మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన నూతన కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎంవీఎస్ డిగ్రీ కాలేజీలో సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సభా ఏర్పాట్లపై పార్టీ శ్రేణులు, అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం రాకముందు ఇదే గ్రౌండ్లో స్వరాష్ట్రం కోసం కేసీఆర్ సమావేశం జరిగిందని, ఇప్పుడు మళ్లీ ఇక్కడే రాష్ట్రం ఏర్పడ్డాక భారీ బహిరంగ సభ నిర్వహించుకుంటున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కొలువై ప్రజలకు సేవలు అందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత దేశంలో ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు చేపట్టారని అన్నారు. కలెక్టరేట్ కోసం హైవే పక్కనే స్థలం లభించడం అదృష్టమని, ప్రజలందరికీ అందుబాటులో అధికారులు ఉండనున్నారని తెలిపారు.
కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి తెలిపారు. ఒక్క ఏడాదిలో పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. బస్టాండ్ సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందన్నారు. డిసెంబర్ నెలలోనే నర్సింగ్ కళాశాల ప్రారంభం అవుతుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి వెంట కలెక్టర్ వెంకట్రావు అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా అధికారులు ఉన్నారు.