హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం బెంగళూరులో పర్యటించనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలు, దేశంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత వైఖరి తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉన్నదని సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులతో సీఎం కేసీఆర్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్రాయ్, వ్యవసాయరంగ నిపుణుడు, ఆర్థికవేత్త అశోక్ గులాటీతో సమాలోచనలు జరిపారు. పంజాబ్ విత్తన తయారీ సంస్థలతోనూ ఆయన సమావేశమయ్యారు. తాజాగా దక్షిణాదిలో కీలక నేతలను కలిసేందుకు వెళ్తున్నారు. సీఎం వెంట టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. తిరిగి గురువారమే హైదరాబాద్ చేరుకొంటారు.
బెంగళూరులో సీఎం కేసీఆర్ స్వాగత ఫ్లెక్సీలు
సీఎం పర్యటన నేపథ్యంలో బెంగళూరు నగరంలోని ప్రధాన కూడళ్లల్లో కేసీఆర్ స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. సీఎం కేసీఆర్, మాజీ ప్రధాని దేవెగౌడ, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, శంభీపూర్రాజు, ఎల్ రమణ, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బాల్క సుమన్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తదితరుల ఫొటోలతో ‘దేశ్కీ నేత సీఎం కేసీఆర్.. బెంగళూరు ఆప్కీ హార్థిక్ స్వాగత్’, ‘దేశంలో విపక్ష పార్టీలను ఏకం చేసి.. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలుపెట్టనున్న సీఎం కేసీఆర్కు స్వాగతం’ అని తెలంగాణ సాయి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.