CM Revanth | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తన స్థాయిని, హోదాను మరిచి భారత రాష్ట్ర సమితిపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెడుతాం, బొక్కాబోర్లాపడ్డా బుద్ధిరాలేదు.. అంటూ ఆయన అనుచితంగా మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ కార్యాలయం గాంధీభవన్లో మంగళవారం జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపైనా, పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావుపైనా అనుచితమైన భాషను ప్రయోగిస్తూ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్రెడ్డి వ్యాఖ్యలు, మాట్లాడుతున్న భాష, బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్రావును బిల్లా-రంగా అంటూ సంభోదించడం వివాదం అవుతున్నా.. రేవంత్రెడ్డి ధోరణిలో మాత్రం మార్పు కనిపించలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టారని, రాష్ట్రంలో ఆ పార్టీ చచ్చిపోయిందని అన్నారు. కేటీఆర్, హరీశ్రావు తమ పార్టీ మనుగడ కోసమే కాంగ్రెస్ పార్టీపై మాటల దాడి చేస్తున్నారని విమర్శించారు. ఓటమిని తట్టుకోలేక మతి తప్పి ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలువడంలో తప్పలేదని రేవంత్రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీశ్రావు అడిగినా అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని వెల్లడించారు. బీసీ కులగణనకు త్వరలో ప్రారంభం కాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశంలో తీర్మానం చేస్తామని పేర్కొన్నారు.