(నాందేడ్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి బృందం): అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. అదానీతో లోపాయికారీ ఒప్పందమేదీ లేకపోతే.. ఆయన గోల్మాల్ వ్యవహారంపై విచారణకు జేపీసీ వేసేందుకు మోదీ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతున్నదని నిలదీశారు. ప్రధానికి అదానీ మీద ఉన్న ప్రేమ, ప్రజలపై లేదా అని ప్రశ్నించారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ. లాభాల బాటలో ఉన్న ఎల్ఐసీని అమ్మడానికి సిద్ధమైంది మోదీ ప్రభుత్వం.
ఎందుకు ఎల్ఐసీ రూ.37వేల కోట్లు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది? ఆ మేరకు ఎవరి దానిపై ఒత్తిడి చేశారు? ఏమీ నష్టపోలేదని ఎల్ఐసీతో ఎందుకు చెప్పించాల్సి వచ్చింది? మున్ముందు అన్ని విషయాలు బయటకు వస్తాయి. అంతా సవ్యంగా ఉంటే అదానీపై పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు? నిజాయితీ ఉంటే.. సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేసి అదానీ ఉదంతంపై విచారణ జరపాలి’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు. అదానీ మోదీ మిత్రుడు కావడం వల్లేనే రెండేండ్లలో ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించగలిగాడని, ఇది జగమెరిగిన సత్యమని వెల్లడించారు.
నాందేడ్లో ఆదివారం నిర్వహించిన చేరికల సభ ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. జాతీయ, స్థానిక మీడియా ప్రతినిధులతో పలు విషయాలను పంచుకున్నారు. బీఆర్ఎస్ ఒక మిషన్ అని స్పష్టంచేశారు. ‘చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో చట్టం చేస్తాం. యావత్దేశానికి 24గంటల విద్యుత్తును, సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తాం. ప్రైవేట్పరమైన సంస్థలన్నింటినీ తిరిగి జాతీయం చేస్తాం.
శాస్త్రీయ పద్ధతిలో రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చేపడతాం. కుల,మత భేదాల్లేకుండా ప్రజలంతా కలిసి జీవించాలన్నదే బీఆర్ఎస్ అభిమతం. అందుకు కావాల్సిన, తీసుకోవాల్సిన చర్యలపై, అనుసరించాల్సిన వ్యూహాలపై, రూపొందించాల్సిన ప్రణాళికలపై ఆయా రంగాల నిపుణులతో, న్యాయవాదులు, విశ్రాంత ఐఏఎస్లు, ఐపీఎస్లు చర్చిస్తున్నాం. రంగాల వారీగా బీఆర్ఎస్ విధానాలను రూపొందిస్తున్నాం. త్వరలో ఢిల్లీలో సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ ఎజెండాను దేశం ముందుంచుతాం’ అని కేసీఆర్ వెల్లడించారు.
గుణాత్మక మార్పే లక్ష్యం
దేశంలో నూతన రాజకీయ విధానం అమలు కావాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. జపాన్, మలేషియా, సౌత్కొరియా దేశాల్లో జరిగిన అభివృద్ధిని ఉదహరించారు. ‘ఎలాంటి సాధనాసంపత్తి లేని సింగపూర్ కానీ, అణువిధ్వంసం తర్వాత జపాన్ కానీ, దక్షిణ కొరియా, మలేషియా కానీ అద్భుత ప్రగతిని సాధించాయి. అన్ని వనరులూ ఉండి కూడా మనదేశం ఎందుకు వెనుకబడి ఉన్నది? ’ అని ఆయన ప్రశ్నించారు. ఆయా దేశాల్లో అతితక్కువ సమయంలో అద్భుతాలు సృష్టించడానికి చిత్తశుద్ధి, రాజకీయ దృక్కోణమే కారణాలని చెప్పారు. భారత పాలకులకు మాత్రం అలాంటి భావన కొరవడడమే దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎన్నికల్లో అంతిమ గెలుపు ప్రజలది కావాలనే సదాశయంతోనే బీఆర్ఎస్ను ఏర్పాటు చేశామని కేసీఆర్ చెప్పారు. పదవుల కోసం బీఆర్ఎస్ను ప్రారంభించలేదని, భారతీయ ఆలోచనావిధానంలో గుణాత్మక మార్పు తీసుకురావడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ‘బీఆర్ఎస్ రాజకీయాల కోసం కాదు. అది ఒక మిషన్. ఒక సంకల్పం. మార్పు తీసుకురావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ మందుకు సాగుతుంది’ అని కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు. దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని పేరర్కొన్నారు.
