CM Revnath Reddy | సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఐదు జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి.. నియోజకవర్గాల్లో నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలన్నారు. అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదన్నారు.
అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావులేదని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దన్నారు. ప్రతీ నియోజకవర్గానికి రూ.10కోట్ల స్పెషల్ డెవలెప్మెంట్ నిధులు కేటాయిస్తున్నామన్నారు.
ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రులకు ఈ నిధుల బాధ్యత అప్పగిస్తున్నామన్నారు. ఇన్చార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. సమస్యలను పరిష్కరించుకోవాలని.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలన్నారు.