హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కాకతీయ కళాతోరణం కూడా రాచరిక చిహ్నమేనని చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాం ధీ, కేసీ వేణుగోపాల్ తదితరులను కలిశారు. జూన్ 2న నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని వారిని ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకమని, త్యాగాలు, పోరాటాలు గుర్తుకు వస్తాయని చెప్పారు. ఆ పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం, రాష్ట్ర గేయం ఉంటుందని వివరించారు. నూతన అధికారిక చిహ్నం సమ్మక-సారక్క, నాగోబా జాతర స్ఫూర్తికి అద్ధం పడుతుందని చెప్పా రు. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చుకునే బాధ్యతను ఆ పాట రచయిత అందెశ్రీకే అప్పగించామని తెలిపారు.
కీరవాణిని అందెశ్రీయే ఎంపిక చేశారని, తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొనాలని సోనియాగాంధీని ఆహ్వానించామని, ఆమె ను సత్కరించాలని నిర్ణయించామని, దీనికి ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రంలోని ప్రముఖులను, ఉద్యమకారులను భాగస్వాములను చేస్తామని, అందరినీ అధికారికంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
కోదండరాం నేతృత్వంలో ఆహ్వానితుల జాబితాను తయారు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు తప్ప కరంటు కోతలు లేవని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణపై పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. దేశంలో మరోసారి బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు.
రాజ్యాం గం, రిజర్వేషన్లు రద్దు వంటి అంశాలను తాము ప్రస్తావిస్తే బీజేపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. మోదీ గ్యారెంటీలకు వారెం టీ చెల్లిపోయిందని, దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెండురోజుల పర్యటన పూర్తి చేసుకున్న సీఎం రేవంత్రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు.