హైదరాబాద్ : అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్లైన్ ద్వారా మేడారం(Medaram) సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. అనంతరం తన మనవడు రియాన్ష్ నిలువెత్తు బంగారం ఆన్లైన్(Online) ద్వారా సమర్పించారు. అలాగే తన మనవరాలి నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. కాగా, మేడారం జాతర ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలను దేవదాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది.
మేడారానికి వెళ్లలేని భక్తులు సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించుకునే సదుపాయాన్ని రాష్ట్రప్రభుత్వం కల్పించింది. మీసేవ, పోస్టాఫీసులతో పాటు ‘టీ-యాప్ ఫోలియో’ యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు.