హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ)/నందిపేట్: మహారాష్ట్రలోని కాందార్ లోహలో ఈ నెల 26న జరగనున్న బీఆర్ఎస్ సభలో అద్భుతమైన తెలంగాణ మోడల్ను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజలకు నివేదిస్తారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ రూపొందించిన 16 వీడియో స్క్రీన్ వాహనాలను ఆదివారం జీవన్రెడ్డి ప్రారంభించారు. మహారాష్ట్రలోని కాందార్ లోహ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 16 తాలూకాల్లో ఉన్న 1,600 గ్రామాల్లో తెలంగాణ పథకాలపై ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వరప్రదాయినిలా లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తూ వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపి విశ్వఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను మహారాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఏడాదికి ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చేసే రైతుబంధు పథకం ఒక అద్భుత విజయమని పేర్కొన్నారు. రైతుబీమా, నిరంతర విద్యుత్తు తదితర పథకాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారి, నాయకులు నాగనాథ గీస్వడ్, తదితరులు పాల్గొన్నారు.
సభకు తరలిరండి..
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 26న కాందార్ లోహలో నిర్వహించనున్న సభకు రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్రావు కదం పిలుపునిచ్చారు. ఈ సభకు సన్నాహకంగా ఆదివారం పర్బనీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన సమావేశాలు నిర్వహించారు. సేలు, మావత్, పఠారి జింటూర్ తాలూకాల్లోని బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేసీఆర్ సభ విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలూ ఉచిత విద్యుత్తును అందజేయడంతోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా తదితర సంక్షేమ పథకాలను మహారాష్ట్రలోని ప్రతి రైతుకూ వివరించి మద్దతు కూడగట్టాలని సూచించారు. సన్నాహాక సమావేశాల్లో బీఆర్ఎస్ మహారాష్ట్ర ముఖ్య నాయకులు పవన్ కార్వార్, రంగనాథరావు చోప్డే, అబ్దుల్ భాయ్, షేక్ జాఫర్, బాలాసాహెబ్ ఆల్నే, రహీమ్ మాఝీ తదితరులు పాల్గొన్నారు.