సిద్దిపేట, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఈ నెలాఖరులో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణలో ఎవరూ ఊహించని స్థాయిలో గొల్ల కురుమలు, మత్స్యకారుల అభివృద్ధి జరుగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతి ప్రతిపక్షాలకు కనిపించడం లేదని, కండ్లున్నా చూడలేని కబోదుల్లా మారారని ఎద్దేవాచేశారు. సిద్దిపేటలో నిర్మించనున్న పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విద్యాలయ భవన సముదాయానికి మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మత్స్య సొసైటీల్లో 3.72 లక్షల మంది సభ్యులు ఉన్నారని, మరో లక్ష మందికి సభ్యత్వం ఇస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నట్టు వివరించారు. కమిట్మెంట్ ఉన్న నాయకత్వం ఉంటే ఏదైనా సాధ్యమేనని, నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన సుదీర్ఘ పోరాటానికి నేటి పచ్చని తెలంగాణ సమాధానమని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, ప్రజలు వాస్తవాలు గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో 24 గంటల నిరంతరాయ కరెంట్ ఇస్తున్నామని, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని స్పష్టంచేశారు.
180 కోట్లతో పశువైద్య కళాశాల భవనాలు
సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పశువైద్య కళాశాల మంజూరు చేశారు. ఆదివారం సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.180 కోట్లతో పశువైద్య కళాశాల సముదాయం నిర్మాణానికి మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్, కోరుట్ల, వరంగల్లో ఉన్న మూడు పశువైద్య కళాశాలల ద్వారా సుమారు 240 మంది పశు వైద్యులు ఉత్తీర్ణులవుతున్నారు.
రాష్ట్రంలో ఉన్న పశుసంపద, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని పశు వైద్యులను తీర్చిదిద్దేందుకు ఈ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. బోధనా సిబ్బందిని నియమించడంతోపాటు 30 ఎకరాల స్థలం కేటాయించారు. కళాశాలలో బ్యాచ్లర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, పశుసంవర్ధక కోర్సుల్లో ఏటా 80 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. కళాశాలకు కావాల్సిన వివిధ అనుమతుల కోసం భారత పశువైద్య మండలికి ప్రతిపాదనలు పంపగా.. తనిఖీ బృందం కళాశాల మౌలిక వసతులను పరిశీలించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
గొల్ల, కురుమలకు 11 వేల కోట్లు: మంత్రి హరీశ్రావు
మత్స్య సంపద అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, మాంసం ఉత్పత్తిలో నంబర్ వన్గా నిలిచిందని మంత్రి హరీశ్రావు తెలిపారు. గొల్ల, కురుమల అభ్యున్నతి కోసం రూ.11 వేల కోట్లు ఇచ్చిన ఏకైన నేత కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో రెండో విడతలో 3.70 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేస్తామని తెలిపారు. 108మాదిరిగానే పశువులకు 1962 అంబులెన్స్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. 1962తోపాటు రైతుబంధు, మిషన్ భగీరథలాంటి కార్యక్రమాలను కేంద్రం కాపీ కొట్టి దేశంలో అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ జనాభా 3% శాతం కంటే తక్కువ ఉండగా, జాతీయ అవార్డుల్లో 38% అవార్డులు రాష్ర్టానికే వస్తున్నాయని పేర్కొన్నారు.
కేంద్రం తెలంగాణకు అవార్డులు ఇస్తుంటే బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు గల్లీలో విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీలో మెచ్చుకుంటూ గల్లీలో తిడతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఘాట్ కట్టడానికి అనుమతి ఇయ్యలేదని, కానీ, పశు వైద్యశాలకు పీవీ పేరు పెట్టి వారి గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని తెలిపారు. కాళోజీ, కొండా లక్ష్మణ్బాపూజీ పేర్లతో వర్సిటీలు ఏర్పాటుచేశామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లో జలసిరి పెరిగిందని తెలిపారు. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.