 5 శాతం గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేదు. గొప్పగా గుజరాత్ మోడల్ అంటూ ప్రచారం చేసుకునే నేతలు.. టెక్నాలజీ వినియోగంలో దేశానికే పాఠాలు నేర్పామని చెప్పుకొనే గుజరాత్ నాయకులు.. 4జీ సేవలు ఎందుకు అందించలేదో మాత్రం వివరణ ఇవ్వలేకపోతున్నారు. కేంద్రం నివేదిక ప్రకారం ఆ రాష్ట్రంలో ఇప్పటికీ 821 గ్రామాలు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్కు దూరంగా ఉన్నాయి.
మొత్తం గ్రామాలు: 18,425
4జీ కనెక్టివిటీ ఉన్నవి: 17,604; శాతంలో : 95.5
4జీ సేవలు అందనివి: 821
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. ‘ఉపాధి పని’కొచ్చేలా..
ఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలుచేసిన రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. ఈ పథకాన్ని ఇతర కార్యక్రమాలకు అనుసంధానం చేసి ప్రజలకు ఉపయోగపడే ఆస్తులు సృష్టించి అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చింది. రాష్ట్రంలో ఏటా పదుల కోట్ల రోజుల పనులు చేయిస్తూ.. కూలీల ఖాతాల్లోకి రూ.వేలు జమయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తాజా నివేదిక ప్రకారం 2021-22లో తెలంగాణలో 14.58 కోట్ల పనిదినాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన పనిదినాల్లో ఇది నాలుగు శాతం కన్నా ఎక్కువ. 2019-20తో (10.71) పోలిస్తే పనిదినాలు 36 అధికంగా శాతం నమోదయ్యాయి. 2021-22లో రాష్ట్రంలో ఉపాధి హామీ కింద చేసిన ఖర్చు రూ.4,076 కోట్లు. 2019-20తో (రూ.2,193 కోట్లు) పోలిస్తే ఇది 85 శాతం ఎక్కువ. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ కల్లాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు వంటి నిర్మాణాలు చేపట్టింది. అనేక రాష్ర్టాలు వచ్చి తెలంగాణ విధానాలను అధ్యయనం చేస్తున్నాయి.
2021-22లో పనిదినాలు: 14.58 కోట్లు
చేసిన ఖర్చు: రూ.4,076 కోట్లు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. హామీకి హానికలిగేలా..
ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో గుజరాత్ వెనుకబడిపోయింది. 2021-22లో ఆ రాష్ట్రంలో జరిగిన పనిదినాల సంఖ్య కేవలం 5.68 కోట్లు. ఇది దేశవ్యాప్తంగా నమోదైన పనిదినాల్లో 1.5 శాతం మాత్రమే. దీనిని బట్టే అక్కడ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నదో అర్థం అవుతుంది. 2019-20తో పోల్చినా పెద్దగా పెరిగింది లేదు. ఆ సంవత్సరం 3.53 కోట్ల పనిదినాలు నమోదయ్యాయి. ఇక.. ఉపాధి హామీ నిధుల వినియోగంలోనూ గుజరాత్ వెనుకబడే ఉన్నది. 2019-20లో రూ.965.23 కోట్లు వ్యయం చేయగా, 2021-22లో రూ.1735.72 కోట్లు ఖర్చు చేసింది.
2021-22లో పనిదినాలు: 5.68 కోట్లు
చేసిన ఖర్చు: రూ.1,735 కోట్లు
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. తలెత్తుకుని నిలబడి
తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేండ్లయింది. ఏడు మండలాలు లాక్కొని, పవర్ ప్రాజెక్ట్ గుంజుకొని అడుగులు వేయకముందే వెనుకదెబ్బ తీశారు. సంకల్పం బలమైనది అయితే.. సంకటాలు అవే తొలగిపోతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా నమ్మింది అదే! స్పష్టమైన విజన్తో రాష్ట్ర సంపద సృష్టించే మార్గాలను అన్వేషించారు. కలిగిన సంపదను పేదలకు సంక్షేమ పథకాల రూపంలో పంచుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండిట్లో సమతూకం పాటిస్తూ తెలంగాణను ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి విప్లవాత్మకమైన సంస్కరణల ఫలితంగా రాష్ట్ర తలసరి ఆదాయం జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నది. ఏటికేడు అత్యధిక వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115గా నమోదైంది. పెద్దరాష్ర్టాల తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
2014లో తలసరి ఆదాయం: రూ.1,24,104
2023లో తలసరి ఆదాయం: రూ.3,17,115
వృద్ధిరేటు: 155 శాతం
22 ఏండ్ల మోదీ గుజరాత్.. తలపడటంలో తడబడి
పపరిశ్ర మల రాష్ట్రం. తీరమున్న ప్రాంతం. సుసంపన్నులం అని చెప్పుకొనే రాష్ట్రం. ఇన్ని అనుకూలతలున్నా.. తల సరి ఆదాయ వృద్ధిలో గుజరాత్ తడబడుతున్నది. 2022లో ఆ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,50,100గా నమోదు అయింది. 2014తో పోలిస్తే 72.41 శాతం మాత్రమే పెరుగుదల కనిపిస్తుంది. గుజరాత్ గురించి చెప్పుకొనే గొప్పలకు ఇది తక్కువే! ఐటీ ఎగుమతుల్లో దిగదుడుపు లెక్కలతో నెట్టుకు వస్తున్నది. అక్కడి పాలకుల దూరదృష్టి లోపం ఐటీ సెక్టార్లో గుజరాత్ ప్రస్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ఐటీలో భారీ పెట్టుబడులు రాకపోవడం, ఉద్యోగాలు సృష్టించ లేకపోవడంతోపాటు ఇతర రంగాల్లోనూ ఆశించిన సాయ్థిలో అభివృది ్ధ జరగకపోవడంతో ఆ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ఆశించిన మేర పెరగడం లేదన్నది విశ్లేషకుల మాట.
