హైదరాబాద్ : గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలెజ్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో మాట్లాడి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అత్యవసరమైతే తప్పా ప్రజలకు ఇండ్లకు బయటకు రావొద్దని సీఎం కేసీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భారీ వర్షాల నేపథ్యంలో నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని, పరిస్థితులను నిశితంగా గమనిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలని చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వర్షాలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, ఆయాశాఖల ఉన్నతాధికారులతో సమీక్షించి, వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై చర్చించనున్నారు. జిల్లాల వారీగా వర్షాల పరిస్థితిని సమీక్షించనున్నారు. ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు చేపట్టిన సహాయక చర్యలు తెలుసుకోనున్నారు. ఇంకా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.