హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ(Traffic control)ను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలి. ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లోగా ఈ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్పై బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బుధవారం సీఎం సమీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులను వెంటనే ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించాలి. వెంటనే ట్రాఫిక్ నియంత్రణ విధులకు వారి సేవలను వాడుకోవాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలన్నారు. ఇప్పుడున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలి.
సరిపడే సంఖ్యలో సిబ్బంది ఉండేలా స్టేషన్లను పునర్వవ్యస్థీకరించాలని ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లలో ఎల్బీ నగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలు పరిశీలించాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకుండా ట్రాఫిక్ సిబ్బంది అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమీషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలి. కన్సలెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలని అధికారులను ఆదేశించారు.