Revanth Reddy |హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఏ కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ఎవరు అడ్డుపడ్డా, ఎవరు అభ్యంతరపెట్టినా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంత్రివర్గ సహచరులందరి తరుపున తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ ఇచ్చిన మాటను గతంలోనూ నిలుపుకొన్నారని, ఇప్పుడు కూడా నెరవేర్చతారని అన్నారు.
ప్రతిపక్షంతోపాటు అందరి సలహాలు తీసుకొని ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పారు. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సీఎం రేవంత్రెడ్డి సమాధానమిచ్చారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతం.. కడుగుతం అన్న శ్రీశ్రీ మాటను గుర్తు చేశారు. మా కుటుంబ, మా పార్టీ, మా ఇష్టం అనే నిరంకుశత్వం ఎన్నటికీ చెల్లదని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం తమదని అన్నారు. నాడు అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగా నియంతృత్వం చేయబోమని, మాట్లాడేందుకు ప్రతిపక్షానికి కూడా అవకాశం కల్పిస్తామని తెలిపారు.
అమరుల కుటుంబాలను పట్టించుకోలేదు
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన యాదిరెడ్డి, శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఇషాన్రెడ్డి, యాదయ్య.. ఇలా ఏ ఒక్కరి కుటుంబాన్ని అయినా నాటి సీఎం కేసీఆర్ ప్రగతిభవన్కు ఆహ్వానించి వారికి పెద్ద దిక్కుగా ఉంటానని భరోసా ఇచ్చారా? అని ప్రశ్నించారు. గత పాలకులు అమరుల కుటుంబాలను పట్టించుకోలేదని విమర్శించారు. అమరుల కుటుంబాలకు చట్టసభల్లో అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమం కోసం డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన నళినికి రాష్ట్రం వచ్చాక ఎందుకు ఉద్యోగం తిరిగి ఇవ్వలేదని నిలదీశారు. ఇక తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేశారా? అని ప్రశ్నించారు. ధర్నాచౌక్ను ఎత్తేసి నిర్భంద పాలనకు తెరతీశారని విమర్శించారు. తాము మాత్రం మళ్లీ ధర్నాచౌక్ను ప్రారంభించి ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ కల్పించామని అన్నారు.
రైతుల గురించి అన్నీ అబద్ధాలే
రాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగిందని, ఆత్మహత్యలు తగ్గాయని, వలసలు తగ్గాయని, పంటలకు గిట్టుబాటు ధర ఇస్తున్నామని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం పదేపదే చెప్పినవన్నీ అబద్ధాలేనని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ‘రైతు ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం 25వ స్థానంలో ఉన్నది. ఇక్కడ రైతు ఆదాయం రూ.9,403గా ఉన్నది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడూ మొదటి లేదా రెండో స్థానంలోనే ఉన్నది.
సుమారు 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఎన్సీఆర్బీ చెప్తున్నది. రైతుబీమా పథకం ప్రకారం రూ.1,21,965 మంది మరణించినట్టు తెలిపారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కావా? పంటలకు బీమా ఉండాలే తప్ప.. రైతు చనిపోయిన తర్వాత ఏం ఇచ్చినా ఏం లాభం? తెలంగాణలో పసుపు, చెరుకు, కంది, మొక్కజొన్న, మిరప, సోయాబీన్ వంటి వాణిజ్య పంటలన్నీ తగ్గిపోయాయి.
కేవలం వరి పండించే పరిస్థితి వచ్చింది. రూ.1,400లకే ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు తాలు పేరుతో కోత పెడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? కేంద్ర నివేదిక ప్రకారం విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణ 10వ స్థానంలో ఉన్నది. కానీ గత ప్రభుత్వం మాత్రం ఒకటో స్థానంలో ఉన్నదని అబద్ధం చెప్పింది. కాలువల ద్వారా సాగునీళ్లు అందిస్తే పంపుసెట్లు ఎందుకు పెరుగుతాయి? కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నది శుద్ధ అబద్ధం’ అని సీఎం విమర్శించారు.
నాటి సీఎంలెవరూ న్యాయం చేయలేదు
ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు ముఖ్యమంత్రులుగా ఉన్నవారెవరూ తెలంగాణకు న్యాయం చేయలేదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇక ఈ ప్రాంతానికి న్యాయం జరగదని గుర్తించి తెలంగాణ ప్రజలు కోదండరాం నాయకత్వంలో జేఏసీగా ఏర్పడి అన్ని పార్టీలు ఏకమై ఉద్యమాలు చేయడం ద్వారా సోనియాగాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. సోనియాగాంధీ దయవల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నాటి సీఎం కేసీఆర్ శాసనసభలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పదేపదే గతాన్ని తొవ్వడం మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. 2014 జూన్ 2 నుంచి తొమ్మిదన్నరేండ్లు మీరు (బీఆర్ఎస్) పరిపాలించారని, రాబోయే పదేండ్లు తాము పరిపాలన అందించబోతున్నామని తెలిపారు.
