హైదరాబాద్: రాష్ట్ర అధికార చిహ్నం మార్పు నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని సెక్రటేరియట్లో జరుగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్ సహా వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అధికార చిహ్నం, రాష్ట్ర గీతంలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయన్ని ఆమా పార్టీల నేతలకు వివరించనున్నారు. అయితే ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, విపక్ష బీజేపీలను ప్రభుత్వం ఆహ్వానించకపోవడం గమనార్హం.
రాష్ట్ర గేయం, చిహ్నం విడుదల తర్వాత అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలతో సీఎం రేవంత్ లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు. కాగా, రాష్ట్ర అధికారిక చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్లను ప్రభుత్వం తొలగించనున్నట్లు తెలుస్తున్నది. రాచరిక గుర్తులను తొలగిస్తామని, కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నామని సీఎం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నం ఉంటుందని వెల్లడించారు.