Telangana | వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వచ్చిన సీఎం.. వర్షాకాలం సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఓఆర్ఆర్ను యూనిట్గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఇంటిగ్రేట్ చేయాలని అధికారులకు సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న సీసీ కెమెరాలు అన్నింటినీ వీలైనంత తొందరగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.
అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ఈ సందర్భంగా అధికారులను సీఎం, మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 141 వరద తీవ్రత ఉండే ప్రాంతాలను గుర్తించినట్లుగా అధికారులు తెలిపారు. వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. వరద నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వెళ్లేలా వాటర్ హార్వెస్ట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోమ్ గార్డుల రిక్రూట్మెంట్ చేపట్టాలని ఆదేశించారు.