Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న రేవంత్రెడ్డి సర్కారు.. మరో 500 కోట్ల రుణం తీసుకోవడానికి చర్యలు చేపట్టింది. ఈ నెల 17న మరో రూ.500 కోట్ల అప్పు సమీకరించుకొనేందుకు కసరత్తు మొ దలుపెట్టింది. 500 కోట్ల విలువైన బాండ్ను 12 ఏండ్లకాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కు జారీచేసింది. ఈ బాండ్ను ఈ నెల 17న ఆర్బీఐ వేలం వేయనున్నది. అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు రూ.46,118 వేల కోట్ల అప్పు చేసింది. వచ్చే రూ.500 కోట్లతో కలిపి రాష్ట్ర రుణం 46,618 కోట్లకు చేరనుంది. ఈ నెలలో ఇప్పటికే 3వ తేదీన రూ.2,500 కోట్లు, 10న 1,500 కోట్లు.. ఇలా వారం రోజుల్లోనే రూ.4,000 కోట్లు రుణం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ నెల 17న మరోసారి రూ.500 కోట్లు అప్పు తీసుకోనున్నది. ప్రతి నెలా రూ.5 వేల నుంచి 6 వేల కోట్ల విలువైన బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటున్నది. అలవికాని హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటి అమలుకు ఆపసోపాలు పడుతున్నది.