CM Revanth Reddy | పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి ఇబ్బందులు కలుగాకుండా సమర్థవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన లీకేజీలు, ఇతర ఇబ్బందులను ప్రస్తావించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పని చేస్తున్న విశ్వవిద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో.. వాటి వివరాలు వెంటనే సమర్పించాలని చెప్పారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి.. వాటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సీఎంవో కార్యదర్శి శేషాద్రి, విద్యాశాఖ కమిషనర్ దేవసేన పాల్గొన్నారు.