2014లో తలసరి ఆదాయం: రూ.1,45,485
2022లో తలసరి ఆదాయం: రూ.2,50,100
వృద్ధిరేటు: 72.41 శాతం
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. వృద్ధిరేటు భళా!
తెలంగాణ కల సాకారం కావడంతోనే సంబురం అనుకోలేదు ముఖ్యమంత్రి కేసీఆర్. పట్టుపట్టి సాధించుకున్న రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి కంకణబద్ధులై పనిచేశారు. వ్యవసాయం నుంచి స్టార్టప్ల వరకు అన్ని రంగాల్లోనూ సమగ్ర అభివృద్ధి సాధించేలా కార్యాచరణ అమలుచేశారు. ఒకవైపు ప్రాజెక్టులు కట్టి, మిషన్ కాకతీయ చేపట్టి పల్లెపల్లెనూ ఆర్థిక వృద్ధిలో పాలుపంచుకునేలా తీర్చిదిద్దారు. టీఎస్ఐపాస్ వంటి విప్లవాత్మక పథకాలు, పారిశ్రామిక అనుకూల విధానాలు ఆయా రంగాలు అద్వితీయ పురోగతి సాధించేందుకు దోహదం చేశాయి. మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఐటీ రంగం దేశంలోనే అగ్రగామిగా నిలబడింది. ఒకటేమిటి రియల్ ఎస్టేట్, వ్యవసాయ అనుబంధ రంగాలు ఆర్థికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీఎస్డీపీ పరుగులు పెట్టింది. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)ని మించి రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి సాధించింది. తొమ్మిదేండ్లలో జీఎస్డీపీ వృద్ధిరేటు 155 శాతంగా నమోదైంది.
2014లో జీఎస్డీపీ విలువ: రూ.5,05,849 కోట్లు
2023లో విలువ: రూ.12,93,469 కోట్లు
వృద్ధిరేటు: 155 శాతం
22 ఏండ్ల మోదీ గుజరాత్.. పరుగులో డీలా!
పరిశ్రమల అడ్డాగా పేరున్న అరవై ఏండ్ల గుజరాత్.. తొమ్మిదేండ్ల తెలంగాణతో పోటీపడలేక డీలాపడింది. ఆ రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి నెమ్మదిగా సాగుతున్నది. జీఎస్డీపీని ప్రభావితం చేసే ప్రాథమిక, సేవా రంగాలు అక్కడ కుంటుపడ్డాయి. వ్యవసాయరంగం కుదేలు అవుతుండగా, సేవారంగం నామమాత్రంగా ఉన్నది. ఐటీ ఎగుమతుల్లో గుజరాత్ వాటా ఒక్క శాతం కూడా లేదంటే సేవారంగం దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉత్పత్తి రంగం మీదే ఆధారపడ్డ గుజరాత్లో.. క్రమంగా ఆ రంగమూ దెబ్బతింటున్నది. ముఖ్యంగా టెక్స్టైల్ రంగం. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటిగా చెప్పుకొనే సూరత్ వంటి ప్రాంతాల్లోనే వేలాది కంపెనీలు మూతపడుతున్నాయి. భవిష్యత్తులో గుజరాత్ వృద్ధిరేటు మరింత పడిపోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
2014లో జీఎస్డీపీ విలువ: రూ.9,21,773 కోట్లు
2023లో: రూ.25.63 లక్షల కోట్లు
వృద్ధిరేటు: 136 శాతం
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. వేడుకగా వేదికలు
దేశంలో రైతు కులాసాగా ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కర్షకుడి కష్టాన్ని గుర్తించే పాలకుడు ఉండటమే ఇందుకు కారణం. నారు పోసిన నాటి నుంచి ధాన్యం సేకరణ వరకు రైతుకు నికరంగా అండగా నిలుస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. రైతులంతా తమ ఇష్టాలను, పరిశ్రమను, ఆలోచనలను పంచుకునేందుకు ఓ వేదిక ఉండాలనుకున్నారు సీఎం కేసీఆర్. ఆయన ఆలోచనకు ప్రతిరూపమే ఊరూరా వెలసిన రైతు వేదికలు. వ్యవసాయ క్లస్టర్కు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 2,801 రైతు వేదికలను నిర్మించారు. అంతేకాదు.. రైతులు తమ పొలాల వద్ద పంట ఉత్పత్తులను ఆరబెట్టుకునేందుకు ఇప్పటివరకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లూ లేవు. దీంతో పొలం దగ్గరే ఆరబోసేవారు. దీంతో తేమ తగ్గకపోవడం, మట్టి, రాళ్లు వంటివి ఎక్కువగా రావడం వంటి సమస్యలు ఉండేవి. దీనిని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 89 వేల కల్లాలను నిర్మిస్తున్నారు.
