హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సిద్ధించిన తొమ్మిదేండ్లలోనే విద్యారంగంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దకిందని ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అసాధ్యాలను సుసాధ్యం చేసిన గొప్ప విజనరీ కేసీఆర్ అని కితాబిచ్చారు. గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న 565 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసిన సందర్భంగా హైదరాబాద్లోని బంజారా సేవాభవన్లో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కొప్పుల ప్రసంగించారు.
గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ పేదలకు మంచి విద్యావసతి సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన చేయలేదని విమర్శించారు. తెలంగాణలోని గురుకుల విద్యాలయాలు దేశవ్యాప్తంగా గౌరవాన్ని తెచ్చిపెట్టాయని తెలిపారు. గురుకుల విద్యాలయాల్లో కాంటాక్ట్ పద్ధతిన 16 ఏండ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించుకోవడం దేశ చరిత్రలోనే గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు. ఆర్టీసీ కార్మికులు, వీఆర్ఏలు, విద్యుత్తు కార్మికులు, వైద్య సిబ్బందిని రెగ్యులర్ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని చెప్పారు.
ఈ సందర్భంగా గురుకుల ఉపాధ్యాయులు మంత్రి కొప్పుల ఈశ్వర్ను గజమాలతో సతరించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్, గురుకుల విద్యాసంస్థల సెక్రటరీ నవీన్ నికోలస్, అడిషనల్ సెక్రటరీ హన్మంత్నాయక్, జాయింట్ సెక్రటరీ పార్వతిదేవి, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్టాఫ్ అసోయేషన్ ప్రధాన కార్యదర్శి ప్రభుదాస్, గౌరవ అధ్యక్షుడు ఏవీ రంగారెడ్డి, నిరూపమా సక్రనాయక్, ఉపాధ్యాయ బృందం రజని, జానకి, విక్టోరియా, సునీత తదితరులు పాల్గొన్నారు.