హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం తాజ్కృష్ణ హోటల్లో మూసీ ప్రాజెక్ట్కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నదీ పరీవాహక ప్రాంతాల ఆధారంగా ప్రపంచంలోని అనేక నగరాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు, సింగపూర్, లండన్, సియోల్, సబర్మతి వంటి దేశ విదేశాల నదీ ప్రాజెక్ట్లను పరిశీలించిన అనంతరం మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందించిందని తెలిపారు.
రెండేండ్లుగా అధికారులు, నిపుణులు, కన్సల్టెంట్లతో చర్చలు జరిపి నగరావృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 1908లో ఈసా, మూసీ నదులు ఉప్పొంగి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన నేపథ్యంలో అప్పటి నిజాం రాజు ప్రముఖ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహాలతో ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాలను నిర్మించారని, మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఎన్నో చారిత్రాత్మక కట్టాడాలు నిర్మించారని గుర్తుచేశారు. తారామతి బారాదరి, హైకోర్టు, సిటీ కాలేజీ, ఉస్మానియా దవాఖాన వంటి ఎన్నో చారిత్రక నిర్మాణాలు ఏర్పాటయ్యాయని, చార్మినార్ నిర్మాణంతో ప్రపంచంలోని అన్ని వస్తువులు ఆ పరిసరాల్లో దొరికేలా అభివృద్ధి చేశారని తెలిపారు.
ఆ వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. ప్రస్తుతం మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో మురుగునీరు, చెత్త, జంతు అవశేషాలు చేరడంతో ఈ ప్రాంతవాసులు, నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు పునరావాసం కల్పిస్తూ వారికి 10,500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తామని చెప్పారు. వారు ఉంటున్న పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లోనే కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే ఆ పరిసరాల్లో ఉంటున్న పేదల వివరాలు సేకరించామని వెల్లడించారు. గతంలో వరదలు వచ్చినప్పుడు మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు సర్వస్వం కోల్పోయారని చెప్పారు.
ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు నిర్మించే సమయంలోనూ భూములు కోల్పోయారని, అభివృద్ధి జరగాలంటే నష్టం ఉంటుందని, తగిన పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లా మారిందని, భూమిలోకి నీళ్లు వెళ్లడం లేదని చెప్పారు. హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని, ఇప్పుడు ప్రపంచం మనవైపు చూస్తున్నదని, దీన్ని కాపాడుకుందామా? వదిలేద్దామా? అని ప్రశ్నించారు. అందరి సహకారంతో ఈ విషయంలో అసెంబ్లీలోనూ చర్చిస్తామని, అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. మూసీకి సంబంధించిన వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చామని, ఎవరైనా మూసీ అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని సూచించారు. అందరం కలిసి ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్దామని, మన చరిత్రను భవిష్యత్తు తరాలకు అందిద్దామని సూచించారు.