Revanth Reddy | రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దయ్యింది. ఈ నెల 7న వేములవాడ రాజన్న దర్శనంతోపాటు సిరిసిల్లలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇటీవల నేతన్నలపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపడంతో సీఎం పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిసింది.
సిరిసిల్లలో ఇప్పటికే నేతన్నలు కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేయడంతో పాటు, రేవంత్రెడ్డి పర్యటనను కూడా అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. మహాశివరాత్రి జాతర ఉన్నందున రాజన్న సన్నిధిలో భక్తులకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతోనే పర్యటన రద్దు చేసుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మొదటిసారిగా సీఎం హోదాలో మహాశివరాత్రి సందర్భంగా రాజన్నకు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పిస్తారని ఆర్భాటం చేసిన నాయకులు, కార్యకర్తలు.. ఇప్పడేమో భక్తుల ఇబ్బందిని సాకుగా చూపుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.