2022, జూలై 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చారు. సీఎం కేసీఆర్ పేరెత్తలేదు.
2022,నవంబర్ 12వ తేదీన ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు నరేంద్ర మోదీ మళ్లీ హైదరాబాద్కు వచ్చారు. కేసీఆర్ మాటెత్తలేదు.
2023, ఏప్రిల్ 8వ తేదీన వందేభారత్ రైలును ప్రారంభించటానికి మోదీ మరోసారి హైదరాబాద్కు వచ్చారు. కేసీఆర్ పేరు ప్రస్తావించలేదు.
PM Modi | హైదరాబాద్, జూన్ 27, (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ) : మోదీ మొదటిసారి తెలంగాణ పర్యటనకు రావడానికి ముందే కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. కానీ దాన్ని తాను గుర్తించనట్టు, కేసీఆర్ రాకకు ప్రాధాన్యమేదీ లేనట్టు, అది తాను పట్టించుకోవాల్సిన అంశమే కాదన్నట్టు మోదీ నటించారు. భారతదేశ ప్రస్థానంపై కేసీఆర్ సంధించిన ప్రశ్నల పరంపరను విస్మరించడం ద్వారా, అవి తాను జవాబివ్వాల్సినవి కావని భ్రమింపజేయడానికి మోదీ ప్రయత్నించారు. కేసీఆర్ ప్రశ్నలకు జవాబిస్తే ఆయన ఉనికిని తాను గుర్తించినట్టు అవుతుందనీ, తద్వారా ఆయన జాతీయ రాజకీయ ప్రవేశాన్ని అంగీకరించినట్టు అవుతుందని అనుమాన పడ్డారు. దేశ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావమేమీ ఉండదని తన చేతల ద్వారా చాటి చెప్పడానికి విఫలయత్నం చేశారు. కానీ సెగ తగిలింది.
తెలంగాణ మాడల్గా మొదలైన గులాబీ ప్రయాణం మహారాష్ట్రలో మహాప్రస్థానమై, మధ్యప్రదేశ్ను సైతం తాకే సరికి, ఇక మాట్లాడక తప్పలేదు ప్రధాని నరేంద్ర మోదీకి! కేసీఆర్ పేరును ఉచ్ఛరించక తప్పలేదు. భారతదేశ పరిస్థితిపై, పరివర్తనపై కేసీఆర్ వేసిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేని మోదీ, కేసీఆర్పై వ్యక్తిగత విమర్శలు చేయటం ద్వారా తన అక్కసు బయటపెట్టుకున్నారు. “కేసీఆర్ కుటుంబం బాగుండాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి. మీ కుటుంబం బాగుండాలంటే బీజేపీకి ఓటేయండి” అంటూ మంగళవారం మధ్యప్రదేశ్లోని భోపాల్లో మోదీ వ్యాఖ్యానించారు. కుటుంబ పాలనపై పాత చింతకాయ పచ్చడిలాంటి విమర్శను, అందునా నాలుగు రోజుల కిందే సోషల్మీడియాలో బీజేపీ శ్రేణులు వైరల్ చేసిన పోస్టును ఎంచుకుని, కేసీఆర్ను విమర్శించడం ద్వారా మోదీ తన రాజకీయ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కుటుంబ పాలన అనే బీజేపీ విమర్శకు బీఆర్ఎస్ ఎప్పుడో దీటైన జవాబు చెప్పింది. కుటుంబ సభ్యులైనంత మాత్రాన రాజకీయాల్లోకి రాకుండా ఎవరినీ నిరోధించలేమనీ, ప్రజలు ఆదరించినంత కాలం వారు రాజకీయాల్లో కొనసాగుతారని స్పష్టంచేసింది.