కొత్త సభ్యులు మనల్ని చూసి నేర్చుకోవాలి
సభలోకి వచ్చే సభ్యులు ప్రిపేర్ అయ్యి రావాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈ సభలో 50 మంది కొత్తగా వచ్చినవారున్నారని, వాల్లంందరు మనల్ని చూసి నేర్చుకోవాలని అన్నారు. ‘మనం పాలకులం కాదు.. సేవకులం. అధికారం చెలాయించడానికి, నిరంకుశత్వం చేయడానికి ఇక్కడికి రాలేదు. 4 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడికి వచ్చాం. మీకు న్యాయం జరగకుంటే నిరసనలు, ధర్నాలు చేయొచ్చు. ధర్నాచౌక్ను కూడా ఓపెన్ చేశాం. సహేతుకమైన సలహాలు, సూచనలు స్వీకరించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’ అని తెలిపారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగడం లేదని, జీవో ఇవ్వలేదని అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుపై నేను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ ఈ నెల 8వ తేదీనే జీవో నం.191 ద్వారా ఉత్తర్వులు కూడా జారీ చేశాం. రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగమైన ఏ దవాఖాన అయినా బాధితులను చేర్చుకోకపోయినా, రూ.10 లక్షల వరకు చికిత్స ఇవ్వకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఆ దవాఖానలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ
సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, మెట్రోరైలును వివిధ ప్రాంతాలను కలుపుతూ కందుకూరు వరకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
శనివారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు సమాధానంగా సీఎం మాట్లాడుతూ, సహేతుకమైన సూచనలు చేస్తే స్వీకరించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం స్పష్టంచేశారు. రూ.లక్షన్నర కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్ కుంగిందని, అన్నారం పగిలిపోయిందని విమర్శించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని తెలిపారు.
సమావేశాలు ముగిసిన తరువాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మేడిగడ్డ సందర్శనకు తీసుకెళ్తానని తెలిపారు. మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన 317జీవో, సీపీఎస్ రివైజ్ చేయడం వంటి అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో త్వరలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తామన్నారు.
వారంలో మూడురోజులు అందుబాటులో మంత్రులు
తాము అధికారం చేపట్టి పదిరోజులు కూడా కాలేదని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని సీఎం చెప్పారు. తాము ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, మంత్రులు కూడా వారంలో మూడు రోజులు సచివాలయంలో అందుబాటులో ఉంటారని, ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలపై సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు వారిని కలవొచ్చని సూచించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలి సమావేశాలు పాత భవనంలో నిర్వహిస్తామని చెప్పారు.
జయ జయహే గేయాన్ని రాష్ట్రీయ గేయంగా చేయలేదేం?
అందెశ్రీ రచించిన జయహే.. జయ జయహే గేయాన్ని రాష్ట్రీయ గేయంగా చేస్తామని ప్రకటించిన గత పాలకులు అలా ఎందుకు చేయలేదని సీఎం నిలదీశారు. తన ప్రసంగంలో ఉటంకించిన అందెశ్రీ గేయంలోని పదాలపై బీఆర్ఎస్ సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అభ్యంతరం తెలపడంపై స్పందిస్తూ, తాను రచయితను కాదని, అందెశ్రీ రాసిన గేయాన్ని తాను యథావిథిగా చదివినట్టు చెప్పారు. ఇకముందు ఏదైనా గేయాన్ని ఆలపించాల్సి వస్తే తప్పనిసరిగా దేశపతితో సలహాలు తీసుకుంటానని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యం తెస్తాం
సోనియమ్మ నాయకత్వంలో రాష్ట్రంలో కచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం తెస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. దళితులు, గిరిజనులకు అసైన్డ్ భూములిస్తాం. పోడు పట్టాలిస్తాం. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాం. పేదలకు ఆరోగ్యశ్రీ ఇస్తాం. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తాం.. ఇలా ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. మా ప్రభుత్వం తెలంగాణకు స్వేచ్ఛ ఇస్తుంది, సమానత్వం కల్పిస్తుంది. ఇందిరమ్మ ఇంట్లో ఉంటూ ఎడ్మ బొజ్జు ఈ రోజు ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. బలహీన వర్గానికి చెందిన బీర్ల ఐలయ్య, ఈర్లపల్లి శంకరయ్య, మందల సామేలు.. ఇలా అంత్యంత పేదలకు కాంగ్రెస్ న్యాయం చేసింది’ అని చెప్పారు.
డ్రగ్స్పై ఉపేక్షించేది లేదు
గత ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరిగిందని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ఆ కేసుల విచారణలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మాత్రం డ్రగ్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంపై అందరూ ఒకే త్రాటిపై ఉంటే రాష్ర్టానికి మేలు జరుగుతుందని ప్రతిపక్షాలను కోరారు. ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య అని తెలిపారు. ఆరు గ్యారెంటీలతోపాటు ప్రజలకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అనే ఏడో గ్యారెంటీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని సీఎం తెలిపారు.