రైతు వేదికల నిర్మాణం: 2,801
వ్యయం: రూ.572 కోట్లు
కల్లాల నిర్మాణం: 89 వేలు
వ్యయం: రూ.750 కోట్లు
22 ఏండ్ల మోదీ గుజరాత్.. రచ్చబండలే దిక్కు
రైతులను ఏనాడూ పట్టించుకోని గుజరాత్లో రైతు వేదికలు భవిష్యత్తులో ఊహించడం కూడా కష్టమే! గ్రామం నడిబొడ్డున ఉండే రచ్చబండలే రైతుల చర్చా వేదికలు. సాగుబడిలో తీరుతెన్నులను పరిశీలించడానికి వ్యవసాయ అధికారులు అంతంతమాత్రమే అందుబాటులో ఉన్నారు. పంట ఆరబోసుకోవడానికి కల్లాల్లేవు. కనీసం వాటిని నిర్మించాలన్న ఆలోచన కూడా గుజరాత్ పాలకులకు కలగటం లేదు. ఇప్పటికీ అక్కడి రైతులు తమ ఉత్పత్తులను రోడ్లమీద ఆరబోసుకుంటున్నారు.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. సమీకృత విజయం
ప్రభుత్వ పరిపాలనా భవనాలు అంటే పాడుబడ్డ భవంతుల్లా ఉంటాయని అందరికీ తెలుసు. ఈ పాత బంగ్లాలైనా ఒక్కచోట ఉంటాయా అంటే అదీ కాదు! ఒకటి ఓ కొనకు ఉంటే.. ఇంకోటి మరో కొనకు ఉంటుంది. పది కార్యాలయాల చుట్టూ రెండు రోజులు తిరిగితే గానీ ఒక్క దరఖాస్తు ఇవ్వలేని దుస్థితి. నవ తెలంగాణలో ప్రజలకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావొద్దని సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లాల పునర్విభజన చేపట్టి పాలనను ప్రజలకు చేరువ చేశారు. కలెక్టర్ను కలవాలంటే వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా.. 70-80 కిలోమీటర్ల పరిధిలోపే జిల్లా కేంద్రాలు వచ్చాయి. అన్నిరకాల సమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా అన్ని విభాగాల జిల్లాస్థాయి అధికారులు, కార్యాలయాలు ఒకేచోట ఉండేలా సమీకృత కలెక్టరేట్లకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి. రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లా కేంద్రాల్లో సమీకృత భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 16 ప్రారంభోత్సవం జరుపుకొన్నాయి. 20-25 ఎకరాల ప్రాంగణంలో 1.5 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో సకల హంగులతో కలెక్టరేట్లు నిర్మిస్తున్నారు.
మొత్తం కలెక్టరేట్లు: 29
అంచనా వ్యయం: రూ.1,581 కోట్లు
ప్రారంభమైనవి: 16
22 ఏండ్ల మోదీ గుజరాత్.. ఇన్నాళ్లకు కదలిక
గుజరాత్లో ఇప్పటికీ జిల్లా కేంద్రాల్లో పాతకాలం నాటి భవనాలే దిక్కు. అరకొర వసతులతో అవి ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో కొన్నిచోట్ల ఉన్న కలెక్టరేట్లలోనే అదనంగా అంతస్తులు లేదా కొత్త బ్లాకులు నిర్మిస్తున్నారు. అలాంటి అవకాశం లేని చోట కొన్ని విభాగాలను వేరే ప్రాంతాల్లోని భవనాలకు తరలిస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రాలకు వచ్చే ప్రజలు ఆయా ఆఫీసుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. కొన్ని జిల్లా కేంద్రాల్లో మాత్రం సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. గతేడాది వడోదరలో కలెక్టరేట్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. తెలంగాణలో కలెక్టరేట్ల సమీకృత భవనాల నిర్మాణాల స్ఫూర్తితో ఇప్పుడు గుజరాత్లోనూ నూతన కలెక్టరేట్లు కట్టడానికి పూనుకుంది అక్కడి ప్రభుత్వం.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. బాలల పోషణలో ప్లస్
పిల్లలు ఆరోగ్యంగా ఎదిగితేనే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందన్నది బీఆర్ఎస్ ప్రభుత్వ ఆకాంక్ష. అందుకే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పిల్లలకు పోషకాహారం అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా బాలామృతాన్ని తయారుచేసింది. క్యాల్షియం, విటమిన్-ఎ, బి-కాంప్లెక్స్, గోధుమపిండి, శనగపప్పు, నూనెలు, చక్కెర వంటి పోషకాలను కలిపి తెలంగాణ ప్రభుత్వం దీనిని రూపొందించింది. దీనిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా 7 నెలల పిల్లల నుంచి మూడేండ్లలోపు వారికి అందజేస్తున్నది. అంతేకాకుండా తక్కువ బరువున్న పిల్లలకు రోజుకొక గుడ్డు చొప్పున ఇస్తున్నది. మరిన్ని పోషకాలు కలిపి బాలామృతం ప్లస్ను బాలలకు అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
ఐదేండ్లలోపు పిల్లల్లో పోషకాహారలోపంతో బాధపడుతున్నవారు: 22 శాతం
22 ఏండ్ల మోదీ గుజరాత్.. పోషకాహారం మైనస్
గుజరాత్లో చిన్నారులకు పోషకాలు అందించేందుకు ప్రత్యేక పథకం అంటూ ఏదీ అమలు కావడం లేదు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, ఆహారం తప్ప అదనపు పోషక విలువలు అందించడం లేదు. దీంతో ఆ రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో తక్కువ బరువుతో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా ఉన్నది. జాతీయ కుటుంబ సమగ్ర సర్వే-5 ప్రకారం ఆ రాష్ట్రంలో దాదాపు 40 శాతం మంది చిన్నారులు తక్కువ బరువుతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం కారణంగానే ఆ చిన్నారులు ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది.
