Harish Rao | మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు అన్నారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్ లాగా మాట్లాడుతున్నట్లు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లుగా ఏ కోశానా కూడా లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి రాహుల్ నాయకత్వంలో పనిచేయడం లేదని.. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా.. బీజేపీ, మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మరోసారి తేటతెల్లమయ్యిందని స్పష్టం చేశారు.
మద్యం పాలసీ కేసు విషయంలో ఇన్నాళ్లుగా తాము చెబుతున్నదే.. ఇవాళ మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కూడా చెప్పారని హరీశ్రావు అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుందని.. లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయ వేధింపుల కోసం వాడుకుంటున్నదని తాము ఆరోపించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు తమ వాదనను ఏఐసీసీ కూడా బలపరిచిందని తెలిపారు. లిక్కర్ స్కామ్ అనేది ఒక కుట్ర అని.. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెడుతుందని ఏఐసీసీ నేతలు విమర్శించారని చెప్పారు. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆరోపించారని తెలిపారు.
కానీ.. రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏఐసీసీ నాయకులు మాట్లాడిన దానికి విరుద్ధంగా పూర్తి మాట్లాడుతున్నారని విమర్శించారు.
లిక్కర్ స్కామ్ జరిగిందని.. అందులో నిందితులను అరెస్టు చేయడం ఆలస్యమైందంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని హరీశ్రావు అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదని, ఆరెస్సెస్ భావజాలం నిండి ఉన్న మోదీ మనిషి అని తాము ముందు నుంచీ చెప్తున్నామని, అది ఇప్పుడు అదే నిజమని తేలిందని అన్నారు. తాను కాంగ్రెస్లో ఉన్న విషయం కూడా మరిచిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. కేవలం బీఆర్ఎస్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.