బీజేపీ కూడా అనేకమంది కుటుంబ సభ్యులకు టికెట్లు, నేతలకు పదవులు ఇచ్చిందని పేర్లతో సహా అనేకసార్లు గుర్తుచేసింది. జాబితాలు విడుదల చేసింది. మొన్నటికి మొన్న కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు నేతల కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చిన బీజేపీ బండారాన్ని బీఆర్ఎస్ బయటపెట్టింది. ఈ వాస్తవాలను గుర్తించకుండా మోదీ రొడ్డకొట్టుడు విమర్శను ఎంచుకుని కేసీఆర్ను విమర్శించడం, బీఆర్ఎస్ వ్యాప్తి పట్ల ఆయన భయాన్ని సూచిస్తున్నదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. “కొద్ది నెలల క్రితం దాకా తెలంగాణకు మూడు సార్లు వచ్చిన మోదీ.. కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్తావనే తేలేదు. ఇవాళ మధ్యప్రదేశ్లో, అందునా బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన కేసీఆర్ పేరును ప్రస్తావించడం మారుతున్న రాజకీయ పరిణామాలకు సూచిక. మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టిస్తున్న కేసీఆర్, తన నెక్ట్స్ టార్గెట్ మధ్యప్రదేశేనని ఇప్పటికే ప్రకటించారు. ఇదే మోదీ భయానికి కారణమై ఉంటుంది” అని సీనియర్ పాత్రికేయుడొకరు విశ్లేషించారు. ప్రధాని మోదీ కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ ప్రత్యక్ష విమర్శలకు దిగడం ఇదే మొదటిసారి. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్, ముఖ్యంగా కేసీఆర్ జోరును తట్టుకోలేకనే భోపాల్లో ప్రధాని తన అక్కసును వెళ్లగక్కి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇతర రాజకీయ నాయకుల్లాగా కాకుండా కేసీఆర్కు హిందీ, ఇంగ్లిషుల్లో ప్రావీణ్యం ఉండటమే కాదు… ఆయన వ్యక్తిగత, రాజకీయ విమర్శలు చేయకుండా, దేశాభివృద్ధిని ఎజెండాగా చేసుకుని, సూటిగా ప్రశ్నలు వేస్తున్నారు. ఇవి నేరుగా మేధావుల, ప్రజల మదిలో నాటుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీకి సెగ తగులుతున్నదని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి కూడా తెలంగాణతోపాటే ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ మాడల్కు ఆకర్షితులైన మధ్యప్రదేశ్ నా యకులు బుద్ధసేన్ పటేల్, తదితరులు హైదరాబాద్కు వచ్చి మరీ బీఆర్ఎస్లో చేరారు. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నది. రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ వల్ల ము ప్పు పొంచి ఉండటం వల్లే మోదీ అక్కడ కేసీఆర్- బీఆర్ఎస్ పేరును ప్రస్తావించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్ లో దాని పేరును ప్రస్తావించడం ద్వారా మోదీ బీఆర్ఎస్ జాతీయ హోదాను గుర్తించినైట్టెం ది” అని ఒక విశ్లేషకుడు చమత్కరించారు. ముఖ్యంగా ఫ్రంట్లు టెంట్లు లేవంటూ సింగిల్ గా రంగంలోకి దిగిన బీఆర్ఎస్ జాతీయ పార్టీలకూ ముచ్చెమటలు పోయిస్తున్నది. ఉత్తరాది లో బీఆర్ఎస్ దూకుడుకు రోజు రోజుకు బీజే పీ, కాంగ్రెస్లు ఉలిక్కిపడుతున్నాయి. అందు కే ఆ రెండు పార్టీల అగ్రనేతలూ కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ముప్పేట దాడికి దిగుతున్నారు.
మోదీ వ్యాఖ్యలను పక్కనబెడితే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ‘కేసీఆర్ హఠావో…తెలంగాణ బచావో’ అని పిలుపునిచ్చి, బీఆర్ఎస్ ప్రకంపనలు తనకూ తాకుతున్నాయని చాటుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇప్పటికే కునారిల్లిపోగా, బీఆర్ఎస్ దెబ్బకు మహారాష్ట్రలో కాంగ్రెస్ కూ టమి కకావికలు అవుతున్నది. మహావికాస్ అఘాడిలోని కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, శివసేన పార్టీలకు చెందిన అనేకమంది ముఖ్య నాయకులు స్వచ్ఛందంగా వచ్చి బీఆర్ఎస్లో చేరుతున్నా రు. మరోవైపు మహారాష్ట్ర బీజేపీకి చెం దిన అనేకమంది ప్రముఖులు గులాబీ నీడన చేరుతున్నారు. మహారాష్ట్రకు వెళ్లి న కేసీఆర్కు అక్కడ ప్రజల నుంచి ల భించిన ఆదరణతో మహారాష్ట్రకు చెంది న పార్టీలు భయపడిపోతున్నాయి. కేసీఆర్ పేరు చెబితే కాంగ్రెస్, బీజేపీ నేతలు కలలో కూడా ఉలికిపడుతున్నారు. మ హారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే శివసేన, మహారాష్ట్ర పీసీసీ నేతలు మూకుమ్మడిగా కేసీఆర్ను టార్గెట్గా చేసుకుంటున్నారు. మొత్తమ్మీద ఆయా పార్టీల ఉలికిపాటే బీఆర్ఎస్కు జాతీయస్థాయిలో పెరుగుతున్న ఆదరణకు అద్దం పడుతున్నదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.