Minister Uttam Kumar Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఏపీలో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరుగలేదట.. సాగునీళ్ల విషయంలో అప్పుడు బాగుండేదట. ఇవీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వింత వాదనలు. ఆదివారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కృష్ణా జలాలకు సంబంధించి ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయమే జరుగలేదని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్పార్టీ నేతలు తెలంగాణ నేపథ్యం, ఉద్యమం, నాటి వివక్ష అన్నీ మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరుగకపోతే 60 ఏండ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమం ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జలాల్లో అప్పుడే తెలంగాణకు సముచిత స్థానం దక్కితే తెలంగాణ ప్రాంతం కరువుతో ఎందుకు అల్లాడిందని, వ్యవసాయం దుర్భిక్షం ఎందుకయ్యిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా సాగునీళ్లు ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు. దీనిపైనా రైతులు మండిపడుతున్నారు. సాగునీటికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఆ ఫలితాలను అనుభవిస్తున్న తమకు తెలుసని అంటున్నారు.
నాడు పడావుపడ్డ భూముల్లో ఇప్పుడు పంటలు పండించుకొని బతుకుతున్నామని చెప్తున్నారు. రైతులు, వ్యవసాయంతో రాజకీయం చేయ్యొద్దని మంత్రి ఉత్తమ్కు తెలంగాణవాదులు హితవు పలికారు. చేతనైతే రైతులకు మంచి చేసేందుకు ప్రయత్నించాలని, అంతేగానీ ఉన్న మంచిని చెడగొట్టి రైతులను ఇబ్బందులకు గురిచెయ్యొద్దని సూచించారు.