హైదరాబాద్, ఫిబ్రవరి (నమస్తే తెలంగాణ): వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఒక్క సీటు కూడా గెలువనివ్వబోమని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సవాల్ చేశారు. ‘ఇదే నా సవాల్.. దమ్ముంటే ఒక్క సీటైనా గెలిపించి చూపించాలి’ అన్నారు. ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలకు శ్రీకారం చుట్టిన సందర్భంగా మంగళవారం సాయంత్రం చేవెళ్లలో జరిగిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వాన్ని కూల్చితే కూలిపోవడానికి తామేమీ అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని అన్నారు. లాఠీ దెబ్బలు తిని, అక్రమ కేసులను ఎదుర్కొని, చర్లపల్లి, చంచల్గూడ జైళ్లలో ఉండి అధికారంలోకి వచ్చామనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. నల్లమల నుంచి వచ్చిన తాను అడ్డువచ్చిన వారిని ఎందరినో తొక్కుకుంటూ వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నానని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా 14 సీట్లు గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. తాము ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెటీల హామీని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు.
బీజేపీ నేతలు గుజరాత్ మాడల్ తీసుకొస్తామంటూ ప్రచారం చేస్తున్నారని.. అంటే పార్టీలను చీల్చడమా? లేక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేయడమా? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రధాని చెప్పారని, పదేండ్లలో ఇవ్వాల్సిన 20 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని నిలదీశారు.
ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ నాయకుడు ఒకరు ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి బెంజికారు కొనిచ్చినట్టు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ప్రభాకర్కు ఆమె లీగల్ నోటీసు పంపించారు. తనపై చేసిన ఆరోపణలకు రెండు రోజుల్లో ఆధారాలు చూపించాలని, లేనిపక్షంలో రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.