హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి నాలుక మడతేశారు. ఈ నెలాఖరులోపు మొత్తం రైతుబంధు పంపిణీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని గతంలో ప్రకటించిన సీఎం.. తాజాగా మాట మార్చేశారు. మరోసారి గడువు పెంచి మార్చి 15వ తేదీ వరకు మొత్తం రైతుబంధు పంపిణీ చేస్తామని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ‘ప్రతి సన్నాసోడు ఇంకా రైతుబంధు ఏస్తడలేడని అంటున్నరు. గత సంవత్సరం మార్చి 31 వరకు కూడా రైతుబంధు వేయలేదు.
ఫిబ్రవరి నెలాఖరు వరకు 63 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా ద్వారా మీ ఖాతాల్లో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది’ అని ఈ నెల 2వ తేదీన ఎల్బీ స్టేడియంలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ యూత్ లీడర్స్ కన్వెన్షన్లో సీఎం ప్రకటించారు. తాజాగా ఆ తేదీని ఆయనే మార్చేసి మార్చి 15 అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుబంధు ఎప్పుడు పడుతుందో.. పంపిణీ ఎప్పుడు పూర్తవుతుందో.. అసలు పూర్తవుతుందో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైతుబంధు పంపిణీపై మాయ మాటలు చెప్తూ కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఏ సీజన్లోనూ మరీ ఇంతలా ఎదురు చూడాల్సిన పరిస్థితి రాలేదని రైతులు చెప్తున్నారు.
3 ఎకరాల లోపే..
డిసెంబర్ 7వ తేదీన సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్రెడ్డి… డిసెంబర్ 9వ తేదీ నుంచే రైతుబంధు పంపిణీని ఆర్భాటంగా ప్రారంభించింది. దీంతో యాసంగి సీజన్కు దాదాపు నెల రోజుల ముందే రైతుబంధు పెట్టుబడి సాయం అందుతుందని రైతులంతా సంబురపడ్డారు. కానీ ఆ సంబురం క్రమంగా ఆవిరైపోయింది. పెట్టుబడి సాయం కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ 9న ప్రారంభించిన రైతుబంధు పంపిణీ సుమారు రెండున్నర నెలలు గడిచినప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. ఇప్పటివరకు 4 ఎకరాలలోపు రైతులకు మాత్రమే రైతుబంధు జమైనట్టు తెలిసింది. అత్యధికంగా 3 నుంచి 3.5 ఎకారల వరకు మాత్రమే పడినట్టు సమాచారం. మిగిలిన రైతులకు ఎప్పటికి పడుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వానకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు గాను సుమారు 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని గత ప్రభుత్వం పంపిణీ చేసింది. మొత్తం రైతుబంధు కింద 11 విడతల్లో సుమారు రూ.73 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.
అడిగిన వారిపై విమర్శల దాడి
రైతుబంధు పంపిణీలో జరుగుతున్న జాప్యంపై ప్రశ్నించేవారిపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతున్నదనే విమర్శలున్నాయి. మొన్నటికి మొన్న రైతుబంధు ఎప్పుడు పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని విలేకరులు ప్రశ్నించగా…‘రైతుబంధు పడలేదు అన్నవారిని చెప్పుతో కొట్టండి’ అని ఆయన అహంకారపూరితంగా మాట్లాడారు. తాజాగా సీఎం రేవంత్రెడ్డి సైతం ఇదే ధోరణిలో మాట్లాడటం గమనార్హం. రైతుబంధు అడిగినవారిని ‘సన్నాసోడు’ అని కించపరిచే వ్యాఖ్యలు చేశారు.