CM Revant Reddy | త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, విద్యా శాఖ కమిషనర్ దేవసేన పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదిక అందచేయాలని అధికారులను సీఎం ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల పనితీరుపై సవివరమైన నివేదికతోపాటు, రాష్ట్రంలో ఎక్కడ జూనియర్ కళాశాలలు అవసరం ఉన్నాయో వాటి వివరాలు వెంటనే సమర్పించాలని కోరారు. ప్రధానంగా బాలికల కోసం జూనియర్ కళాశాలలు ఎక్కడ అవసరమో పరిశీలించి వాటికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.