సారనాథ్లో అశోక చక్రవర్తి వేసిన స్తూపంలో ఉన్న నాలుగు సింహాలను , అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా ఎంపిక చేసిన భారత రాజ్యాంగసభ, తొలి ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేత నెహ్రూ
తమిళనాడు చోళ రాజులు తయారు చేసిన సెంగల్ను అధికారిక చిహ్నంగా స్వీకరించి నూతన పార్లమెంట్ భవనంలో ప్రతిష్ఠించిన ప్రస్తుత భారత ప్రధాని, బీజేపీ నేత మోదీ
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికపు చిహ్నాలంటూ ఆయా గుర్తులను రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చివరకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీయే బోనులో నిలబడాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనుసరించిన విధానాలను సైతం తప్పుబట్టే రీతిలో రేవంత్రెడ్డి వ్యవహార శైలి ఉన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రక, వారసత్వ కట్టడాలు, పట్టణాలు, వీధుల పేర్ల విషయంలో ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరికి భిన్నంగా రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
‘నెహ్రూ హయాంలోనే రూపుదిద్దుకున్న భారతదేశ జాతీయ చిహ్నంలోని అశోక చక్రవర్తి నిర్మించిన సారనాథ్ స్థూపం నుంచి సేకరించిన ధర్మచక్రం, నాలుగు సింహాలు రాచరిక కాలానికి చెందినవి కావా? ఇందుకు నెహ్రూతోపాటు తొలితరం జాతీయ నేతలను తప్పుబట్టడం సబబేనా? భారతదేశ పతాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించకముందే, నెహ్రూ తన కారు బాయ్నెట్పై అశోకచక్రం ఉన్న త్రివర్ణ పతాకాన్ని కట్టుకుని తిరగడం కూడా రాచరిక పోకడేనా?’ అనే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన విపత్కర పరిస్థితిని కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చిన ఖ్యాతి రేవంత్రెడ్డికే దక్కుతున్నది. జాతీయ చిహ్నమే కాదు మన ఇరుగు-పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్ర చిహ్నాల్లో కూడా ఆయా రాష్ర్టాల చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే ప్రాచీన కట్టడాలకు ప్రాధాన్యం కల్పించారు. ఆ చిహ్నాలను రూపొందించిన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయన్న విషయాన్ని సైతం రేవంత్రెడ్డి విస్మరిస్తుండటం గమనార్హం.
ఢిల్లీలోని వీధుల పేర్లు, వివిధ పట్టణాల పేర్లు మార్చాలనే డిమాండ్లతో విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీకి పరిపాటి. మొఘల్ చక్రవర్తుల పేర్లతో ఉన్న వీధుల పేర్లను తొలగించాలంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కి సైతం బీజేపీ నేతలు లేఖలు రాశారు. ఆయా పేర్ల మార్పును కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి డిమాండ్ల వెనుక దేశ చరిత్రను మార్చే కుట్ర దాగి ఉన్నదంటూ కాంగ్రెస్ నేతలు వాదిస్తూ వస్తున్నారు. మొఘల్ పాలకుల పేర్లతో ఢిల్లీలో ఉన్న తుగ్లక్రోడ్, బాబర్ లేన్, ఔరంగజేబు లేన్, హుమాయూన్ రోడ్, అక్బర్ రోడ్ పేర్లు మార్చాలని బీజేపీ డిమాండ్ చేసినప్పుడల్లా ఇవి ముస్లింల పట్ల ద్వేషంతో చేస్తున్న డిమాండ్స్ అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
అలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చార్మినార్ రాచరిక చిహ్నమంటూ దానిని రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించే కుట్ర వెనుక మత విద్వేషం దాగి లేదా? అని నెటిజన్లు రేవంత్ సర్కార్ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. అక్బర్, లోధి, సఫ్ధర్జంగ్, తుగ్లక్.. ఇలాంటి చక్రవర్తులంతా ప్రజాస్వామిక నేతలైపోయారా? చార్మినార్ నిర్మించిన కుతుబ్షాహీలు, కాకతీయులు మాత్రమే రాచరికపాలన చేశారా? అని సోషల్ మీడియాలో తప్పుబడుతున్నారు.
మత సామరస్యానికి సంకేతంగా ఉన్న చార్మినార్ను రాష్ట్ర చిహ్నంలోంచి చెరిపేయడం వెనుక కాంగ్రెస్ పాపాలను కడిగేసే కొత్త కోణం ఉన్నదేమోనని పాతబస్తీ పెద్దలు సెటైర్లు వేస్తున్నారు. చార్మినార్ అనేది నిన్నటి గాయాలకే కాదు శతాబ్దాల దక్కన్ వైభవానికి చిహ్నం. కళలు, కవనం ప్రవహించిన చరిత్రకు సాక్షి. అలాంటి సాంస్కృతిక వైభవాన్ని తీసేస్తానంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోవాలా? భారతీయుల నిర్మాణ కౌశలానికి నిలువెత్తు రూపం రామప్ప. నీటిలో తేలియాడే అక్కడి ఇటుకల రహస్యం ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఆ వైభవానికి తాము వారసులమని తెలంగాణ బిడ్డలు గర్వంగా చెప్పుకుంటుంటే.. రేవంత్రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తుండటం విస్మయం కలిగిస్తున్నది.
హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్గార్డెన్ నిజాంల కాలంనాటిదే. అందులోని జూబ్లీహాల్ ఉస్మాన్ అలీఖాన్ దర్బార్గా కొనసాగింది. ఆయన అధికారం చేపట్టిన పాతికేండ్ల వేడుకల సందర్భంగా జరిగిన జూబ్లీ సెలబ్రేషన్స్కి ఆ కట్టడం చారత్రక సాక్ష్యంగా ఉన్నది. ఆనాటి దర్బార్లో శాసనమండలి సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాడు నిజాం నవాబు విందులు ఏర్పాటు చేసినట్టే, నేడు మన ప్రభుత్వం కూడా జూబ్లీహాలులో అధికారిక విందులు ఏర్పాటుచేస్తున్నది. రాచరికపు ముద్రలు వేసి వీటిని పక్కనబెట్టగలమా? ముస్లిం పాలకుల పేర్లతో ఉన్న పట్టణాలు, వీధుల పేర్ల మార్పు అంశాన్ని బీజేపీ ముందుకు తెచ్చినప్పుడల్లా.. ‘తాము చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేకనే ఇలా ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు’ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటారు.
కాంగ్రెస్ నేతలు కూడా తాము ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి దృష్టి మళ్లించేందుకే రాచరికపు వివాదాన్ని తెర మీదకు తెస్తున్నారా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు కూడా భారతదేశంలాగే తమ చిహ్నాల్లో అనేక చారిత్రక కట్టడాలను చిహ్నంగా ఎంచుకున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడినా నాటి రాజులు నిర్మించిన కట్టడాల్లోని నిర్మాణ విశిష్టతలు, సాంస్కృతిక అస్తిత్వానికి చిహ్నాలుగా వాటిని గుర్తించారు. గౌరవించారు. భారతదేశ ప్రథమ ప్రధాని నెహ్రూ చేసింది కూడా అదే. రేవంత్రెడ్డి తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. మొత్తానికి రేవంత్రెడ్డి వ్యవహార శైలి ఆయనలోని చారిత్రక అజ్ఞానానికి అద్దం పడుతున్నది.