యాదాద్రి, జనవరి 7 : రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఈ నెల 10 వరకు రూ.50,600 కోట్ల మైలురాయి దాటుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అద్భుతమైన పథకం రైతుబంధు అని, వాడవాడలో రైతుబంధు వారోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకొంటున్నారని తెలిపారు. బడి పిల్లల నుంచి వృద్ధుల వరకు రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొని సీఎం కేసీఆర్కు అభినందనలు తెలియజేస్తున్నారని చెప్పారు. కొవిడ్ కారణంగా బ్రెజిల్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, అమెరికా వంటి దేశాల్లో పత్తి సాగు తీవ్రంగా పడిపోయిందన్నారు. రాబోయే మూడేండ్ల వరకు పత్తికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం పత్తి క్వింటాల్కు రూ.10,200 వరకు పలుకుతుందని.. రైతులంతా పత్తి పండించి లాభాలు గడించాలని కోరారు. ప్రైవేట్ కంపెనీలు ఒప్పందం చేసుకొని కొనుగోలు చేస్తామంటే రైతులు వరి వేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. కేసీఆర్ పాలనలో సంబురాలు జరుపుకొంటున్నారని చెప్పారు. ఎక్కడో ఉన్న గోదావరి జలాలను 600 మీటర్ల పైకి ఎత్తిపోసి వివిధ ప్రాంతాలతోపాటు యాదాద్రిలోని నృసింహస్వామి చెంతకు తీసుకొచ్చామని తెలిపారు. అనంతరం మంత్రి నిరంజన్రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.