CM Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని, నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజా పాలన ద్వారా ప్రజలు ప్రభుత్వం వద్దకు రాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నామని చెప్పారు. గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు ఐదు గ్యారెంటీలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెం కట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖతో కలిసి ప్రజా పాలన దరఖాస్తు ఫారాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొనేందుకే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. పథకాలకు నిజమైన అర్హులు ఎవరు? ఎంత మంది ఉంటారు? అనే లెక్క ప్రభుత్వం వద్ద ఉండాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. అప్పుడే తాము ఒక ప్రణాళిక ప్రకారం పని చేస్తామని అన్నారు.
గడువు తర్వాత కూడా దరఖాస్తుకు అవకాశం
జనవరి 6 వరకు ఆయా గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో దరఖాస్తులు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఒకవేళ 6వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోలేకపోతే వాళ్లు ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో ఎప్పుడైనా దరఖాస్తు ఇవ్వొచ్చని సూచించారు. కొత్త రేషన్కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. కొత్త రేషన్కార్డుతో పాటు ఇతర సమస్యల దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా కౌం టర్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే రేషన్కార్డు ఉన్నవారు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని, లేనివాళ్లు మరో కౌంటర్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్యారెంటీలతోపాటు అన్ని సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజా పాలనలో స్వీకరిస్తామని వివరించారు.
ఒకరి దరఖాస్తు మరొకరు ఇవ్వొచ్చు
గ్యారెంటీలకు లబ్ధిదారులే స్వయంగా వచ్చి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి తరఫున ఎవరైనా ఇవ్వొచ్చని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారుకు సంబంధించిన రేషన్కార్డు, ఆధార్కార్డును దరఖాస్తుకు జత చేయాలని సూచించారు. సీఎం ప్రకటనతో ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న వారికి ఉపశమనం లభించనున్నది.
వచ్చే డిసెంబర్ 9లోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ
టీఎస్పీఎస్సీ వివాదంపై సీఎం రేవంత్రెడ్డి స్పం దించారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు రాజీనామాలను గవర్నర్కు అందించారని, పలు కా రణాలతో వాటిని గవర్నర్ ఇంకా ఆమోదించలేదని తెలిపారు. సాంకేతికంగా చైర్మన్ లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వరాదని అన్నారు. నాలుగైదు రోజుల్లోనే రాజీనామాలపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాత వేగంగా చైర్మన్, సభ్యులను నియమిస్తామని చెప్పారు. ఆ తర్వాత అత్యంత పారదర్శకంగా కొత్త నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ 9వ తేదీలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని చెప్పారు. గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్షించిన తర్వాత నిర్ణయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
100 రోజుల్లో అమలు చేస్తాం
దరఖాస్తులు తీసుకుంటున్న ఐదు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చూస్తే ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయని, కేసీఆర్ అం డ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకొని వెళ్లిందని విమర్శించారు. తాము లంకె బిందెలు ఉన్నాయని వస్తే.. ఖాళీ గిన్నెలు కనిపిస్తున్నాయని, ఇప్పుడు అంతా సెట్రైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. మూడోసారి గెలిస్తే తిరిగేందుకు మాజీ సీఎం కేసీఆర్ కొత్తగా 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కొని విజయవాడలో పెట్టినట్టు సీఎం చెప్పారు. మేడిగడ్డకు సం బంధించి న్యాయ విచారణ జరుగుతున్నదని, ఇందు లో ఎల్ అండ్ టీ, ప్రభుత్వ అధికారుల పాత్ర ఏమిటనేది తేలుతుందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించామని, అందుకే వారికి ఆర్థికసా యం అందిస్తామని మ్యానిఫెస్టోలోనే పెట్టినట్టు గుర్తుచేశారు. రైతుబంధు సీలింగ్పై ఇప్పటివరకు ఎలాం టి పరిమితి విధించలేదని, అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు.