Jagadish Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో భయం మొదలైందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని.. సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని.. ఆయనను చూసి సిగ్గు సిగ్గుపడేలా ఉందని విమర్శించారు. నిఘా పెట్టేందుకు కేసీఆర్ కమాండ్ కంట్రోల్ కడితే.. రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్లో కూర్చొని తమపై నిఘా పెడుతున్నాడని ఆయన ప్రశ్నించారు. ప్రగతిభవన్లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సెక్రటేరియట్పై కమీషన్ వేయవచ్చు కదా..? బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు చూపిస్తావా?ప్రగతి భవన్ల ఎన్ని రూములున్నాయో చూపిస్తావా? అంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయబోతున్నారని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్సార్ను, సోనియా గాంధీని తిట్టింది రేవంత్రెడ్డియేననన్నారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడుతావంటూ నిలదీశారు. ఏం చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదని, రేవంత్ రెడ్డి చేసే తప్పులకు చరిత్ర క్షమించదన్నారు. రేవంత్ రెడ్డి నోటి దూలతో బీహార్ నుంచి వెల్లగొట్టే పరిస్థితి వచ్చిందని.. బిహార్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డిని వద్దని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పిలిపించుకున్నారన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదవుల్లో ఉన్నారు కాబట్టి.. ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ మోదీ శిష్యులేనని.. తెలంగాణ అభివృద్ధి,హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలని సూచించారు.
మాగంటి గోపీనాథ్ తల్లితో ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. రేవంత్ రెడ్డి ఓటమి భయంతో చేసే పనుల్లో ఇది ఒకటని.. రేవంత్ రెడ్డి డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్నట్లుగా ఉందన్నారు.
రేవంత్ రెడ్డి సీఎంగా వచ్చాక డ్రగ్స్ సంబంధ నేరాలు ఎక్కువయ్యాయని.. పోలీస్ కమిషనర్లే నేరాల రేటు పెరిగిందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపారన్నారు. హరీశ్రావుపై రేవంత్ చల్లర వ్యాఖ్యలు చేశారంటూ విమర్శించారు. .పార్టీలో హోంగార్డ్, ఐపీఎస్, ఎవరు పెద్ద.. ఎవరు చిన్నా అని రేవంత్ హరీశ్ ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. సీఎం బాధతో తెలంగాణ పరువుపోతుందని.. ఇప్పటికైనా ఆయన తన భాష మార్చుకుంటే మంచిదంటూ హితవు పలికారు. సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, దయాకర్రెడ్డి పాల్గొన్నారు.