హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ‘ఇసుక ధర డబుల్’ పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. గురువారం సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వనరులశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇసుక దందాకు కళ్లెం వేయాలని నిర్ణయించారు. ఇసుక అమ్మకాలకు కొత్త విధానం రూపొందించాలని యోచిస్తున్నారు. ఇందుకోసం ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఇసుక క్వారీయింగ్, ఇసుక అక్రమ రవాణాను వెంటనే అరికట్టాలని ఆదేశించారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్లైన్ విధించారు.
రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒకరినీ వదిలిపెట్టవద్దని చెప్పారు. ఈ నెల 3రవాణా నిజామాబాద్, వరంగల్ రూట్లో 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే, 22 లారీలకు అనుమతి లేదని గుర్తించారని, ఒకే పర్మిట్, ఒకటే నంబర్తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్టు బయటపడిందని తెలిపారు. ఈ లెకన 25 శాతం అక్రమంగా ఇసుక తరలిపోతుందని చెప్పారు. టీఎస్ఎండీసీ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టి, గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ చుట్టుపకల అనుమతి లేకుండా నిర్వహించే స్టోన్ క్రషర్స్ను సీజ్ చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. భారీ కాంప్లెక్స్లు నిర్మించేటప్పుడు రోడ్లపై కంకర, బిల్డింగ్ మెటీరియల్ వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఆరు మీటర్ల కంటే లోతుగా భూగర్భంలో సెల్లార్లకు తవ్వకాలు చేపడితే నిబంధనల ప్రకారం పన్ను వసూలు చేయాలని ఖనిజ వనరులశాఖను ఆదేశించారు.