CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులంతా గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా వెళ్తారు. లోక్సభ ఎన్నికలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, గవర్నర్ కోటాలో ప్రతిపాదించే ఎమ్మెల్సీ అభ్యర్థులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై అధిష్ఠానంతో చర్చించేందుకే వీరు ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం.
లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ తదితరులు రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. ఈ నెల 15న సీఎం అమెరికా (దావోస్) పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక లోక్సభ నియోజకవర్గాలకు సమన్వకర్తలతో సమీక్షలు నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.
సీఎం ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ అభ్యర్థిత్వం కోసం కాంగ్రెస్ నేతలతోపాటు తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ వంటివారి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అద్దంకి దయాకర్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయాలని సీఎం కోరనున్నట్టు సమాచారం. రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మైనార్టీ నాయకులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో మైనార్టీలకు అవకాశం కల్పించే పక్షంలో ఫిరోజ్ఖాన్, షబ్బీర్ అలీ పేర్లు పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.