హైదరాబాద్ : స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్(Babu Jagjivan Ram) జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని బాబూజీ సేవలను సీఎం స్మరించుకున్నారు. అత్యంత పేదరికంలో జన్మించినజగ్జీవన్ రామ్ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని పేర్కొన్నారు.
జాతీయోద్యమంలో పాల్గొన్న ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యునిగానూ సేవలందించారని, స్వాతంత్య్రానం తరం తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో తొలి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కార్మిక సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందిన బాబూజీ రెండు దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగానూ సేవలు అందించారని తెలిపారు.
దేశవ్యాప్తంగా కరవు తాండవిస్తున్నప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం విజయవంతంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు బాబూజీ పోరాడారని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని సీఎం పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు.