హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల ప్రాతిపదికన జిల్లాకు ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిలాల్లో ఈ సిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం గల ఉద్యోగులను సృష్టించేందుకు ఈ వర్సిటీలు తోడ్పడుతాయని తెలిపారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘకాల కోర్సులను ప్రవేశ పెట్టాలని అధికారులకు సూచించారు. గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం విద్య, పరిశ్రమలు, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి తగు ప్రతిపాదనలను సమర్పించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు.
శనివారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి విద్యాశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో పాఠశాలలు ఉండాలని స్పష్టంచేశారు. చిన్న గ్రామమైనా.. మారుమూల తండా అయినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని, ఏ ఒక్క విద్యార్థి చదువుకోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దని అధికారులకు సూచించారు. విద్యార్థులు లేరన్న నెపంతో మూసివేసిన బడులను తెరిపించాలని, ఎంత మంది పిల్లలున్నా.. సంఖ్యతో నిమిత్తంలేకుండా పాఠశాలలను నడపాల్సిందేనని తేల్చి చెప్పారు. పాఠశాలలు నడిపేందుకు వీలుగా వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ పోస్టులను భర్తీచేయడం, మూసివేసిన స్కూళ్లను తెరవడంతో ఉత్పన్నమయ్యే ఖాళీలను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని తెలిపారు.
మన ఊరు – మన బడి పనుల పురోగతిపైనా సీఎం రేవంత్రెడ్డి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులను పూర్తిచేసి, ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల్లోని అవాంతరాలపై దృష్టిసారించాలని, అవాంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. స్కూళ్లకు విద్యుత్తు బిల్లుల క్యాటగిరీ మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు.
వ్యాపార, పారిశ్రామిక క్యాటగిరీ కింద బిల్లులు వసూలు చేయకుండా తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి గల మార్గాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్బోర్డు కార్యదర్శి శృతి ఓజా, సీఎంవో అధికారులు శేషాద్రి, షానవాజ్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.