హైదరాబాద్ : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళల స్వయం సమృద్ధి కి ఎప్పుడూ లేనంతగా కృషి జరుగుతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఆయా సంఘాల మహిళలకు, ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించే కార్యక్రమంలో భాగంగా.. శిక్షణ పూర్తి చేసుకున్న బ్యాంకింగ్ సఖిలకు డివైస్ పంపిణీ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..గతంలో 2 లేదా 3 కోట్లు రుణాలు దొరికేవి కావు. ఇవ్వాళ రూ. 18 వేల కోట్లు రుణాలు అందుతున్నాయని తెలిపారు. మహిళలు నమ్మకానికి నిదర్శనం. మహిళల్లో చైతన్యం, పట్టుదల పెరిగింది. ఆర్థికంగా బాగా బలపడ్డారని మంత్రి తెలపారు.
గ్రామాలకు మంచినీటి సదుపాయాలు కలిగాయి. మహిళలు రోడ్ల మీదకు నీటికోసం రావడం తగ్గిపోయిందన్నారు. గతంలో గ్రామాలకు వెళ్లాలంటే భయం కలిగేది. ఇప్పుడు గ్రామాల్లో కరెంటు, మంచినీరు, సాగు నీరు, పరిశుభ్రమైన పల్లెలు దర్శన మిస్తున్నాయి. పట్టణాలు, నగరాల నుండి గ్రామాలకు ప్రజలు వలస వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
భవిష్యత్తులో బ్యాంకు సఖిల ప్రాధాన్యం పెరుగుతుంది. ఓపికగా పని చేయండి. అభివృద్ధిని సాధించాలని మంత్రి సూచించారు. ప్రజల సేవల కోసమే మహిళా స్వయం సంఘాలకు శిక్షణ ఇచ్చి, బ్యాంకు సఖీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో నాబార్డు జి.ఎం. సెల్వం, ఎస్.బి.ఐ డి.జి.ఎం. నటరాజన్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజ కిషోర్, సెర్ప్ బ్యాంకు లింకేజీ డైరెక్టర్ వై.ఎన్.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.