హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థుల నెలన్నర రోజుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు వారి వారి శిక్షణకు సీఎం రేవంత్రెడ్డి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘400 మందితో సర్కారు చెలగాటం’ పేరుతో నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితం కాగా, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్కు ముఖ్యమంత్రి స్పందించారు.
గురువారం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెప్పించుకొని అభ్యర్థుల శిక్షణకు అంగీకారం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఫిబ్రవరి 14న ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్ పొంది న అభ్యర్థులకు ఏప్రిల్ 1న ఎక్సైజ్ శిక్షణ విభాగానికి రిపోర్టు చేయాలని సమాచారం ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి రిపోర్టు చేసే వారందరికీ 4న అధికారికంగా శిక్షణను ప్రారంభించనున్నట్టు ఎక్సైజ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే రిపోర్టు చేసే గడువు ఏప్రిల్ 13 వరకు ఉన్నది.
బీఆర్ఎస్ జోక్యంతో కదలిక
కేసీఆర్ హయాంలో చేపట్టిన పోలీస్ కానిస్టేబుల్, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖ ఉద్యోగాలకు తుది కాంగ్రెస్ ప్రభుత్వం ఫలితాలు విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఎంతో ఆర్భాటంగా అర్హత సాధించిన వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది. అన్ని విభాగాల శిక్షణను షురూ చేసింది. నెలన్నర గడుస్తున్నా ఎక్సైజ్ కానిస్టేబుళ్ల శిక్షణ, పోస్టింగుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల శిక్షణ అంశాన్ని ప్రస్తావించారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా?’ అంటూ బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అనంతరం పూర్తి వివరాలతో ‘నమస్తే తెలంగాణ’ విశ్లేషనాత్మక కథనాన్ని ప్రచురించడంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది.
మొదటి బ్యాచ్లో 120 మంది
మొత్తం 614 పోస్టులకు గాను 406 మంది పురుషులు, 203 మంది మహిళలు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించారు. శిక్షణకు మాత్రం 420 మందికిపైగా సు ముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. తొలుత 120 మందితో తొలి బ్యాచ్ను సిద్ధం చేసి 45 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. మిగతా వారిని ఫీల్డ్ ట్రైనింగ్కు పంపనున్నారు.