CM Revanth Reddy | వనస్థలిపురం, ఏప్రిల్ 28: తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతూ నిండా ముంచిన వ్యక్తి ప్రధాని మోదీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. బీజేపీకి ఓటు వేస్తే కల్లోలం సృష్టిస్తారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునితా మహేందర్రెడ్డితో కలిసి నిర్వహించిన రోడ్ షో ఆయన మాట్లాడారు.
తెలంగాణకు రావాల్సిన ఐటీఆర్ఐ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను రాకుండా చేసింది మోదీనే అని విమర్శించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఉద్యమాన్ని పార్లమెంట్ సాక్షిగా అవమానించిన నరేంద్రమోదీ తెలంగాణలో ఓట్లెలా అడుగుతారని నిలదీశారు. దేవుడి పేరుతో రాజకీ యం చేస్తూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద దేవుడి ఫొటో చూపించి అడుక్కున్నట్టు, బీజేపీ రాముడి ఫొటోపెట్టి ఓట్లు అడుక్కుంటున్నదని ఎద్దేవా చేశారు. పదేండ్లుగా దేశానికి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని హితవు పలికారు. బీజేపీ పుట్టకముందు నుంచే అందరం రాముడిని, హనుమంతుడిని పూజిస్తున్నామని చెప్పారు. మతం పేరు తో రాజకీయం చేసి, ద్వేషం పెంచేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సునీతా మహేందర్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రోను ఎల్బీనగర్ నుంచి హయత్నగర్, ఇటు ఎయిర్పోర్టు వరకు విస్తరిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్లో ముంపు ప్రాంతాలను గుర్తిం చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కిగౌడ్, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.