Yadadri | దాదాపుగా పూర్తికావస్తున్న యాదాద్రి ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగిన కేసీఆర్.. పలు సూచనలు చేశారు.
సోమవారం మధ్యాహ్నం యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. బాలాలయంలో లక్ష్మీనారసింహుడికి సీఎం కేసీఆర్ పూజలు చేశారు. అర్చకులు సీఎం కేసీఆర్కు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ఈవో స్వామివారి ప్రసాదాన్ని సీఎంకు అందజేశారు.
కళ్యాణ కట్ట , పుష్కరిణీ నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. 75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న సుదర్శన యాగం ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణాలను సీఎం పరిశీలించారు. పుష్కరిణీ లో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత… స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలనూ సీఎం పరిశీలించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్, మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు.