Old Pension Scheme | కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS)ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ స్కీం (OPS)పై అధ్యయన కమిటీని నియమిస్తామని ప్రకటించింది. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆదివారం ప్రకటించిన సీఎం కేసీఆర్ ‘సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వం ఉన్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారు.
దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని’ ప్రకటించారు. అయితే, ఇటీవలే ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్ను కలిసి సీపీఎస్ రద్దుతో ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తూ ఓ నివేదికను సీఎం కేసీఆర్కు అందించారు. ఈ క్రమంలో అధ్యయనానికి కమిటీని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి, మేనిఫెస్టోను పొందుపరిచారు.
ఈ ప్రకటన ప్రకటనను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. రాష్ట్రంలో 2లక్షల సీపీఎస్ ఉద్యోగులున్నారు. ఇటీవలే కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. వీఆర్వోలను సైతం ఇతరశాఖల్లో సర్దుబాటు చేశారు. దీంతో సీపీఎస్ ఉద్యోగుల సంఖ్య 2.5 లక్షలుంటాయి. సీపీఎస్ను రద్దుచేసి.. పాత పెన్షన్ స్కీంను ప్రభుత్వం అమలు చేస్తే రాష్ట్రంలోని 2.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.