Assembly | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్కు దేశ సర్వోన్నత పౌరపురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మన్మోహన్ మృతికి సంతాపం తెలిపేందుకు సోమవారం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభ ఈ మేరకు తీర్మానం చేసింది. తొలుత సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తరువాత మన్మోహన్సింగ్కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ రెండు తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సంస్కరణలకు రూపశిల్పి మన్మోహన్సింగ్ అని కొనియాడారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూది దేశ దశ దిశను మార్చారని ప్రశంసించారు. దేశ ఆర్థిక వ్యవస్థ జవజీవాలూదిన మన్మోహన్కు భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమైందని అన్నారు. ‘60 ఏండ్ల కలను సాకారం చేసిన నాయకుడు, తెలంగాణ ఏర్పాటు బిల్లును రెండు సభల్లో పాస్ చేయించిన సారథి’ అని కొనియాడారు. తెలంగాణతో ఆయన బంధం విడదీయరానిదని, తెలంగాణకు పురుడుపోసిన డాక్టర్ అని పేర్కొన్నారు. మన్మోహన్ను తెలంగాణ ఆత్మబంధువుగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్ స్థానం శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) విధానాలతో ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మార్చారని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తొలుత అనంతపురం, మహబూబ్నగర్ జిల్లాల నుంచి ప్రారంభించారని గుర్తుచేశారు. రాష్ట్రం లో మన్మోహన్ విగ్రహాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సభ్యులు సూచనలు, సలహాలివ్వాలని కోరారు.
సరళీకృత ఆర్థిక విధానాలతో మన్మోహన్సింగ్ దేశాన్ని బలమైన శక్తిని నిలిపారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉపాధి హామీ పథకం దేశ స్థితినే మార్చేసిందని చెప్పారు. చేపట్టిన ప్రతి పదవికి ఆయన వన్నె తెచ్చారని గుర్తుచేశారు. సామాన్యుడు సమాచారాన్ని తెలుసుకునేలా ఆర్టీఐ యాక్ట్-2005ను తీసుకొచ్చారని, మానవతా ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందని, దేశ ఆర్థిక పరిస్థితులే కాకుండా సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని అనేక చట్టాలు తెచ్చారని గుర్తుచేశారు.
సంతాప తీర్మానంపై మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్రాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్థికశాఖ మంత్రిగా, ప్రధానిగా దేశానికి మన్మోహన్సింగ్ చేసిన సేవలను శ్లాఘించారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం తరపున ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, బీజేపీ తరపున ఎమ్మెల్యే కే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సేవలతోపాటు, వ్యక్తిగతంగా తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం మన్మోహన్సింగ్కు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ రెండో కుమార్తె తనను ‘మీరెవరు?’ అని ప్రశ్నించి, తన గురించి తెలుసుకున్నారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. మన్మోహన్ మృతికి సంతాపం తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో సోమవారం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని అంత్యక్రియల్లో పాల్గొన్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. మన్మోహన్ కుటుంబం నిరాడంబరతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. అంతకు ముందురోజు మన్మోహన్సింగ్ భౌతికకాయాన్ని సందర్శించిన సమయంలో ఆయన సతీమణి దగ్గరికి వెళ్లి తాను రేవంత్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రినని పరిచయం చేసుకుని మాట్లాడినట్టు చెప్పారు. మన్మోహన్సింగ్కు తెలంగాణ అంటే ప్రత్యేకమైన అభిమానమని, రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని మన్మోహన్ సతీమణి తనకు ఉద్బోధించినట్టు సీఎం వివరించారు. అయితే సీఎం మాట్లాడిన ఈ అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు సీఎం వ్యాఖ్యలను ట్రోల్ చేయడం కనిపించింది.