హైదరాబాద్, మే 31(నమస్తే తెలంగాణ): రెండో విడత ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని ఆసిఫాబాద్ జిల్లా కరమెర మండలం కొఠారి గ్రామంలో సోమవారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్టు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఈ మేరకు పొంగులేటి ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడలో జరిగే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని చెప్పారు. రెండో విడతలో 2.5 లక్షల ఇండ్లకు మంజూరు ఇవ్వనున్నట్టు చెప్పారు. రెండు విడతల్లో కలిపి ఒక్కో నియోజకవర్గానికి 5,500 నుంచి 6,500 ఇండ్లు మంజూరు చేసినట్టు తెలిపారు.
ఐటీడీఏ ప్రాంతాల్లో, గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 1500 వరకు ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. 2013లో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మంజూరు చేసి, ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తిచేయడానికి, 2023 గృహలక్ష్మీ పథకంలో మంజూరై పూర్తి చేయలేకపోయినవారికి అవసరమైన ఆర్థికసాయం అందిస్తామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన ఇందిరమ్మ పథకంలో రూ. 20 వేల వరకు ఆర్థికసాయం పొందినవారికి కూడా ఈ విడతలో ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.