నూనత జలవిధానం అవసరం
పుష్కలమైన వనరులు ఉన్నప్పటికీ దేశంలో ఇంకెన్నిరోజులు నీటియుద్ధాలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘సట్లేజ్-రావి నదుల కోసం పంజాబ్-హర్యానా.. మహానది కోసం ఛత్తీస్గఢ్-ఒడిశా, గోదావరి జలాల కోసం మహారాష్ట్ర-తెలంగాణ- కర్ణాటక.. కావేరీ జలాల కోసం కర్ణాటక-తమిళనాడు కొట్టుకుంటున్నాయి. వనరులన్నీ ఉన్నప్పటికీ దేశం ఎందుకు వంచించబడుతున్నది? అవసరానికి మించి నీటిలభ్యత దేశంలో అందుబాటులో ఉన్నది. కేంద్రజలసంఘం చెప్పిన గణాంకాలను బట్టి చూస్తే.. 1.4 లక్షల టీఎంసీల నీరు వర్షం ద్వారా లభిస్తుంది.
సగం ఆవిరవుతుంది. మిగిలిన 70 వేల టీఎంసీల నీరు భారతీయ నదుల్లోకి వస్తుంది. 20-21 వేల టీఎంసీల నీరు మాత్రమే వాడుతున్నం. ఇంకో 10 వేల టీఎంసీలు వదిలేసినా.. ఇంకా 20-40 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నది. మన దేశ భూభాగం 32 లక్షల 87 వేల చదరపు కిలోమీటర్లు. అంటే 83 కోట్ల ఎకరాలు. దీంట్లో 41కోట్ల ఎకరాలు సాగుయోగ్యమైన భూమి. దమ్మున్న, చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం ఉంటే.. ప్రతి ఎకరాకూ పుష్కలమైన నీరు ఇవ్వొచ్చు. కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నది? అందుకే వాటర్ పాలసీలో విప్లవాత్మక ప్రతిపాదనను బీఆర్ఎస్ దేశం ముందు పెడుతున్నది. దేశ జలవిధానం సంపూర్ణంగా మార్చాలని కోరుతున్నది’ అని స్పష్టంచేశారు.
ట్రిబ్యునళ్ల పేరిట కాలయాపన
దేశంలో ట్రిబ్యునళ్ల పేరిట నదీజలాలపై రాజకీయాలు సాగుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘కృష్ణా ట్రిబ్యునల్ సంగతి చూస్తే.. 2004లో బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ను ఏర్పాటుచేశారు. ఇప్పటివరకు ఒక్క తీర్పు కూడా వెలువరించలేదు. దశాబ్దాల తరబడి నిర్ణయాలే జరుగకపోతే, కేంద్రం ప్రభుత్వం తమాషా చూస్తున్నదా?’ అని ప్రశ్నించారు. నదీజలాల విభజనపై ట్రిబ్యునళ్ల పేరిట దశాబ్దాలుగా సాగుతున్న వివాదాలను కేంద్ర తలచుకుంటే తక్షణం పరిష్కరించవచ్చని కేసీఆర్ తెలిపారు.
గోదావరి జల వివాదాలపై చర్చకు సిద్ధమే
గోదావరి జల వివాదాలను పరిష్కరించుకోవడానికి తాను పొరుగు రాష్ట్రంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బాబ్లీ వివాదంపై ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘చర్చించడానికి నేను సిద్ధమే. ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని నాతో చర్చించడానికి హైదరాబాద్ రమ్మనండి. ఆంధ్ర-కర్ణాటక-మహారాష్ట్ర ముఖ్యమంత్రులు విశాల దృక్పథంతో ఆలోచించి సమస్య పరిష్కారానికి ముందడుగు వేస్తే దానిని స్వాగతించేందుకు తెలంగాణ ఎప్పుడూ సిద్ధమే’ అని బదులిచ్చారు.
అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి కూడా లిఫ్ట్ ద్వారా మహారాష్ట్రలోని కరువుపీడిత ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. దానికి మహారాష్ట్ర పాలకులు ముందుకు రావాలని సూచించారు. నీటి యుద్ధాలు రూపుమాపేందుకు నూతన జలవిధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి తమ బీఆర్ఎస్ పాలసీలను ప్రకటిస్తామన్నారు.
విధానరాహిత్యం వల్లే బలవన్మరణాలు
దేశంలో చిత్తశుద్ధి లేని, విధానమంటూ లేని ప్రభుత్వాల కారణంగానే దేశంలో రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని కేసీఆర్ అన్నారు. ‘గోదావరి, కృష్ణాతోపాటు అనేక నదులు పుడుతున్న మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? యావత్మాల్ జిల్లాలో దేశంలోనే అత్యధికంగా రైతు బలవన్మరణాలు ఎందుకు నమోదవుతున్నాయి? ఇది పాలకులు సిగ్గుపడాల్సిన విషయం.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు మద్దతు కోరుతూ నానాపాటేకర్ అనే సినిమా నటుడు ట్రస్ట్ పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారని నేను ఫేస్బుక్లో చూశాను. అసలు ఇలా ఆత్మహత్యలు జరిగే పరిస్థితే ఎందుకు ఉత్పన్నమవుతున్నది’ అని ప్రశ్నించారు. దేశంలో విస్తృతమైన అవకాశాలున్నా.. ఫుడ్ ప్రాసెసింగ్పై ప్రభుత్వాలు దృష్టిసారించలేదని విమర్శించారు. ప్రపంచమంతటికీ ఆహారాన్ని అందించే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ను ఏర్పాటుచేసి దేశాన్ని ఫుడ్చైన్గా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. మేకిన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా మారిందని కేసీఆర్ విమర్శించారు.
దేశం మొత్తానికి విద్యుత్తు వెలుగులు
దేశంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నా కేంద్ర ప్రభుత్వం విదేశాల బొగ్గు దిగుమతికి ప్రాధాన్యమిస్తున్నదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఎక్కువ ధరకు విదేశీ బొగ్గును కొనాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెస్తున్నదని మండిపడ్డారు. దీనివెనక మతలబును ప్రజలందరూ గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. మోదీ ప్రభుత్వం దేశసంపదను ప్రైవేటీకరణ పేరిట దోచిపెడుతున్నదని మండిపడ్డారు. ‘లాభాలు ప్రైవేటుకు.. నష్టాలు ప్రజలకు’ అనే విధానాన్నే కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నదని, ఇంకెన్ని రోజులు ఇలాంటి ప్రభుత్వాలను సహించాలని ప్రశ్నించారు. ప్రజలు ఆశీర్వదించి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి తీసుకొస్తే దేశం యావత్ 24 గంటల విద్యుత్తు అందిస్తామని ప్రకటించారు.
ఆ సంస్థల్ని మళ్లీ జాతీయం చేస్తాం
‘విద్యుత్తు విషయానికి వస్తే.. 361 బిలియన్ టన్నుల బొగ్గు గనులు ఇండియాలో ఉన్నాయి. 50 శాతం వాడుకున్నా 125 ఏండ్లపాటు మొత్త దేశానికి విద్యుత్తును అందించవచ్చు. కానీ, ప్రభుత్వం అలా చేయడం లేదు. అదానీ పవర్, అంబానీ పవర్, జిందాల్ పవర్ అంటూ ప్రైవేటుకే కట్టపెడుతున్నది. ప్రపంచంలోని అన్ని సూచీలూ తలసరి విద్యుత్తు వినియోగాన్ని దేశ ప్రగతికి ఒక సూచికగా భావిస్తాయి. కానీ పవర్ సెక్టార్ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నది? మొత్తం విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరిస్తే.. ఏదో ఒకరోజు ప్రైవేటువ్యాపారులు ప్రభుత్వాన్ని బెదిరించే దుస్థితి ఏర్పడుతుంది’అని కేసీఆర్ హెచ్చరించారు.
లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ప్రభుత్వరంగాన్ని అప్పనంగా ప్రైవేటు వ్యాపారులకు కట్టబెడుతున్నారని, పవన్హన్స్ అనే ప్రభుత్వరంగ సంస్థ విషయంలోనూ అదే జరిగిందని గుర్తుచేశారు. పవన్హన్స్ ఇచ్చే బోనస్ కన్నా తక్కువ ధరకు ఆ సంస్థను ప్రైవేటుకు కట్టబెట్టారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రైవేట్ పరమైన అన్ని సంస్థలను తిరిగి జాతీయం చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం బీజేపీ వ్యాపారం ప్రభుత్వ పనికాదంటున్నదని, కానీ అవసరమైన చోట, విస్తృత ప్రజాప్రయోజనాలు ముడిపడినచోట తప్పనిసరిగా ప్రభుత్వం వ్యాపారం చేయాలని చెప్పారు.
మరోవైపు విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరించాలని చూస్తున్నదని, కోట్ల విలువైన కరెంటు ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను అమ్మేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఎల్ఐసీని ప్రైవేటీకరించినా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి జాతీయం చేస్తామని పునరుద్ఘాటించారు. సమావేశంలో తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీలు సంతోష్కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ కవిత, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, జోగురామన్న, జీవన్రెడ్డి, హన్మంత్ షిండే, మైనంపల్లి హన్మంతరావు, విఠల్రెడ్డి, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ జరగాలి
రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ జరుగాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చిన్న రాష్ర్టాల ఏర్పాటుపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేసీఆర్ పాలనాపరమైన సౌలభ్యం కోసం తాము చిన్నరాష్ర్టాల ఏర్పాటుకు సానుకూలమే అయినా దేశంలో పలు రాష్ర్టాల విభజనపై ఒక శాస్త్రీయమైన పాలసీ రూపొందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఆ దిశగా విస్తృత చర్చల అనంతరం రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణపై బీఆర్ఎస్ ముందుకుపోతుందని స్పష్టంచేశారు.
మహిళలకు 33శాతం రిజర్వేషన్
బేటీ బచావో బేటీ పడావో అంటారు, కానీ ఉత్తరభారతంలో ఎం జరుగుతుందో అందరికీ తెలుసుని, మహిళాభ్యుదయానికి సంబంధించి తమ పార్టీ పూర్తి పాలసీ డాక్యుమెంట్ తయారు చేస్తున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మహిళా సాధికారతకు బీఆర్ఎస్ పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. తాము అధికారంలోకి రాగానే గ్రామస్థాయి నుంచి కౌన్సిల్, అసెంబ్లీ, పార్లమెంట్ వరకు అన్ని రాజకీయా పదవుల్లో 33 శాతం రిజర్వేషన్ను అమలుచేస్తామని అన్నారు. అందుకు 6నెలల్లోపు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి, అనంతరం 33శాతం రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకొస్తామని పునరుద్ఘాటించారు.
నామ్ మే క్యాహై.. కామ్ చాహియే..!
బీజేపీ వాళ్లు హైదరాబాద్, భారత్ పేర్లను మార్చుతామంటున్నారు కదా. దానిపై మీరేమంటారని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా దానికి సీఎం కేసీఆర్ చమత్కారంగా సమాధానిమచ్చారు. ఓ నామ్ చేంజ్ కర్నేవాలే నాటక్ బాజీ కర్నావాలే హే.. కామ్ చేంజ్ కర్నేవాలే బీఆర్ఎస్ వాలే.. అంటూ దీటైన జవాబిచ్చారు. దీంతో మీడియా సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. మరో పాత్రికేయుడు ప్రధానమంత్రి మోదీ మీ పనిని మెచ్చి మైత్రి హస్తాన్ని అందిస్తే మీరు స్వీకరిస్తారా? అడగ్గా, ఆ ప్రశ్న పూర్తికాకముందే కేసీఆర్ మోదీని ప్రధానమంత్రిగానే గుర్తించడంలేదని ఘాటుగా జవాబిచ్చారు. అంతకుముందు ఇతర పార్టీల వాళ్లతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా అని పాత్రికేయుల ప్రశ్నకు, ముందు పాత పార్టీలకు ఆ ప్రశ్న వేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, మున్ముందు అన్ని విషయాలు వివరంగా చెప్తామని కేసీఆర్ జవాబిచ్చారు.
నాందేడ్ మీటింగ్ సైడ్ లైట్స్