హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కుంగిన మేడిగడ్డ బరాజ్కు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు.
ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, మున్ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత, ఇతర అంశాలపై పలు సూచనలు చేశారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిషరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా పూర్తి వివరాలను అందించాలని సూచించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఆ శాఖ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
తొలుత మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు, యాసంగి నీటిసరఫరా అంశంపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమీక్ష నిర్వహించారు. బరాజ్ కుంగిన అంశంపై ఆరా తీయడంతోపాటు, త్వరలోనే విచారణకు ఆదేశిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారని, ఆ మేరకు కమిటీ వేస్తామని మంత్రి తెలిపారు. యాసంగి సాగునీటి విడుదల అంశంపై చర్చించారు.