తక్కువ బరువున్న పిల్లలు: 39.7 శాతం
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. భద్రతలో నంబర్ 1
తెలంగాణలో పౌరులకు కట్టుదిట్టమైన భద్రత ఉండాలనే ఉద్దేశంతో స్వరాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేశారు. క్రమక్రమంగా పోలీస్ స్టేషన్లను పెంచి, భద్రత కోసం పోలీసుల సంఖ్యను ఏటేటా పెంచుతూ వస్తున్నారు. నిరంతరం పెట్రోలింగ్తో గస్తీ కాసేందుకు కొత్త వాహనాలు ఇచ్చి, సిబ్బందిని పెంచి నిఘా పటిష్ఠం చేశారు. రాజధాని హైదరాబాద్ సహా.. అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో.. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించి నిఘాను మరింత పెంచారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 838 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో ప్రత్యేకించి మహిళల భద్రత కోసమే సుమారు 18 పోలీస్ స్టేషన్లను కొత్తగా ఏర్పాటుచేశారు. మన పోలీసుల పనితీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో ఎన్నో జాతీయ స్థాయి సర్వే సంస్థలు అత్యుత్తమ ర్యాంకులు ఇచ్చాయి. ఇటీవల విడుదల చేసిన జస్టిస్ ఇండియా రిపోర్టు-2023లో తెలంగాణ పోలీస్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణలో ప్రతి లక్షమంది పౌరులకు 131 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు.
గ్రామీణస్థాయి పోలీస్ స్టేషన్లు- 396
అర్బన్ ఏరియాల్లో స్టేషన్లు – 350
స్పెషల్ పర్పస్ పోలీస్ స్టేషన్లు- 92
మొత్తం స్టేషన్లు – 838
22 ఏండ్ల మోదీ గుజరాత్.. లాకప్డెత్తుల్లో నంబర్ 1
కేవలం మత రాజకీయాలపైనే దృష్టిపెట్టిన గుజరాత్ నాయకులు ప్రజల భద్రతను గాలికి వదిలేశారు. దీంతో అక్కడ క్రైమ్రేట్ విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల సంఖ్య 727 మాత్రమే. గుజరాత్లో లక్షమంది జనాభాకు కేవలం 122 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. పోలీస్శాఖ పనితీరు, సిబ్బంది విధానం, పోలీస్ స్టేషన్లలో కల్పిస్తున్న మౌలిక వసతులపై ఇండియా జస్టిస్ రిపోర్టు-2023 ఇచ్చిన నివేదికలో గుజరాత్కు ఆరో స్థానం లభించింది. ఇక లాకప్ డెత్లతో గుజరాత్ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. జాతీయ మానవ హకుల కమిషన్ నివేదిక ప్రకారం.. గడిచిన ఐదేండ్లలో గుజరాత్లో 80మంది పోలీస్ కస్టడీలో మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ 42 శాతం పోలీస్ స్టేషన్లలో ఇంకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం గుజరాత్లో ప్రతినెలా 45 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రిపోర్టు-2021 ప్రకారం అత్యధిక క్రైమ్ రేట్ కలిగి ఉన్న రాష్ట్రం కూడా గుజరాతే కావడం గమనార్హం.
గ్రామీణస్థాయి పోలీస్ స్టేషన్లు- 471
అర్బన్ ఏరియాల్లో స్టేషన్లు – 109
స్పెషల్ పర్పస్ పోలీస్ స్టేషన్లు- 147
మొత్తం స్టేషన్లు – 727
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. అదిగో నేరం.. ఇదిగో సాక్ష్యం!
పోలీస్ వ్యవస్థను పటిష్ఠ పరచడంతో తెలంగాణలో నేరాలు తగ్గుముఖం పడ్డాయి. నేరం జరిగినా పక్కా ఆధారాలను సంపాదించడంలో రాష్ట్ర పోలీసులు కృతకృత్యులు అవుతున్నారు. నేరస్థులు తప్పించుకోకుండా సాంకేతికంగా బలమైన ఆధారాలను సేకరించడంలో టీఎస్ పోలీస్ ముందుంటున్నది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేసింది. మరోవైపు సత్యర న్యాయం జరిగేలా కోర్టు పనుల కోసమే ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. వాయిదాలు తప్పకుండా చూడటం, సరైన ఆధారాలను న్యాయస్థానాలకు అప్పగించడం, ఫాలోఅప్ చేయడం వీరి బాధ్యత. ఫలితంగా రాష్ట్రంలో నేర నిర్ధారణ, శిక్షలు పడే శాతం (కన్విక్షన్ రేటు) చాలా ఎక్కువగా ఉన్నది.
2021లో నమోదైన కేసులు – 1,58,809
కన్విక్షన్ రేటు- 70.1 శాతం
22 ఏండ్ల మోదీ గుజరాత్.. పట్టుకోవడమే పదివేలు!
గుజరాత్లో నేరాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎన్సీఆర్బీ ప్రకారం 2021లో గుజరాత్లో 7,31,738 కేసులు నమోదయ్యాయి. ఇన్వెస్టిగేషన్ రేటు 96.9 శాతంగా ఉన్నది. పేరుకే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి, కోర్టుల్లో చార్జిషీట్లు వేస్తున్నారు. అక్కడితో చేతులు దులుపుకొంటున్నారు. సరైన పద్ధతిలో ఆధారాలు సేకరించకపోవడం, కోర్టుల్లో ఫాలోఅప్ చేయకపోవడం వంటి కారణాల వల్ల ఆ రాష్ట్రంలో కన్విక్షన్ రేటు అతి తక్కువగా నమోదవుతున్నది. నేరం చేసిన ప్రతి వంద మందిలో కేవలం 20 మందికి మాత్రమే శిక్ష పడుతున్నది. అంతేకాదు.. బిల్కిస్ బానో అత్యాచార ఘటన వంటి తీవ్ర నేరాలు చేసిన వారిని కూడా విడుదల చేస్తూ గుజరాత్ పోలీసింగ్ తమ ఘనతను చాటుకుంటున్నది.
2021లో నమోదైన నేరాలు: 7,31,738
కన్విక్షన్ రేటు: 21.1 శాతం
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. కన్నెత్తి చూస్తే కటకటాల్లోకి
రాష్ట్రంలో బాలల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. బాలలపై నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో తరుచూ పర్యటిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఏవైనా నేరాలు జరిగితే వెంటనే తమకు తెలియజేయాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు బాధితులకు భరోసా సెంటర్ల ద్వారా అభయం అందిస్తున్నారు. చిన్నారులపై నేరాలకు సంబంధించి అత్యంత గోప్యంగా విచారణ, దర్యాప్తు జరుపుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పోక్సో కేసుల్లో అరెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయి. 2021లో రాష్ట్రంలో బాలలపై నేరాలకు సంబంధించి 5,667 కేసులు నమోదు కాగా, వేగంగా దర్యాప్తు చేసి 4,413 చార్జిషీట్లు దాఖలు చేశారు. 4481 మందిని అరెస్ట్ చేశారు. ఆ నేరాలను పక్కా రుజువు చేస్తుండటంతో కన్విక్షన్ రేటులో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.
పోక్సో నేరాల్లో శిక్షలు పడినవారి సంఖ్య: 674
కన్విక్షన్ రేటులో ర్యాంకు: 3
22 ఏండ్ల మోదీ గుజరాత్.. టాప్ పదిలోనూ లేదు
గుజరాత్లో బాలలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి పోలీసులు నత్తనడకన దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కోర్టుల్లో చార్జిషీట్లు తక్కువగా నమోదవుతున్నాయి. చాలా తక్కువ మందికి శిక్ష పడుతున్నది. 2021లో గుజరాత్లో బాలలపై నేరాలకు సంబంధించి మొత్తం 4,519 కేసులు నమోదయ్యాయి. 4,578 మందిని అరెస్ట్ చేశారు. అయితే 3,587 నేరాల్లో మాత్రమే పోలీసులు దర్యాప్తు నివేదికను న్యాయస్థానాలకు సమర్పించారు. దీంతో చాలా తక్కువ మందికి శిక్ష పడింది. పోక్సో నేరాలకు సంబంధించి శిక్షల విషయంలో 28 రాష్ర్టాల ర్యాంకింగ్లో గుజరాత్కు టాప్ పదిలోనూ చోటు దక్కకపోవడం శోచనీయం.
శిక్ష పడినవారి సంఖ్య: 107
దేశంలో ర్యాంకు: 13
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. బెహతరీన్ కామ్!
ఒకప్పుడు వేసవి వచ్చిందంటే ఖాళీ బిందెల ప్రదర్శన నిత్యకృత్యం. వానకాలంలోనూ రక్షిత మంచినీళ్లు దొరక్క వనసీమల్లోని గూడాల్లో అతిసారం ప్రబలుతుండేది. ఇవన్నీ గతం. ఇప్పుడు తెలంగాణలో ప్రతీ పల్లె మిషన్ భగీరథ రక్షిత జలాలతో గొంతు తడుపుకొంటున్నది. కృష్ణా, గోదావరి నీళ్లతో దాహార్తిని తీర్చుకుంటున్నది. ‘ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని చెప్పిన ఒకేఒక్క నాయకుడు కేసీఆర్. రాబోయే 30 ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు రూ.37వేల కోట్ల ఖర్చుతో అతి తక్కువ కాలంలో ఈ పథకాన్ని ప్రజలకు అంకితం చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే నగరవాసులు ఎలాంటి నీళ్లు తాగుతున్నారో.. ఆదిలాబాద్ అడవిలోని మారుమూల గూడెం వాసులు సైతం అలాంటి నీటితోనే దాహార్తిని తీర్చుకుంటున్నారు. అంతేకాదు స్వచ్ఛతలోనూ తెలంగాణ తాగునీరు దేశానికి ఆదర్శంగా నిలిచింది. 99.953 శాతం స్వచ్ఛతతో ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి. ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందిస్తున్న రాష్ర్టాల జాబితాలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.
22 ఏండ్ల మోదీ గుజరాత్.. శరమ్ కీ బాత్
గుజరాత్లోని 33 జిల్లాల్లో ఉన్న 91.7 లక్షల గ్రామీణ కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చి, 100 శాతం ఇండ్లకు సురక్షిత మంచినీళ్లు ఇస్తున్నట్టు పేర్కొన్నది. దూప తీర్చడంలో దేశానికి దారి చూపించామని డంబాలు పలికింది. 20కిపైగా జిల్లాల్లోని గ్రామాల్లో, పట్టణాల్లో వారానికి రెండుసార్లు నీళ్లు రావడం కూడా గగనంగా మారిపోయింది. 14 జిల్లాల్లోని సుమారు 500కి పైగా గ్రామాలకు ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండటం విడ్డూరం. అదీ వారానికి ఒకసారి మాత్రమే! 2002 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనకు ఓటేసి గెలిపిస్తే మంచినీళ్లు ఇస్తానని మోదీ హామీ ఇచ్చారు. 20 ఏండ్లు గడిచిన తర్వాత కూడా తమ నీటి కష్టాలు తీరలేదని 50వేల మంది మహిళలు ఇటీవల ప్రధానికి లేఖ రాయడం గమనార్హం. దేశ జనాభాలో 5 శాతంగా ఉన్న గుజరాత్ కేవలం 2 శాతం నీటి లభ్యతను కలిగి ఉండటం మోదీత్వం ఏ పాటిదో నిరూపిస్తున్నది. ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందిస్తున్న రాష్ర్టాల జాబితాలో గుజరాత్ కిందినుంచి మూడోస్థానంలో ఉంది.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. వెలుగుపూలు.. మన చదువులమ్మలు!
నాన్న చదువు.. బిడ్డ కడుపు నింపగలదు. అమ్మ చదువు తన బిడ్డలకు బంగారు జీవితాన్ని ఇవ్వగలదు. బాలికలే రేపటి ఏలికలు అన్న మాటలను నిజం చేస్తూ అమ్మాయిలు చదువుల్లో దూసుకుపోతున్నారు. తాము వంటింటి కుందేళ్లం కాదని.. విజ్ఞానకాంతులు వెదజల్లే చదువుల సరస్వతులమని నిరూపించుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ, బీఈడీ ప్రవేశాల్లో వారిదే పూర్తి ఆధిపత్యంగా నడిచింది. పీజీ కోర్సుల్లో 72 శాతం.. డిగ్రీలో 52 శాతం.. బీఈడీ కోర్సుల్లో 81 శాతం అమ్మాయిలే చేరారు. వర్సిటీ క్యాంపస్ల వారీగా తీసుకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 59.33 శాతం, కాకతీయ వర్సిటీలో 60.08 శాతం, పాలమూరు యూనివర్సిటీలో 59.68 శాతం, తెలంగాణ వర్సిటీలో 56.40శాతం, శాతవాహనలో 73.97 శాతం, జేఎన్టీయూలో 73.36, మహత్మాగాంధీ వర్సిటీ క్యాంపస్లో 57.67 శాతం అమ్మాయిలు పీజీ ఫస్టియర్లో చేరారు. గతేడాది 70శాతానికి పైగా అమ్మాయిలు చేరగా, వారంతా ఈ ఏడాది సెకండియర్లో ఉన్నారు. ఇక ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (అయిషే) నివేదిక ప్రకారం తెలంగాణలో అన్ని కేటగిరీల్లో 100 మంది అబ్బాయిలకు 109 మంది, ఎస్సీలలో 124 మంది బాలికలు ఉన్నత విద్య ఫలాలను అందుకున్నారు. జాతీయ సగటును మించి ఫలితాలు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచింది.
22 ఏండ్ల మోదీ గుజరాత్.. బేటీ పడావో.. ప్రచారం బడావో!
పరీక్షల ఫలితాల సీజన్లో ‘ఈసారీ బాలికలదే పైచేయి..’ అని పత్రికల పతాక శీర్షికల్లో తరచూ కనిపిస్తుంటుంది. బాలికలకు ఉన్నత విద్యను అందించే అవకాశాలు కల్పించడంతో వాళ్లు ఇలాంటి ఫలితాలు సాధించగలుగుతున్నారు. కానీ, గుజరాత్ బాలికలకు మాత్రం ఆ అదృష్టం లేదు. గుజరాత్ మాడల్ బాలికలను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నదని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం గుజరాత్లో అన్ని కేటగిరీల్లో 100 మంది అబ్బాయిలకు 87 మంది, ఎస్సీలలో 89 మంది బాలికలు మాత్రమే ఉన్నత విద్యలో నమోదయ్యారు. జాతీయ సగటులో బాలికలది పైచేయి (100 మంది బాలురులకు 105 మంది బాలికలు) కాగా, గుజరాత్ ఈ విషయంలో తీసికట్టుగా తయారైంది.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. నగరానికి పచ్చచీర చుట్టి
హరిత హారంతో తెలంగాణకు పచ్చదనం చదివించింది రాష్ట్ర ప్రభుత్వం. వట్టిపోయిన అడవులకు జీవం తీసుకురావడంతో సరిపెట్టలేదు. కాంక్రిట్ జంగిల్గా మారిన హైదరాబాద్ను చలువపందిరిగా తీర్చిదిద్దింది. నగరాన్ని అభివృద్ధివైపు పరుగులు పట్టిస్తూనే.. అడుగడుగునా పచ్చదనం పరిఢవిల్లేలా చర్యలు తీసుకుంటున్నది. ఫలితంగా ఈ విశ్వనగరి ఆకుపచ్చ చీర చుట్టుకున్న అపురూప సౌందర్యరాశిగా పర్యాటకులకు దర్శనమిస్తున్నది. దశాబ్దం కిందట హైదరాబాద్లో 33.15 చదరపు కిలోమీటర్లుగా ఉన్న అటవీ విస్తీర్ణం ఇప్పుడు 81.81 చదరపు కిలోమీటర్లకు చేరింది. నగరంలో వన సౌందర్యం ఘనంగా పెరిగింది. దాదాపు 246 శాతం పురోగతి సాధించి మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించింది. దాదాపు రూ.9వేల కోట్ల నిధులు వెచ్చించి రాజధానికి పచ్చల పతకం తొడిగింది రాష్ట్ర ప్రభుత్వం. హరిత నిధిని ఏర్పాటుచేసి అడవితల్లిని పెంచి పోషించే దిశగా అహరహం కృషి చేస్తున్నది. పచ్చదనం పెంపులో హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్సిటీ గుర్తింపు రెండుసార్లు దక్కింది. లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అవార్డు వరించింది. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) నుంచి అవార్డు అందుకున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ‘అడవులు పచ్చగా ఉంటేనే మన బతుకులు చక్కగా ఉంటాయ’ని తరచూ చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి ఈ పురస్కారాలే తార్కాణాలు.
22 ఏండ్ల మోదీ గుజరాత్.. పచ్చదనాన్ని తాకట్టు పెట్టి
సంతులిత అభివృద్ధి జరిగినప్పుడే వాటి ఫలాలు భవిష్యత్ తరాలకు అందుతాయి. పురోగతి కోసం ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తే చివరికి మిగిలేది అధోగతే! ప్రపంచమంతా పచ్చదనం పెంచే పనిలో తలమునకలై ఉంటే.. గుజరాత్ సర్కార్ మాత్రం అభివృద్ధి పేరిట వన హననం చేస్తున్నది. 2011 నుంచి 2021 వరకు పదేండ్లలో అహ్మదాబాద్లోని అటవీ విస్తీర్ణం 17.86 చదరపు కిలోమీటర్ల నుంచి 9.41 కిలోమీటర్లకు పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్) నివేదిక ప్రకారం పదేండ్లలో అహ్మదాబాద్లో అటవీ విస్తీర్ణం 48 శాతం మేర పడిపోయింది. అభివృద్ధి అంతంత మాత్రమే ఉన్నా.. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో నిబద్ధతను గాలికొదిలేసింది గుజరాత్ ప్రభుత్వం. ఫలితంగా అహ్మదాబాద్ పచ్చదనాన్ని కోల్పోయి తిరోగమనంలో పురోగమిస్తున్నది
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. మన ‘పంట’పండింది
తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో నీళ్లు లేవు. కరెంట్ లేదు. కళ తప్పిన చెరువులు. పడావుపడ్డ భూములు ఇదీ దృశ్యం. స్వరాష్ట్రం సాధించి తొమ్మిదేండ్లు పూర్తయ్యేనాటికి నవ తెలంగాణ సాక్షాత్కరించింది. నీళ్లకు కరువు లేదు. కరెంట్కు కోత ఉండదు. చెరువుల్లో జలకళ. వెరసి రైతు ‘పంట’ పండింది. తెలంగాణ భారతావనికి అన్నపూర్ణగా ఎదిగింది. తాను పెద్దకాపునని సగర్వంగా ప్రకటించుకునే ముఖ్యమంత్రి దూరదృష్టి రైతుల జీవితాలను కాపుకాసింది. కాళేశ్వర జలాలు ఇంకిన నేలంతా ధాన్యరాసులు కురిశాయి. ఎవుసం చేతగాదన్న చోట పుట్లకొద్దీ ధాన్యం పుట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్బుక్ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2015-16లో మన రాష్ట్రంలో 45.71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. 2020-21 నాటికి 342 శాతం వృద్ధితో 2021.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికొచ్చింది. తెల్లబంగారం దిగుబడిలోనూ తెలంగాణ రికార్డు విజయం సాధించింది. 2015-16 సంవత్సరానికి 18.85 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి చేతికొస్తే.. 2021-22కు వచ్చేసరికి దాదాపు 33 శాతం వృద్ధితో 25.08 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించింది. మొత్తంగా తెలంగాణ రైతు సగర్వంగా తలెత్తుకునేలా రాష్ట్రంలో అన్ని పంటల దిగుబడులూ పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి.
22 ఏండ్ల మోదీ గుజరాత్.. సాగుబడిలో డీలా
సబ్కా సాత్ సబ్కా వికాస్’ ఈ నినాదం విధానంగా మారి ఉంటే గుజరాత్లో సాగుబడి పురోగమించేది. దేశానికి వెన్నెముకలాంటి కర్షకులను కష్టాలకు వదిలేయడంతో ఆ రాష్ట్రంలో సాగుబడి తిరోగమిస్తున్నది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ హ్యాండ్బుక్లోని గణాంకాలే ఇందుకు రుజువు. చెరకు, పత్తి, తృణధాన్యాలు అక్కడ ప్రధాన పంటలుగా ఉన్నాయి. పత్తి దిగుబడిలో ఆ రాష్ట్రం దూదిపింజలా తేలిపోయింది. 2017-18 సంవత్సరంలో 101.87 లక్షల టన్నుల పత్తి పండితే.. 2021-22 నాటికి 26 శాతం క్షీణతతో 74.82 లక్షల టన్నుల పత్తి చేతికి వచ్చింది. ఇక చెరకు సాగులోనూ గుజరాత్ హర్షించదగిన ఫలితాలు సాధించలేకపోయింది. 2015-16 సంవత్సరానికి గాను 111.2 లక్షల టన్నుల పత్తి దిగుబడి సాధించగా.. 2021-22 నాటికి కేవలం 42 శాతం వృద్ధితో 158.5 లక్షల టన్నులకు చేరుకుంది.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. అడవిబిడ్డలకు అండగా
అడగందే అమ్మయినా పెట్టదు. కానీ, అడగకముందే అన్నీ అందించి అందరివాడు అనిపించుకున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్. కులమత భేదం లేకుండా సంక్షేమ ఫలాలను అందరికీ అందిస్తున్నారు. దశాబ్దాలుగా నానుతున్న పోడు భూముల సమస్యను పెద్దమనసుతో పరిష్కరించి అడవి బిడ్డలకు భరోసానిచ్చారు. పోడు సమస్యకు ముగింపు పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా 11.50 లక్షల ఎకరాలను గిరిజనులకు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది తెలంగాణ ప్రభుత్వం. అడవిని సంరక్షించడం పోడు రైతుల బాధ్యతనీ, వారి బాగోగులు తను చూసుకుంటానని నిండు శాసనసభలో ప్రకటించారు. ప్రకటించినట్టుగానే పోడు భూముల పట్టాలు సిద్ధమయ్యాయి. పంపిణీకి త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది. అంతేకాదు, భూముల్లేని గిరిజనులకు ‘దళిత బంధు’ తరహాలో ‘గిరిజన బంధు’ కూడా ఇస్తామని విస్పష్టంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల గిరిజన గూడేల్లోని అవ్వలు సంతోషంగా ఉన్నారు. మిషన్ భగీరథ పుణ్యాన రక్షిత తాగు నీటి వ్యవస్థ ఏర్పాటుచేసి గిరిజన గూడేల్లో అంటువ్యాధులు ప్రబలకుండా రక్షణ కల్పించారు.
22 ఏండ్ల మోదీ గుజరాత్.. తిండిగింజలు దండగ
అన్నెం పున్నెం ఎరుగని గిరిజనులపై గుజరాత్ సర్కార్ కత్తిగట్టింది. దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటూనే.. గుజరాత్లోని గిరిజనుల నోటికాడ బుక్కను బలవంతంగా లాక్కుంటున్నది. జాతీయ ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడుస్తూ గిరిజనుల కడుపు కొడుతున్నది. అదనపు కార్డులున్నాయన్న సాకుతో కుటుంబాలకు ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు చేస్తున్నది. గుజరాత్లోని నర్మదా, డాంగ్, తాపీ తదితర 11 జిల్లాల్లోని 30 తాలూకాల్లో ఏరివేత ప్రక్రియను కొనసాగిస్తున్నది. దీంతో 83,556 కుటుంబాల్లోని 5 లక్షలమంది గిరిజనులు ఉచిత ఆహార ధాన్యాలు పొందడానికి అవకాశం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అసలు ఆర్థిక సర్వే నిర్వహించకుండానే రేషన్ కార్డుల ఏరివేతకు శ్రీకారం చుట్టడంపై అక్కడి గిరిజనులు మండిపడుతున్నారు.
10 ఏండ్ల కేసీఆర్ తెలంగాణ పాలనలో.. అభివృద్ధి ఖర్చులో అగ్రగామి
నిరుపేదలకు పంచడంలోనే కాదు పెరిగిన సంపదను అభివృద్ధికి వెచ్చించడంలోనూ తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకున్నది. 360 డిగ్రీల కోణంలో పురోగతి సాధించినప్పుడే రాష్ట్రంలో అన్ని వర్గాలకూ వాటి ఫలాలు అందుతాయి. అందుకు తగ్గట్టుగానే వ్యవసాయ రంగాన్ని స్థిరీకరించి పల్లె ముఖచిత్రాన్ని మార్చేసింది. బహుళజాతి సంస్థలను ఆకర్షించి హైదారాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దింది. ఇలా కలిగిన సంపదను రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు చేస్తూ ఆదర్శ పాలనను అందిస్తున్నది. తెలంగాణ ఆర్థిక సర్వేను అనుసరించి పర్క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. 2018-21 సంవత్సరాలకు గాను సగటున తెలంగాణ పర్క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ రూ.26,897గా నమోదైంది. ఇది జాతీయ సగటు కన్నా దాదాపు రూ.6,600 అధికం కావడం విశేషం. అభివృద్ధి ఫలాల ద్వారా వచ్చిన సంపదను నిరుపేదల సంక్షేమానికి ఖర్చు చేస్తూనే, రాష్ట్ర పురోగతికి కూడా సమ ప్రాధాన్యమిస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.
22 ఏండ్ల మోదీ గుజరాత్.. పురోగతిలో అధోగతి
రెండు దశాబ్దాలుగా ఎన్ని చెప్పారో! అన్నిటా ఆదర్శమన్నారు. మమ్మల్ని కొట్టేవాడు లేడన్నారు. అరచేతిలో స్వర్గం చూపించి అందలం ఎక్కారు. తీరా లెక్కలు తీస్తే ఏ పురోగతి పేరు చెప్పుకొని వచ్చారో.. అందూలోనూ అధోగతి అని తేలిపోయింది గుజరాత్ మాడల్. పర్క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో 65 ఏండ్ల గుజరాత్ పెర్ఫార్మెన్స్ తొమ్మిదేండ్లు నిండుతున్న తెలంగాణతో పోలిస్తే హస్తిమశకాంతరం తేడా కనిపిస్తుంది. జాతీయ సగటుకన్నా తక్కువ ఖర్చు చేసే రాష్ర్టాల్లో ఒకటిగా గుజరాత్ నిలిచింది. 2018-21కి గాను ఆ రాష్ట్ర పర్క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కేవలం రూ.17,511 మాత్రమే కావడం గమనార్హం. ఇది జాతీయ సగటు కన్నా రూ.2,700 తక్కువ. ఇది తెలంగాణతో పోలిస్తే 35 శాతం తక్కువ.