హైదరాబాద్, మార్చ్13 (నమస్తే తెలంగాణ) : రంజాన్ మాసం తొలి శుక్రవారం ఈ నెల 15న ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడించారు. ఇఫ్తార్ ఏర్పాట్లను బుధవారం అధికారులతో కలిసి షబ్బీర్ అలీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఇఫ్తార్లో నమాజ్కు, భోజనాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. షబ్బీర్అలీ వెంట రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీం, ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, సమాచార పౌర సంబంధాలశాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు, తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.