హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి 16వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చే నిధుల కేటాయింపు పెంచాలని నీతి అయోగ్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. మంగళవారం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్కుమార్ బేరి బృందం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సహకార సమైక్యవాదం గురించి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రాభివృద్ధి, కీలక రంగాలకు సంబంధించి ప్రాధాన్యతలు, రాష్ట్ర అవసరాలను నీతి ఆయోగ్ అధికారులకు రేవంత్రెడ్డి వివరించారు. కేంద్రం నుంచి అందాల్సిన న్యాయమైన కేటాయింపులు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్రానికిచ్చే నిధులు, వనరుల మంజూరుపై చర్చించారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా నిధుల కేటాయింపు పెంచాలని, ఆరోగ్యం, విద్యలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్కు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.1800 కోట్లు విడుదల చేయాలని కోరారు.
సబర్మతి రివర్ ఫ్రంట్, నమామి గంగే తరహాలోనే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో పీపీపీ మాడల్లో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సాంకేతిక సహకారం అందించాలని విన్నవించారు. హైదరాబాద్ను కాలుష్యరహిత నగరంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకారాన్ని కోరారు. వీటిపై నీతి ఆయోగ్ అధికారులు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎదురొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కలిసి పనిచేయడానికి అంగీకరించారు. రాష్ట్ర అభివృద్ధికి తమవంతుగా సహకారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. నీతి ఆయోగ్ పాలక మండలిలో రాష్ట్ర భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్ర సామర్థ్యాలను పటిష్టం చేయడానికి ‘స్టేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ ట్రాన్స్ఫర్మేషన్’ (ఎస్ఐటీ)ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు విజయకుమార్, డైరెక్టర్ జనరల్ సంజయ్కుమార్, డైరెక్టర్ అభినేశ్ డాష్, ముత్తుకుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.