హైదరాబాద్ : గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది. అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలను కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించే అవకాశమున్నది. వరదల వల్ల ప్రజలకు జరిగిన కష్టనష్టాలను సీఎం ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. అవసరమైన మేరకు సహాయాన్ని ప్రకటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం.
అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లో ఉండి మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో కేసీఆర్ సమీక్షించనున్నట్టు సమాచారం. వరదల అనంతర పరిస్థితులను అంచనావేసి విద్యుత్తు, రోడ్లు, తాగునీరు, పంటలు తదితర రంగాల్లో జరిగిన నష్టాలను అంచనావేసి సహాయక చర్యల కోసం చర్యలు చేపట్టే అవకాశమున్నది. వరదల్లో అంటువ్యాధులు సోకకుండా అందే వైద్యసాయం గురించి వైద్యారోగ్యశాఖకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసే అవకాశమున్నదనీ విశ్వసనీయ వర్గాల సమాచారం.