CM Revanth Reddy | రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తోందన్న ఆయన.. ఎక్కడా కోతలను విధించడం లేదని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందన్నారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేసిన సంఘటనలపై సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్పై దుష్ప్రచారం చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవన్నారు. గతంతో పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ కోతలు పెడుతున్నారని దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనన్నారు. సచివాలయంలో గృహజ్యోతి, రూ.500 సిలిండర్ పథకాలపై సమీక్షకు ముందు విద్యుత్ కోతలపై అధికారులను ఆరా తీశారు.
గతేడాదితో పోల్చితే గత రెండు నెలల్లో విద్యుత్ సరఫరా ఎక్కువగా చేసినట్లు ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ రిజ్వీ సమాధానం ఇవ్వగా.. మూడు సబ్ స్టేషన్ల పరిధిలో కొంత సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. అందుకు కారణాలపై సీఎం ప్రశ్నించారు. సబ్స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలను సరి చూస్తూ ఉండాలని.. అలా చేసుకోకపోవడంతో పాటు సమస్య తలెత్తిందని అధికారులు చెప్పారు. అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులపై సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఏవైనా మరమ్మతులు, ఇతర అంశాలకు సరఫరా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారనే సమచారం తమకు ఉందని సీఎం హెచ్చరించారు. ఎక్కడైనా 5నిమిషాలకు మించి విద్యుత్ సరఫరా నిలిచిపోతే అందుకు కారణాలపై వెంటనే సమీక్షించుకోవాలని చెప్పారు. సాంకేతిక, ప్రకృతిపరమైన కారణాలు మినహా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కోతలకు కారణమైతే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.